వికారాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): శాసనసభాపతిగా గడ్డం ప్రసాద్కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మూడోసారి వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. ఎంపీటీసీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ఆరంభమై ఉన్నతమైన స్పీకర్ పదవి దక్కడంపై వికారాబాద్ నియోజకవర్గంతోపాటు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన 21 ఏండ్ల రాజకీయ జీవితంలో గడ్డం ప్రసాద్కుమార్ 2002లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మర్పల్లి మండలంలోని కొంశెట్టిపల్లి నుంచి ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా ఎన్నికయ్యారు. అనంతరం 2008లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా వికారాబాద్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు.
2009 ఏప్రిల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ వికారాబాద్ నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ పార్టీ తరపున రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి అప్పటి కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వంలో చేనేత, జౌళిశాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా రెండు పర్యాయాలు ఓడిపోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రసాద్కుమార్ వికారాబాద్ సెగ్మెంట్ నుంచే మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రస్తుతం స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్గా ఎంపిక కావడంపై హర్షిస్తూ ప్రసాద్కుమార్కు పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డిలతోపాటు జిల్లాకు చెందిన పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.