పండ్ల తోటల సాగులో రంగారెడ్డి జిల్లా ముందువరుసలో ఉన్నది. జిల్లావ్యాప్తంగా 29,104 ఎకరాల్లో మామిడి, నారింజ, నిమ్మ, దానిమ్మ, జామ, బత్తాయి, వాటర్ మెలన్, సపోట, రేగు, సీతాఫలం, అల్లనేరేడు, తునికి, అరటి తదితర తోటలను సాగు చేశారు. ఇందులో కొన్ని తోటల్లో పంట చేతికొస్తుండడంతో హైదరాబాద్లోని గడ్డి అన్నారం (బాట సింగారం) మార్కెట్కు తరలిస్తుండగా, అక్కడి నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్, ఢిల్లీ రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆశించిన మేరకు ఈ ఏడాది ఆయా రకాల పండ్లు లక్షా 68 వేల 18 మెట్రిక్ టన్నుల దిగుబడి రావడంతో మంచి లాభాలొచ్చాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహా నగరాన్ని ఆవరించి ఉన్న రంగారెడ్డి జిల్లా రియల్ ఎస్టేట్ రంగంలోనే కాకుండా వ్యవసాయ రంగంలోనూ రాణిస్తూ తనదైన ముద్ర వేసుకున్నది. పలు రకాల పంటల సాగులో పొరుగు జిల్లాలతో పోల్చుకున్నప్పుడు రంగారెడ్డి జిల్లా ముందంజలో ఉంది. వరి, పత్తి, చెరకు, పలు రకాల ధాన్యం పంటలను సాగు చేయడమే కాకుండా ఆకు కూరలు, కూరగాయల్లోనూ జిల్లా పెద్ద ఎత్తున సాగు చేస్తూ ఊహకు అందని విధంగా దిగుబడిని తీసుకొస్తున్నది. ఇదే, కాకుండా వివిధ రకాల పండ్ల తోటల సాగును చేపడుతూ, భారీ ఎత్తున దిగుబడిని తీసుకొస్తున్నది. ఆరుతడి పంటల మాదిరిగా పలు రకాల పండ్ల తోటల పెంపకం కూడా తక్కువ పాళ్లలో నీటిని వినియోగించుకుంటుంది. రైతులను వరి సాగు, వేరు శనగ, పత్తి మొదలైన పంటల లాగా పండ్ల తోటల సాగు ఇబ్బందికి గురిచేసే దాఖలాలు తక్కువ. బిందు (డ్రిప్ ఇరిగేషన్) సేద్యాన్ని చాలా వరకు ఉపయోగిస్తున్నారు.
ఈ సాగులో విద్యుత్తో పాటు నీరు ఆదా అవుతుంది. తోటల పెంపకంలో కలుపు సమస్య కూడా చాలా తక్కువ. అయితే, పోషక విలువలున్న పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. అలాంటి పండ్ల సాగుకే మంచి డిమాండ్ ఉంది. జిల్లాలో 15 రకాల పండ్ల సాగు కొనసాగుతున్నది. మొత్తం 29,104 ఎకరాల్లో పండ్ల తోటల వ్యవసాయం కొనసాగుతున్నట్టు జిల్లా ఉద్యానవన అధికారులు చెబుతున్నారు. రికార్డు స్థాయిలో పంట దిగుబడిని తెస్తూ రైతులు అధిక లాభాలు గడిస్తున్నారు. తక్కువ శ్రమ, పెట్టుబడితో అధిక దిగుబడిని, లాభాలను ఆర్జిస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. మామిడి పంటలో ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు లాభం చేకూరుతున్నది. పలు రకాల పండ్ల పంటలను హైదరాబాద్లోని గడ్డి అన్నారం (బాట సింగారం) మార్కెట్కు, పొరుగు రాష్ర్టాలు మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, మొదలైన మార్కెట్లకు తరలిస్తున్నారు. ఖర్చులన్నీ పోనూ పెద్ద మొత్తంలో మిగులు చేకూరుతుందని రైతులు చెబుతున్నారు.
సంప్రదాయ పంటల కంటే ఇవే.. శ్రేయస్కరం
మిగతా పంటల వలె కాకుండా 40 నుంచి 50 శాతం వరకు పండ్ల తోటల సాగులో నీరు, విద్యుత్ ఆదా అవుతున్నట్లు అధికారులు, రైతులు చెబుతున్నారు. నిమ్మ లాంటి తోటలు మూడు కాలాల్లోనూ పంటను చేతికి అందిస్తున్నది. బత్తాయి ఎనిమిది నుంచి తొమ్మిది నెలల మధ్య పక్వానికి వస్తాయి. బత్తాయి నాటిన నాలుగో ఏట నుంచి కాతకు వస్తుంది. అయితే, ఆరో ఏట నుంచి వ్యాపార పరమైన కాపును ఇస్తుంది. ఇలా చూసుకుంటూ పోతే, మామిడి, నారింజ (ఆరెంజెస్), జామ, అరటి, దానిమ్మ, వాటర్మెలన్, మస్క్మెలన్, బత్తాయి లాంటివి ప్రధానంగా ఇక్కడ సాగులో ఉన్నాయి. ఇంకా సపోట, ఫిగ్, రేగుపండు, డ్రాగన్ ఫ్రూట్, లిచి, సీతాఫలం, అల్లనేరేడు, తునికి పండ్ల లాంటివి అక్కడక్కడా స్వల్పంగా సాగు చేస్తున్నారు. వీటి సాగుకు పెద్దగా పెట్టుబడి, శ్రమ, వ్యయ ప్రయాసలు ఉండే అవకాశాలు లేవు. విత్తుతున్న సందర్భంలో, ఎదిగేందుకు కాస్త జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కాతకు అవే వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మామిడి సాగే.. అధికం
జిల్లాలో మామిడి తోటల సాగును అధికంగా చేపడుతున్నారు. 21,700 ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేయగా, ఏడాదికి 95,481 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. నారింజను 331 ఎకరాల్లో సాగు చేయగా, 3,311 మెట్రిక్ టన్నుల్లో దిగుబడి వస్తుంది. నిమ్మను 144 ఎకరాల్లో సాగు చేయగా, 1,154 మెట్రిక్ టన్నుల్లో దిగుబడి వస్తుంది. జామను 4,750 ఎకరాల్లో సాగు చేయగా, 38,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. 29 ఎకరాల్లో అరటి పండ్ల సాగు చేపట్టగా, 536 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. 447 ఎకరాల్లో దానిమ్మ పంట వేయగా, 3,128 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. కాగా, ఇతరాలైన మరికొన్ని పండ్ల తోటలను 1587 ఎకరాల్లో సాగు చేయగా, 98,522 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఎక్కడెక్కడ ఏయే సాగు…
జిల్లాలో మామిడి సాగు అధికంగా ఫరూఖ్నగర్, మొయినాబాద్, కేశంపేట, తలకొండపల్లి కందుకూరు, ఇబ్రహీంపట్నం, షాబాద్, యాచారం, శంషాబాద్, మహేశ్వరం ఇంకా పలు మండలాల్లో సాగులో ఉన్నాయి. ఆరెంజెస్ మాడ్గుల, ఆమనగల్లు, కందుకూరు, కేశంపేట, తలకొండపల్లిలో సాగవుతున్నాయి. నిమ్మ పంట శంకర్పల్లి, మంచాల, చేవెళ్లలో సాగులో ఉన్నాయి. జామ పంటలు మొయినాబాద్, కందుకూరు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఫరూఖ్నగర్, యాచారం, శంషాబాద్, తలకొండపల్లి, కేశంపేట, తదితర చోట్ల సాగవుతున్నాయి. పొమొగ్రనేట్ కందుకూరు, కేశంపేట, శంషాబాద్, మహేశ్వరం, షాబాద్, తలకొండపల్లి ప్రాంతాల్లో సాగవుతున్నది. పుచ్చకాయ పంట ఫరూఖ్నగర్, కేశంపేట, తలకొండపల్లి, యాచారంలో, మస్క్ మిలన్ మాడ్గులలో సాగు చేస్తున్నారు.
రైతులు అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలి
వివిధ పండ్ల తోటల సాగులో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు వ్యవసాయ, ఉద్యాన వన అధికారుల ద్వారా మేలైన పద్ధతులను పాటించాలి. తోటలను తెగుళ్లు, పురుగు ఆక్రమించొచ్చు. ఇందుకు ముందుగానే నిపుణులైన అధికారులను రైతులు సందేహాల నివృత్తికి ఆశ్రయించాలి. మన జిల్లాలో ప్రధానంగా ఎనిమిది రకాల పంటలు పండుతున్నాయి. కానీ, తక్కువ మోతాదులో పండే మరో ఏడెనిమిది రకాల తోటలను సాగు చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం, రెండు కాలాల్లో 28,987 ఎకరాల్లో పలు రకాల పంటల సాగు చేయగా, సంవత్సరానికి లక్షా 68వేల 18 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. తక్కువ శ్రమతో సరైన పద్ధతులను పాటించడం ద్వారా జిల్లాలో పండ్ల తోటల రైతులకు దిగుబడితో పాటు రాబడి కూడా అధికంగానే చేకూరుతుంది. – ఎన్.సునందారాణి, జిల్లా ఉద్యాన వన, పట్టు తయారీ శాఖ అధికారి, రంగారెడ్డి జిల్లా
మామిడి సాగులో లాభాలు అధికం
మామిడి పంట సాగులో లాభాలు అధికంగా ఉన్నాయి. తొమ్మిది ఎకరాల్లో మామిడి సాగు చేపట్టాను. పెద్దగా పెట్టుబడి ఉండదు. శ్రమించేది కూడా స్వల్పం. అయితే, పంట దిగుబడి వచ్చిన తర్వాత మహారాష్ట్ర మార్కెట్కు తరలించి అక్కడ విక్రయిస్తున్నా. ఖర్చులు పోగా, లాభాలు మంచిగానే ఉన్నాయి. ఇతర పంటల కన్నా మామిడి సాగు చేయడం శ్రేయస్కరమే.
– మధు సూదన్, రైతు, ఆలూరు, చేవెళ్ల మండలం
దానిమ్మలో లాభాలు..
నేను 22 ఎకరాల్లో దానిమ్మ పంట వేశాను. వ్యవసాయ, ఉద్యాన వన అధికారుల సలహాల మేరకు పంటకు అప్పుడప్పుడు పలు రకాల మందులను పిచికారీ చేస్తున్నా. అయినప్పటికీ పెద్దగా పెట్టుబడి ఏమి అనిపించదు. కష్టంగా కూడా ఉండదు. చీడ చేరి కాయపై చారలు ఏర్పడితే కాస్త డిమాండ్ తగ్గుతుంది. సకాలంలో మందులు వాడితే, అంతా బాగానే ఉంటుంది. దానిమ్మ మంచి పోషక విలువలున్న పంట. దీనికి మార్కెట్లో డిమాండ్ కూడా అధికంగా ఉంటుంది. సంప్రదాయ పంటల కంటే ఇదే ఉత్తమం. – జితేందర్రెడ్డి, రైతు, ఆకుల మైలారం
వాతావరణం అనుకూలిస్తే లాభదాయకం..
వాతావరణం అనుకూలిస్తే మామిడి పంట లాభదాయకంగానే ఉంటుంది. ఈదురు గాలులతో కూడిన వర్షం వస్తే పూత, కాయలు రాలిపోతాయి. ఎకరానికి రూ. లక్ష నుంచి 1.50 లక్షల వరకు ఆదాయం వస్తుంది. కూలీలు ఎక్కువగా ఏమి అవసరం ఉండదు. ఎప్పటికప్పుడు చెట్ల మధ్యలో గడ్డి లేకుండా శుభ్రం చేసుకోవాలి. శ్రద్ధ పెట్టి చేస్తే మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది.
– నిర్దుల కృష్ణారెడ్డి, సురంగల్, మొయినాబాద్
జాగ్రత్తలు తీసుకోవాలి
నేను 20 ఎకరాల్లో బత్తాయి పంట పండిస్తున్నా. ఇందుకు పెట్టుబడి రూ.15 లక్షల వరకు అవుతుంది. పెట్టుబడికి అనుకూలంగానే దిగుబడి వస్తుంది. మన వరి, శనగ, తదితర పంటలతో పోల్చుకుంటే ఈ పంటకు పెద్దగా శ్రమించాల్సిన అవసరం ఉండదు. కాకపోతే, మొక్కల దశలో ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
– పగడాల రవితేజ, ఇర్విన్ గ్రామం, మాడ్గుల మండలం