బొంరాస్పేట, మార్చి 19 : శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎమ్మెల్యేలు నియోజక వర్గాల్లో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. అధిష్టానం ఆదేశాలతో కొడంగల్ నియోజకవర్గంలో సోమవారం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడానికి ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి నిర్ణయించారు. 2018లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై సంచలన విజయం సాధించిన పట్నం నరేందర్రెడ్డి మరోసారి కొడంగల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. వాస్తవానికి కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటికే కార్యకర్తలతో ఒకదఫా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు. పార్టీ ఆదేశించడంతో మరోదఫా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించడానికి సమాయత్తమవుతున్నారు. ఈ సమావేశాలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితో పాటు బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.
ఎన్నికల ఏడాది కావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత పటిష్టంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆత్మీయ సమ్మేళ నాలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సం క్షేమ పథకాలను అమలు చేస్తున్నది. రైతుల కోసం 24 గంటల ఉచిత విద్యుత్, రైతబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్చమైన నీటి సరఫరా, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి గురుకుల పాఠశాలల ఏర్పాటు, మహిళ లకు పావలా వడ్డీ రుణాల పంపిణీ, చేతి వృత్తుల వారి జీవనోపాధికి ఆర్థిక సాయం, మెరుగైన వైద్యం అందించడం, పోషకాహార కిట్లు, కేసీఆర్ కిట్లు వంటి వాటిని పంపిణీ చేయడం, మిషన్ కాకతీయ పథకం ద్వారా సాగునీటి వనరుల అభివృద్ధి ఇలా అనేక కార్య క్రమాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇవే కాకుండా కొడంగల్ నియోజకవర్గాన్ని ఐటీ మంత్రి కేటీఆర్ దత్తత తీసుకోవడంతో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి నాయకత్వంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు.
నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన కోస్గి బస్డిపోను ప్రారంభించడం, కోస్గి, కొడంగల్ పట్టణాలలోని దవా ఖానా లను 50 పడకలకు స్థాయిని పెంచి నాణ్యమైన వైద్యం అందించడం, మూత్రపిం డాల రోగులకు కొడంగల్ దవాఖానాలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు, కొడంగల్ పట్టణంలో డిగ్రీ కళాశాల భవన నిర్మాణం, కొడంగల్, కోస్గి మున్సిపాలిటీలలో రూ.60 కోట్లతో అభివృద్ధి పనులు, సమీకృత మార్కెట్ల నిర్మాణం వంటి పనులు చేపట్టారు. ఇవే కాకుండా నియోజకవర్గంలోని చాలా గ్రామాలలో ఎమ్మెల్యే కృషితో బీటీ రోడ్ల నిర్మాణం జరిగింది. వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఆత్మీయ సమ్మేళనాలలో కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.
దౌల్తాబాద్ మండలం గుండేపల్లిలో సోమవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వ హిస్తున్నారు. గత నెలలో దౌల్తాబాద్ మండలంలోని 15 గ్రామాలకు కలిపి దౌల్తాబాద్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మిగిలిన గ్రామాలకు సోమవారం గుండేపల్లిలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. అనంతరం బొంరాస్పేట, దుద్యాల, కొడంగల్, కోస్గి, గుండుమాల్, మద్దూరు, కొత్తపల్లి మండలాల్లో ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. వాస్తవానికి నియోజకవర్గంలో ఇప్పటికే మద్దూరు, కోస్గి మండలాలకు చెందిన కార్యకర్తలతో, కొడంగల్ మండల మైనార్టీ నాయకులతో ఆత్మీయ సమ్మేళనాలు ఒకదఫా నిర్వహించారు. అధిష్టానం ఆదేశించడంతో మరోసారి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంతో పాటు కార్యకర్తల్లో జోష్ నింపడానికి ఎమ్మెల్యే, నాయకులు ప్రయత్నిస్తున్నారు.