వికారాబాద్ జిల్లాలోని రైల్వే గేట్లు, బ్రిడ్జిలకు మోక్షమెప్పుడు లభిస్తుందోనని జనం ఎదురుచూస్తున్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పరిష్కారం మాత్రం లభించకపోవడం బాధాకరం. జిల్లావ్యాప్తంగా 15 రైల్వే బ్రిడ్జిలను మంజూరు చేయాలని కేంద్రాన్ని వేడుకుంటున్నా.. ఏటా రైల్వే బడ్జెట్లో నిరాశే మిగుల్చుతుండడంతో జిల్లావాసుల ఆశలు ఆవిరవుతున్నాయి. ఇప్పటివరకూ ఒక్క బ్రిడ్జినీ మంజూరు చేయని కేంద్ర ప్రభుత్వం సర్వేలంటూ కాలయాపనతో కాలం వెల్లదీస్తున్నది. వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లోని పలు రైల్వే గేట్ల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం నరకయాతన పడుతున్నా కేంద్రం స్పందించకపోవడంతో జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంఎంటీఎస్ వికారాబాద్ వరకు పొడిగింపుతోపాటు కృష్ణలైన్ తదితర ప్రాజెక్టులనూ కేంద్ర సర్కార్ పెండింగ్లోనే పెడుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం రవాణా వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ నదులు, వాగులపై బ్రిడ్జిలను నిర్మించి ప్రజల కష్టాలను తీర్చడంతో రవాణా సాఫీగా సాగుతుండడం గమనార్హం.
– వికారాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ)
కన్హా చీమలదరి గ్రామాలకు జాతీయ పురస్కారాలు
రంగారెడ్డి, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ)/మోమిన్పేట : సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలు అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్నాయి. నందిగామ మండలంలోని కన్హా గ్రామానికి జాతీయ పురస్కారం లభించినట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. కార్బన్ న్యూట్రల్ (కార్బన్ తటస్థ) విశేష్ పంచాయత్ పురస్కార్ (సీఎన్వీపీపీ) లభించింది. ఇందులో భాగంగా కన్హా గ్రామానికి రెండో ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా వికారాబాద్ జిల్లా, మోమిన్పేట మండలం, చీమలదరి గ్రామం కూడా మండల, జిల్లా, రాష్ట్రస్థాయి అవార్డులను అందుకున్నది. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులకు ఎంపిక చేసిన 27 గ్రామపంచాయతీల్లో 8 అవార్డులు తెలంగాణ రాష్ర్టానికి రాగా, గుడ్ గవర్నెన్స్ పంచాయతీగా జాతీయ స్థాయి అవార్డుకు చీమలదరి గ్రామం ఎంపికైంది.
వికారాబాద్, ఏప్రిల్ 7, (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల అభివృద్ధితోపాటు బ్రిడ్జిల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తూ భారీగా నిధులిచ్చి అభివృద్ధిలోకి తీసుకువస్తుంటే… కేంద్ర ప్రభుత్వం మాత్రం నిండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. జిల్లాలో రైల్వేబ్రిడ్జిల నిర్మాణానికి ఎన్నోసార్లు విన్నవించినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రైల్వే బ్రిడ్జిలను నిర్మించకపోవడంతో జిల్లా ప్రజానీకం నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 15 రైల్వే బ్రిడ్జిల వరకు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది. కానీ ఇప్పటివరకు ఒక్క బ్రిడ్జికి సంబంధించి కూడా నిధులు మంజూరుకాక పోవడం గమనార్హం. వికారాబాద్ పట్టణంలో తాండూరు వెళ్లే మార్గంలో, రామయ్యగూడ, గంగారం వద్ద రైల్వే బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని విన్నవించారు.
అదేవిధంగా తాండూర్ పట్టణంలో కూడా పాత తాండూరుతోపాటు మరో రెండు చోట్ల రైల్వే బ్రిడ్జిలు తప్పనిసరి అని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వీటితోపాటు వికారాబాద్ నియోజకవర్గంలోని ధారూర్, తరిగొప్పుల, మర్పల్లి, మొరంగపల్లి, కొత్తగడి, గేటువనంపల్లి, తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండల కేంద్రంతోపాటు తదితర చోట్ల రైల్వే బ్రిడ్జిలను నిర్మించాలని కోరారు. కాగా, రైల్వే బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలన్న ప్రతిసారి సర్వేలు చేసి వదిలేస్తున్నారు. ఏండ్లు గడిచినా రైల్వే బ్రిడ్జిల నిర్మాణం సర్వేల వద్దనే సాగుతుండడం గమనార్హం. రైల్వే బ్రిడ్జిల నిర్మాణంలో మోదీ ప్రభుత్వం సర్వేలతో కాలయాపన చేస్తుండడంతో జిల్లా ప్రజానీకం నిత్యం నరకయాతన పడుతున్నారు. అంతేకాకుండా బ్రిడ్జిలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతోపాటు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. గతంలో వికారాబాద్ సమీపంలోని కొత్తగడి వద్ద రైల్వే ట్రాక్ వద్ద గేట్ కూడా లేకపోవడంతో వికారాబాద్ మండలం మదన్పల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు వెళ్తున్న కారును రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తదనంతరం స్పందించిన సంబంధిత శాఖ అధికారులు రైల్వే గేట్ను ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఏదో ఒక ప్రమాదం జరిగితే గానీ స్పందించని కేంద్ర ప్రభుత్వంపై జిల్లా ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రానికి పట్టని జిల్లా ప్రజల కష్టాలు..
ప్రతిఏటా రైల్వే బడ్జెట్లో జిల్లాకు సంబంధించి ఎదురుచూపులే తప్పా ఒక్క రూపాయి కూడా నిధులు రాకపోవడం గమనార్హం. ఎంఎంటీఎస్ వికారాబాద్ వరకు పొడిగింపుతోపాటు కృష్ణలైన్ తదితర ప్రాజెక్టులను పెండింగ్లోనే పెడుతూ వస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కనీసం రైల్వే బ్రిడ్జిలను కూడా నిర్మించేందుకు నిధులివ్వడం లేదు. బ్రిడ్జిలు మంజూరు చేయాలని జిల్లా ప్రజాప్రతినిధులు వినతిపత్రాలు ఇవ్వడమే తప్పా బ్రిడ్జిల మంజూరు మాత్రం ఇప్పటివరకు నోచుకోలేదు. రైల్వే బ్రిడ్జిలు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో అర్ధగంట వరకు ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది.
తాండూరు నుంచి వికారాబాద్ మీదుగా హైదరాబాద్ వెళ్లే అంబులెన్స్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ బ్రిడ్జిలు లేకపోవడంతో రైల్వే గేట్ల వద్ద ఎదురుచూడక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ధారూర్ మండలం తరిగోపుల సమీపంలో ఉన్న రైల్వే లైన్తో ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. గేట్ లేకపోవడంతోపాటు కిలోమీటర్ మేర తిరిగి వెళ్లాల్సి వస్తున్నది. అయితే వర్షాకాలంలో అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ మార్గం గుండా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వర్షపు నీటి ధాటికి రాకపోకలు స్తంభిస్తున్నాయి. అదేవిధంగా బషీరాబాద్ మండల కేంద్రంలో కూడా రైల్వే బ్రిడ్జి లేకపోవడంతో కిలోమీటరు మేర తిరిగి బషీరాబాద్ ప్రభుత్వ కార్యాలయాలతోపాటు జీవంగి తదితర గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
కేసీఆర్ పాలనలో సాఫీగా ప్రయాణం..
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఎక్కడైతే వాగులు పొంగిపొర్లి రవాణా స్తంభించే ప్రాంతాలను గుర్తించి సంబంధిత గ్రామాల్లో వంతెనలు నిర్మించి ప్రజల ఇబ్బందులను తీర్చింది. అయితే జిల్లాలో ప్రధానమైన మూసీ, కాగ్నా నదులతోపాటు ఈసీ వాగు ఆయా ప్రాంతాల్లోని ప్రధాన వాగులు, మారుమూల పల్లెల్లోని వాగులపై కూడా రూ.కోట్లు ఖర్చు చేసి బ్రిడ్జిలను నిర్మించడంతో ప్రజలకు కష్టాలు తప్పి రవాణా సాఫీగా జరుగుతుండడం గమనార్హం. అయితే జిల్లాలో గత ఎనిమిదేండ్లుగా 31 వంతెనల నిర్మాణానికిగాను రూ.142 కోట్లకుపైగా నిధులను ప్రభుత్వం వెచ్చించింది.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మారుమూల పల్లెల్లో సహితం వాగులపై వంతెనలను నిర్మించి గ్రామాల ప్రజల రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. 2014 నుంచి 2022 వరకు జిల్లాకు 25 వంతెనలను ప్రభుత్వం మంజూరు చేయగా, రూ.123.36 కోట్ల నిధులను ఖర్చు చేసింది. అయితే సంబంధిత బ్రిడ్జిల్లో ఇప్పటివరకు దోర్నాల, మర్పల్లి వద్ద రెండు వంతెనల నిర్మాణం పెండింగ్లో ఉండగా, సంబంధిత బ్రిడ్జిల నిర్మాణాన్ని కూడా ఏప్రిల్ నెలాఖరు వరకు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అదేవిధంగా జిల్లాకు కొత్తగా ఆరు వంతెనల నిర్మాణానికిగాను రాష్ట్ర ప్రభుత్వం రూ.18.78 కోట్ల నిధులిచ్చింది. జిల్లాలోని వికారాబాద్ నియోజకవర్గానికి 3, పరిగి నియోజకవర్గానికి 2 వంతెనలు, తాండూర్ నియోజకవర్గానికి ఒక వంతెనను ప్రభుత్వం మంజూరు చేసింది.
అత్యవసర సమయంలో ఇబ్బందులు
మండల కేంద్రంలోని రైల్వే గేట్తో అత్యవసర సమయంలో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అండర్ పాస్ కోసం నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడాల్సివస్తుంది. ప్రజల ఇబ్బందులు పటించుకోని కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతాం.
– పవన్కుమార్, స్థానికుడు, బషీరాబాద్
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి
వికారాబాద్ సమీపంలోని కొత్తగడి వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్నాయి. నెలలు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడంతో నిత్యం ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రిడ్జి కింద ప్రమాదకరంగా రోడ్డు మారడంతో ద్విచక్ర వాహనదారులు సైతం కిందపడి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. బ్రిడ్జి నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలి. బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయడంలో దృష్టి సారిస్తే బాగుంటుంది.
– రాజు, వికారాబాద్
రైల్వే గేట్తో గంటలకొద్దీ ఆగాలి..
రైల్వే గేట్తో మండల ప్రజలకు చాలా అసౌకర్యం కలుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలంటే రైల్వే గేట్ను దాటుకుని వెళ్లాలి. ప్రతి అరగంటకు ఏదో ఒక రైలు వస్తుంది, దీంతో అధికారులు గేట్ బంద్ చేస్తారు. అత్యవసర సమయంలో రైల్వే గేట్తో గంటలకొద్దీ వేచిఉండాల్సిన పరిస్థితి నెలకొంటున్నది. కేంద్ర ప్రభుత్వం అండర్ బ్రిడ్జి కోసం నాలుగు సంవత్సరాల క్రితం మట్టి నమూనా చేశారు. ఇంత వరకు అతి గతి లేదు.
– జయరాంచారి, ఆర్ఎంపీ, బషీరాబాద్