ప్రజారోగ్యమే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 ఏండ్లు దాటిన వారందరికీ ప్రభుత్వం ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నది. జిల్లా పరిధిలో 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2 యూపీహెచ్సీలు ఉండగా 154 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటన్నింటిలో బీపీ, మధుమేహం వైద్య పరీక్షలతోపాటు ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలపై స్క్రీనింగ్ జరుపుతున్నారు. ఈ విధంగా ఇప్పటికే జిల్లా పరిధిలో 38వేల మంది బీపీతో బాధపడుతున్నట్లు, 17వేల మంది మధుమేహం వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ ఇప్పటికే ఉచితంగా మందులను పంపిణీ చేస్తుండగా, త్వరలో మరిన్ని దీర్ఘకాలిక రోగాలకు కూడా కిట్ల రూపంలో ఔషధాలను అందించేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. ప్రైవేటు దవాఖానలకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన కష్టాలు తప్పాయని రోగులు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
పరిగి, అక్టోబర్ 25 : ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నది. సర్కారు దవాఖానలను బలోపేతం చేస్తూ మరింత మెరుగైన వైద్యసేవలు అందించేలా అవసరమైన మందులు సైతం అందజేస్తున్నది. ప్రధానంగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్న సర్కారు ఇకమీదట కిట్ల రూపంలో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. అధికారులు తయారుచేసిన గణాంకాల ప్రకారం వికారాబాద్ జిల్లా పరిధిలో 38వేల మంది బీపీతో బాధపడుతున్నారు. అలాగే 17వేల మంది మధుమేహం వ్యాధిగ్రస్తులు ఉన్నారు. గతంలో చేసిన స్క్రీనింగ్ మేరకు వారందరికీ ఉచితంగా మందులు సరఫరా కొనసాగుతున్నది. త్వరలో కిట్ల రూపంలో ఈ మందులు పంపిణీకి సర్కారు నిర్ణయించింది. జిల్లా పరిధిలోని ప్రతి ఆరోగ్య ఉప కేంద్రంలో ఈ కిట్లు అందుబాటులో ఉంచి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారికి సంబంధిత మందులు నెలకు సరిపడా అందజేస్తారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏ మందులు ఎప్పుడు వేసుకోవాలని సూచిస్తూ ఈ కిట్లలో ఉంచి పంపిణీకి చర్యలు చేపట్టనున్నారు.
ప్రతి సబ్ సెంటర్లోనూ స్క్రీనింగ్..
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ ఉచితంగా కిట్ల రూపంలో మందుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్న సర్కారు ప్రతి ఆరోగ్య ఉప కేంద్రంలోనూ ఈ వ్యాధుల స్క్రీనింగ్ సైతం నిర్వహిస్తున్నది. వికారాబాద్ జిల్లా పరిధిలో 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2 యూపీహెచ్సీలు ఉండగా, 154 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటికే 56 పల్లె దవాఖానలు, 4 బస్తీ దవాఖానలను ప్రభుత్వం మంజూరు చేసింది. తద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. 30 ఏండ్లు పైబడిన వారందరికీ వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన స్క్రీనింగ్ చేపడుతున్నారు. జిల్లాలో 9లక్షలకు పైచిలుకు జనాభా ఉండగా, వారిలో 30 ఏండ్లు పైబడిన వారు 37శాతం వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు గ్రామాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాలకు వైద్యం కోసం వచ్చే వారికి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. బీపీ, మధుమేహం వైద్య పరీక్షలతోపాటు ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలపై స్క్రీనింగ్ జరుపుతున్నారు. ఆరోగ్య ఉప కేంద్రాలకు వచ్చిన వారికి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకోవడంతోపాటు బీపీ పరిశీలిస్తున్నారు. అలాగే ప్రతి ఆరోగ్య ఉప కేంద్రానికి అందజేసిన గ్లూకో మీటర్ సహాయంతో షుగర్ పరీక్షలు చేస్తున్నారు. బీపీ, షుగర్ నిర్ణయించిన స్థాయి కంటే ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. తద్వారా సంబంధిత వ్యక్తులకు ఉచితంగా మందులు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు.
కిట్ల రూపంలో మందుల పంపిణీ..
స్క్రీనింగ్ చేపడుతూనే వ్యాధులు నిర్ధారణ జరిగిన వారికి కిట్స్ రూపంలో నెలకు సరిపడా మందులు అందజేస్తారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారందరికీ ఈ కిట్స్ అందించనున్నారు. ప్రతినెలా వైద్య పరీక్షలు చేయించుకొని మందులు కొనుగోలు చేయాలంటే పేదలకు ఆర్థిక భారం పడుతున్నది. దీంతో పేదలందరికీ సర్కారు ఉచితంగా మందులు అందజేయనున్నది.
సబ్సెంటర్లల్లో స్క్రీనింగ్
వికారాబాద్ జిల్లాలోని 154 ఆరోగ్య ఉప కేంద్రాల్లో దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన స్క్రీనింగ్ కొనసాగుతున్నది. జిల్లాలో 38వేల మంది బీపీ, 17వేల మంది మధుమేహంతో బాధపడుతున్న వారికి మందులు అందజేస్తున్నాం. స్క్రీనింగ్లో ఏ దీర్ఘకాలిక వ్యాధి ఉన్నట్లు తేలినా వారికి ఉచితంగా చికిత్సలతోపాటు మందులు అందజేస్తాం.
– మారియా ఆఫ్రిన్, ఎన్సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్