షాబాద్/దోమ, ఏప్రిల్ 30 : రంజిత్రెడ్డి.. నమ్మకద్రోహి అని.. బీఆర్ఎస్ పార్టీని నమ్మించి వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. అలాంటి వ్యక్తికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలన్నారు. మంగళవారం చేవెళ్ల నియోజకవర్గం, శంకర్పల్లి మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి ఇన్చార్జిల సమావేశం.. అదేవిధంగా దోమ మండల కేంద్రంలో నిర్వహించిన మండల స్థాయి ప్రజా ఆశీర్వాద సభలో ఆమె.. బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, పార్లమెంట్ ఇన్చార్జి రాంబాబుయాదవ్తో కలిసి పాల్గొని మాట్లాడారు. రంజిత్రెడ్డి ఐదేండ్లు కేసీఆర్, కేటీఆర్ల వెంటే ఉండి నమ్మించి మోసం చేశాడని మండిపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి ఎంపీ టికెట్ను కేటాయించింది చేవెళ్ల రంజిత్రెడ్డికేనని..చేవెళ్లలో కేటీఆర్తో మొదటి సమావేశాన్ని కూడా నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఒకవైపు పార్టీ అధినేత కేసీఆర్ కాలుకు గాయం, మరోవైపు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన రోజే.. మానవత్వం మరిచి స్వార్థం, సొంత ప్రయోజనాలకోసం కాంగ్రెస్ కండువా కప్పుకొన్న రంజిత్రెడ్డికి కచ్చితంగా బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలకు సూచించారు. కార్యకర్తలను కూడా కాంగ్రెస్ పార్టీలోకి రమ్మంటే…తామూ మీ వెంట రామని.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటే ఉంటామని చెప్పినట్లు ఆమె గుర్తు చేశారు. చేవెళ్ల నుంచి రంజిత్రెడ్డి ఓడిపోతాడని తెలియడంతో సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే మూడుసార్లు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చివెళ్లారని.. ముఖ్యమంత్రి పదిసార్లు వచ్చి ప్రచారం చేసినా చేవెళ్లలో గెలిచేది బీసీనేత కాసాని జ్ఞానేశ్వరేనని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్నదని.. ఏ పార్లమెంట్ సెగ్మెంట్కు వెళ్లినా ప్రజలు అధికంగా తరలివచ్చి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.
మీ హయాంలో జరిగిన పనులే బాగున్నాయని..అన్ని వర్గాల ప్రజలు మంచిగా ఉన్నారని ప్రజలే స్వయంగా కేసీఆర్కు చెబుతున్నారన్నారు. అలవి కాని హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టాలన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ఆ పార్టీ నాయకులు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు దేవుళ్లపై ప్రమాణాలు చేస్తూ ప్రజలను మరోసారి మోసగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. చేవెళ్ల ప్రాంత ప్రజలకు ఎలాంటి కష్టమొచ్చినా స్థానిక ఎమ్మెల్యే యాదయ్యతోపాటు ఇంద్రారెడ్డి కుటుం బం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోసారి బీఆర్ఎస్ను రాష్ట్రం లో అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయం సాధించేందుకు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో పరిగి అసెంబ్లీ ఇన్చార్జి రామచంద్రారావు, ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, వైస్ ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ నాగిరెడ్డి, మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్యముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాపారావు, పార్టీ మండలాల అధ్యక్షులు గోపాల్, గోపాల్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు శశిధర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, సర్పంచ్ల సంఘం దోమ మండలాధ్యక్షుడు రాజిరెడ్డి,ఆయా గ్రామాల ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంట్లో తెలంగాణ వాణి వినిపిస్తా
పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎంపీగా ఆశీర్వదించి గెలిపిస్తే తెలంగాణ వాణిని పార్లమెంట్లో వినిపిస్తా. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ప్రజలు సంతోషంగా ఉండాలని కేసీఆర్ అన్ని వసతులను కల్పించారు. మహిళలు ఇబ్బం దులు పడొద్దని ఇంటింటికీ భగీరథ నీటిని అందించారు. అమలు కాని హామీలతో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. సమస్యలు పరిష్కారం కావడంలేదు. విద్యుత్తు, తాగునీటి ఇబ్బందులు మొదలయ్యాయి. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మే 13న జరిగే ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలి. బీఆర్ఎస్ శ్రేణులు తమ గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి గులాబీ పార్టీ గెలుపుకోసం కృషి చేయాలి.
-కాసాని జ్ఞానేశ్వర్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి
బీసీ బిడ్డను గెలిపించుకోవాలి : స్వామిగౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్
పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి బీసీనేతకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవకాశం ఇవ్వడం సంతోషకరం. బీసీలందరూ పార్టీలకతీతంగా కాసాని జ్ఞానేశ్వర్ గెలుపునకు కృషి చేయాలి. ఆయన బీసీల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. బీసీ బిడ్డను గెలిపించి బీసీల ఆత్మగౌరవాన్ని చాటాలి. పార్లమెంట్లో రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడాలంటే బీఆర్ఎస్ ఎంపీలు లోక్సభకు వెళ్లాల్సిన అవసరం చాలా ఉన్నది. కేసీఆర్ను మంచికో.. చెడుకో.. తులం బంగారానికో ఓడగొట్టుకున్నామని ప్రతి గ్రామంలోని మహిళలు బాధపడుతున్నారు. 16 లక్షల 80 వేల ఓట్లు ఉన్న చేవెళ్ల పార్లమెంట్లో అందరూ ఏకతాటిపైకి వచ్చి బీసీ నేత కాసానికి వేస్తే భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయం.
చేవెళ్లలో బీఆర్ఎస్ స్ట్రాంగ్గా ఉన్నది
కొంతమంది నాయకులు పార్టీని వీడినా ఎలాంటి నష్టంలేదు. ఐదేండ్ల క్రితం రంజిత్రెడ్డి అంటే ఎవరో ఇక్కడి ప్రజలకు తెలియదు. కేసీఆరే ఇక్కడికి తీసుకొచ్చి ఎంపీగా నిలబెడితే మనమంతా కలిసి గెలిపించాం. కొండా విశ్వేశ్వర్రెడ్డిని కూడా కేసీఆర్ నిలబెడితేనే ఎం పీగా గెలిపించుకున్నాం. ఐదేండ్లు బీఆర్ఎస్ ఎంపీగా ఉండి వ్యాపారం చేసుకుని లక్షలు, కోట్ల రూపాయలు లాభపడ్డారు. పదేండ్లు పార్టీలో ఉండి అక్రమంగా డబ్బులు, భూము లు సంపాదించుకున్న వారే ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. అసలైన కార్యకర్తలు ఎవరూ పార్టీ నుంచి వెళ్లడంలేదు. చేవెళ్ల గడ్డపై బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్గా ఉన్నది. పార్టీ మారుతున్నట్లు నన్ను బద్నాం చేస్తున్నారు. పార్టీ మారే ప్రసక్తేలేదు. మనమందరం ఐక్యంగా ఉండి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్కు గిఫ్టుగా ఇద్దాం.
– కాలె యాదయ్య, ఎమ్మెల్యే చేవెళ్ల