ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 9 : అడవిలో కార్చిచ్చు వ్యాపించేందుకు అనేక కారణాలను చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉన్న అటవీ సంపదను కాపాడుకునేందుకు ఏటా వేసవికి ముందుగానే అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ప్రతి వేసవిలోనూ అడవికి కార్చిచ్చు ప్రమాదం జరుగడానికి ప్రథమ కారణం మనుషులే.. అటవీ ప్రాంతాన్ని సందర్శించిన సమయంలో బీడీలు, సిగరెట్లు తాగి కింద పడేస్తుంటారు. అది రాజుకుని చిన్న మంటగా మొదలై కార్చిచ్చుగా వ్యాపిస్తున్నది. కొంతమంది అడవిలో సంచరిస్తూ వంటలు చేసుకుని నిప్పును పూర్తిగా ఆర్పి వేయకుండానే వెళ్లిపోతుంటారు. వేసవి కాలం కావడంతో మంటలు సులువుగా వ్యాపిస్తుంటాయి.
వేసవిలో చెట్ల ఆకులు ఎండి రాలిపడుతుంటాయి. ఎండిన ఆకులు ఉండటం, గుట్టలపై నుంచి రాళ్లు జారి పడుతూ.. రాసుకోవడం వల్ల కూడా నిప్పు రవ్వలు ఎగిసి పడడంతో మంటలు వ్యాపిస్తుంటాయి. అటవీ ప్రాంత సమీపంలో పొలాలు ఉన్న రైతులు చెత్తను తగలబెట్టిన సమయంలో నిప్పు రవ్వలు అడవిలో పడి అగ్గి రాజుకుంటున్నది. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఫారెస్టు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అగ్ని ప్రమాదాలు ఎక్కడ జరిగినా శాటిలైట్ ద్వారా తెలుసుకుని అటవీ శాఖ బృందాలను అలర్ట్ చేస్తున్నారు.
జిల్లాలో రెండు అటవీ ప్రాంతం డివిజన్లు ఉన్నాయి. అందులో శంషాబాద్, ఆమనగల్లు డివిజన్లు ఉండగా, వీటిలో ఆమనగల్లు డివిజన్ పరిధిలో ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమనగల్లు రేంజ్లు ఉండగా, శంషాబాద్ డివిజన్ పరిధిలో మంఖాల్, చిలుకూరు, హయత్నగర్ రేంజ్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అటవీ ప్రాంతం విస్తరించి ఉన్నది. ఈ ప్రాంతంలో అరుదైన చెట్లతో పాటు జంతువులు, పక్షులు సంచరిస్తుంటాయి. కార్చిచ్చు వ్యాపిస్తే అడవిలోని చెట్లు కాలిపోయే ప్రమాదం ఉన్నది. అగ్ని ప్రమాదాల వల్ల మూగజీవాలకు ఇబ్బందులు తలెత్తున్నాయి. మూగజీవాలు, పచ్చని చెట్లను రక్షించేందుకు అటవీ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.
అటవీ సమీప గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిప్పులు రాజేయవద్దని, సిగరెట్లు, బీడీలు కాల్చి పడవేయవద్దని చెబుతున్నారు. పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా బేస్ క్యాంప్ టీమ్లను ఏర్పాటు చేశారు. ఈ టీమ్ వణ్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ సంరక్షణ కోసం పని చేస్తాయి. ఈ బృందాలు రాత్రి, పగలు సమయంలో అటవీ ప్రాంతాల్లోనే గస్తీ తిరుగుతూ అడవిని కాపాడుతాయి. ట్రాక్టర్లతో పిక్స్లో నీటిని నింపుతూ మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు.
వేసవిలో పెద్ద ఎత్తున మంటలతో అటవీ ప్రాంతం ప్రమాదానికి గురయ్యే అవకాశమున్నది. అటవీశాఖ ఆధ్వర్యంలో సిబ్బంది అటవీ ప్రాంతాల్లో ఫైర్లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. 5 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేస్తున్న ఈ ఫైర్లైన్స్ బాక్సులు మంటలను అదుపు చేసేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఒక బాక్సులో నుంచి మరో బాక్సులోకి మంటలు ప్రవేశించకుండా ఫైర్లైన్స్ ఎంతో మేలు చేస్తాయి.
అడవిని రక్షించుకునేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. వేసవిలో కార్చిచ్చు వ్యాపించకుండా గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. ప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే అదుపులోకి తీసుకొస్తున్నాం. మంటలను అదుపు చేసేందుకు అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక ఫైర్లైన్స్ ఏర్పాటు చేశాం. అడవి ప్రాంతాల్లో ఎక్కడ మంటలు అధికంగా వ్యాపిస్తాయో గుర్తించి ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ప్రజలు కూడా సహకరించాలి. అటవీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు సిగరెట్లు, బీడీలు తాగి పడవేయవద్దు.
– విష్ణువర్ధన్, అటవీ శాఖ ఇబ్రహీంపట్నం రేంజ్ అధికారి