ఇబ్రహీంపట్నంరూరల్, మార్చి 11 : జిల్లావ్యాప్తంగా అటవీ సంపదను కాపాడుకునేందుకు ప్రతిఏటా వేసవిలో అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ప్రతి వేసవిలో అడవికి కార్చిచ్చు ప్రమాదం పొంచి ఉంటున్నది. దీనికి ప్రథమ కారణం మనుషులే.. అటవీ ప్రాంతాన్ని సందర్శించిన సమయంలో బీడీలు, సిగరెట్లు తాగి కింద పడేస్తుంటారు. ఇది రాజుకుని చిన్న మంటగా మొదలై కార్చిచ్చుగా వ్యాపిస్తుంది. కొంతమంది అడవిలో సంచరిస్తూ వంటలు చేసుకుని నిప్పును పూర్తిగా ఆర్పివేయకుండానే వెళ్లిపోతుంటారు. ఈ విధంగా కూడా నిప్పు వ్యాపిస్తుంది. వేసవిలో చెట్ల ఆకులు ఎండి రాలిపోతుంటాయి. అటవీ ప్రాంతంలో కింద మొత్తం ఎండిపోయిన ఆకులు ఉండటం, అడవిలో పెద్దపెద్ద గుట్టలపై నుంచి రాళ్లు జారిపడుతూ.. అవి రాసుకోవడం వల్ల నిప్పు రవ్వలు ఎగిసి ఎండుటాకులపై పడటంతో మంటలు వ్యాపిస్తుంటాయి. అటవీప్రాంతం సమీపంలో పొలాలున్న రైతులు చెత్తను తగులబెట్టిన సమయంలో కూడా నిప్పు రవ్వలు అడవిలో పడి అగ్ని రాజుకుంటుంది. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు జిల్లావ్యాప్తంగా ఉన్న అటవీ సంపదను కాపాడుకునేందుకు ఫారెస్టు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎక్కడ అగ్నిప్రమాదాలు జరిగినా శాటిలైట్ ద్వారా తెలుసుకుని అటవీశాఖ బృందాలను అలర్ట్ చేస్తూ ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
అటవీ సంపదను కాపాడుకునేందుకు ప్రత్యేక చర్యలు
జిల్లాలో శంషాబాద్, ఆమనగల్లు డివిజన్లు ఉన్నాయి. ఆమనగల్లు డివిజన్ పరిధిలో ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమనగల్లు రేంజ్లుండగా.. శంషాబాద్ డివిజన్ పరిధిలో మంఖాల్, చిలుకూరు, హయత్నగర్ రేంజ్లున్నాయి. జిల్లాలో అరుదైన చెట్లతోపాటు జంతువులు, పక్షులు సంచరిస్తుంటాయి. కార్చిచ్చు వ్యాపిస్తే అటవీ సంపదకు నష్టంతోపాటు మూగజీవాలు మృత్యువాతపడే అవకాశాలున్నాయి. ఇందు కోసం అటవీశాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. అటవీ సమీప గ్రామాల్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా 8 బేస్ క్యాంప్ టీమ్లను ఏర్పాటు చేశారు. ఈ టీమ్లు వన్యప్రాణుల సంరక్షణతోపాటు అటవీ సంరక్షణ కోసం పనిచేస్తాయి. అలాగే ట్రాక్టర్లతో పిట్స్లో నీటిని నింపుతాయి.
మంటలు వ్యాప్తిచెందకుండా ఫైర్లైన్స్
అటవీ శాఖ సిబ్బంది అడవుల్లో ఫైర్లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. 5 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేస్తున్న ఈ ఫైర్లైన్స్ మంటలను అదుపు చేసేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ప్రతి అటవీ ప్రాంతంలో ఫైర్లైన్స్ బాక్సులుగా ఏర్పాటు చేస్తారు. ఒక బాక్సులో నుంచి మరో బాక్సులోకి మంటలు ప్రవేశించకుండా ఉండేందుకు ఫైర్లైన్స్ ఎంతో మేలు చేస్తాయి.
అటవీ సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం
అడవిని రక్షించుకునేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. వేసవిలో కార్చిచ్చు వ్యాపించకుండా గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే అదుపులోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా కృషిచేస్తున్నాం. మంటలను అదుపు చేయడం కోసం అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక ఫైర్లైన్స్ ఏర్పాటు చేశాం. మంటలు ఎక్కడైతే అధికంగా వ్యాపిస్తాయో వాటిని గుర్తించి అక్కడ ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ప్రజలు అటవీ ప్రాంతాలకు వెళ్ల్లినప్పుడు నిప్పు రాజేయవద్దు. సిగరెట్లు, బీడీలు తాగి పడవేయవద్దు. అటవీ సంపదను కాపాడుకునేందుకు సహకరించాలి.
– విష్ణువర్ధన్, అటవీశాఖ ఇబ్రహీంపట్నం రేంజ్ అధికారి