రంగారెడ్డి, జూన్ 10(నమస్తే తెలంగాణ): దాదాపు ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ భాష, యాసను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసడించుకున్నారు. తెలంగాణ భాష అసలు భాషే కాదన్నారు. తెలంగాణలో కవులు, రచయితలే లేరన్నారు. తెలంగాణను అభివృద్ధి పరంగానే కాక భాష, యాస, సంస్కృతి పరంగాను హీనంగా చూశారు. తెలంగాణ ప్రాంతం ఒక్క అంశంలోనే కాక పలు రకాల అంశాల్లో అవహేళనలకు గురైంది. తొలి తరం ఉద్యమం నడుస్తున్న కాలంలోనే తెలంగాణ సాహిత్యం ఎంతో ఎత్తుకు ఎదిగింది. అయినా పాలకులు పట్టించుకోక పోగా, సాహిత్యాన్ని తొక్కి పెట్టారు. పాలకులు పొరుగు ప్రాంతం వారు కావడంతో ఆరోజుల్లో మన రచనలు, కవితలు, కథలు, కథానికలు, నవలలు గుర్తింపునకు నోచుకోలేదు. ఆనాటి నుంచే పలు రంగాల్లో తెలంగాణను ఎదగకుండా తొక్కి పట్టారు. ఈ ప్రాంతాన్ని ఎదగనీయకుండా అణగదొక్కారు. ఎన్నో దుశ్చర్యలను చవిచూసిన నెత్తురోడిన నాయకులు ఎంతో మంది జై తెలంగాణ అని నినదించి ఉద్యమాగ్నికి ఆహుతయ్యారు.
ఆ తరువాత మలి దశ ఉద్యమంలో ఉద్యమనేత కేసీఆర్ ఆధ్వర్యంలో పట్టు వదలకుండా కేంద్రం పై యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చారు. కేసీఆర్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉద్యమ సెగలు ఢిల్లీ దాకా తాకడంతో అన్ని పార్టీలు తోడై రాక తప్పలేదు. కేసీఆర్ ప్రాణాలకు తెగించడంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకోగలిగాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అవుతున్న తరుణంలో దశాబ్ధి ఉత్సవాలు జరుపుకుంటున్నం. అందులో భాగంగానే తెలంగాణ సాహితీ దినోత్సవాన్ని ఆదివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరుపుకుంటున్నాం. మన భాష, యాసలు ఏ విధంగా జన బాహుళ్యంలో ఉన్నాయో, మన రచనలు, కవితలు, కథలు, మొదలైనవి ఎంత ప్రజాదరణలో ఉన్నాయో ఒకసారి మననం చేసుకునేలా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న సాహితీవేత్తలందరినీ నేడు ఒక వేదిక మీదకు తీసుకొస్తున్నారు.
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో సీఎం కేసీఆర్ సాహిత్యానికి పెద్ద పీట వేస్తూ సాహితీ వైభవాన్ని చాటుతున్నారు. తెలంగాణ సాహితీ వైభవం విలసిల్లేలా.. రంగారెడ్డి జిల్లాలోని తెలుగు, ఉర్దూ భాషలకు సంబంధించిన రచయితలు, కవులు ఆదివారం ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలోని వేదిక మీదకు రానున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కవులు, రచయితలు, సాహితీవేత్తలు ఒకే వేదిక మీదకు వచ్చి వారి సాహితీ విజ్ఞానాన్ని ప్రదర్శించనున్నారు. ఇందుకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ ప్రధానంగా చేయూతను అందిస్తున్నది.
సాహితీ దినోత్సవాన వారు రాసిన కవితలు, రచనలు, కథలను, సాహిత్యాన్ని వినిపించనున్నారు. కవి సమ్మేళనాలు, కవితల పోటీలు ఈ సందర్భంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాహిత్య దినోత్సవం సందర్భంగా కవులు, సాహితీవేత్తలను సన్మానించనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.హరీశ్, పలువురు జిల్లా అధికారులు పాల్గొననున్నారు.