ఓటరు ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 26, 27 తేదీలతోపాటు డిసెంబర్ 10, 11 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించి కొత్త ఓటర్ల నమోదుతోపాటు ఓటరు కార్డులో మార్పులు, చేర్పులకు దరఖాస్తులు చేసుకోవాలని అవకాశం కల్పించారు. ఏమైనా అభ్యంతరాలుంటే డిసెంబర్ 8వ తేదీ వరకు విజ్ఞప్తులను స్వీకరించనున్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. తుది జాబితాను జనవరి 5వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో రంగారెడ్డి జిల్లాలో 30,48,209 మంది ఓటర్లు ఉండగా, వికారాబాద్ జిల్లాలో 8,71,746 మంది ఓటర్లు ఉన్నారు.
– రంగారెడ్డి, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, నవంబర్ 9, (నమస్తే తెలంగాణ): ఓటరు ముసాయిదా జాబితా విడుదల అయ్యింది. వచ్చేనెల 8వ తేదీ వరకు ఈ జాబితాపై అభ్యంతరాలు, విజ్ఞప్తులను స్వీకరించనున్నారు. కొత్త ఓటర్ల నమోదుతోపాటు మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 26, 27 తేదీలతోపాటు డిసెంబర్ 10, 11 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించి కొత్త ఓటర్ల నమోదుతోపాటు ఓటరు కార్డులో మార్పులు, చేర్పుల దరఖాస్తులను స్వీకరించనున్నారు. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల అధికారులు వెల్లడించారు. మరోవైపు ఓటరు తుది జాబితాను జనవరి 5న ప్రచురించనున్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 1130 పోలింగ్ కేంద్రాలుండగా 8,71,746 మంది ఉన్నారు.
జిల్లాలో 8,71,746 మంది ఓటర్లు..
ఓటరు ముసాయిదా ప్రకారం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 8,71,746 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు-4,37,274 మంది ఓటర్లు, మహిళలు-4,34,447 మంది ఓటర్లు, ఇతరులు-25 మంది ఓటర్లున్నారు. వీరిలో అత్యధికంగా పరిగి నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,31,163 మంది ఓటర్లుండగా, పురుషులు-1,17,931 మంది, మహిళలు-1,13,224 మంది, ఇతరులు-8 మంది ఓటర్లున్నారు. అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,11,029 మంది ఓటర్లుండగా వీరిలో పురుషులు-1,06,869, మహిళలు-1,04,157 మంది, ఇతరులు-ముగ్గురు ఓటర్లున్నారు. తాండూర్ నియోజకవర్గంలో మొత్తం 2,15,849 మంది ఓటర్లుండగా వీరిలో పురుషులు-1,05,966, మహిళలు-1,09,875 , ఇతరులు-8 మంది ఓటర్లున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,13,705, వీరిలో పురుషులు-1,06,508 మంది, మహిళలు-1,07,191మంది, ఇతరులు ఆరుగురు ఓటర్లున్నారు.
రంగారెడ్డి మొత్తం ఓటర్లు 30,48,209 మంది
రంగారెడ్డి జిల్లా ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం – 2023కు సంబంధించి బుధవారం ముసాయిదాను ప్రభుత్వ యంత్రాంగం విడుదల చేసింది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలకు 3,307 పోలింగ్ స్టేషన్లు, కాగా 30,48,209 లక్షల ఓటర్లు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం పురుష ఓటర్లు 15,87,504 మంది, స్త్రీలు 14,59,572 మంది, ట్రాన్స్జెండర్స్ 354 మంది ఉన్నారు. కాగా, ఎన్నారై ఓటర్లలో పురుషులు 144 మంది, స్త్రీలు 38 మంది, కాగా, సర్వీస్ ఓటర్లు పురుషులు 577 మంది, స్త్రీలు 20 మంది ఉన్నారు. అయితే, కలెక్టరేట్తో పాటు అన్ని ఆర్డీవోలు, తహసీల్దార్లు, జడ్పీ తదితర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట జాబితాను ఓటర్లు పరిశీలించే విధంగా అందుబాటులో ఉంచనున్నారు. ఈ జాబితాపై డిసెంబర్ 8వ తేదీ వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు.