బొంరాస్పేట : బొంరాస్పేట ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో బతుకమ్మ పాట చిత్రీకరణ జరిగింది. ‘తెలంగాణ ఇంతులు బతుకమ్మ బంతులు’ అనే పాటను కొడంగల్ మండలం పెద్దనందిగామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు హిమజ రచించగా, రేగడిమైలారం గ్రామానికి చెందిన అంజిలప్ప, క్రిష్ణయ్య, సునీత ఆలపించారు. గౌరమ్మకు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి పాట చిత్రీకరణను కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగపై పాటను చిత్రీకరిస్తున్న ప్రెస్క్లబ్ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.
అంతకు ముందు ఎంపీపీ హేమీబాయి, జడ్పీటీసీ అరుణాదేశ్, గ్రామానికి చెందిన మహిళలు రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చారు. పాట చిత్రీకరణ సందర్భంగా ఎంపీపీ, జడ్పీటీసీతో పాటు విద్యార్థినులు ఉత్సాహంగా బతుకమ్మ, కోలాటం ఆడారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, రైతుబంధు మండలాధ్యక్షుడు మహేందర్రెడ్డి, ఎంపీటీసీ శ్రవణ్గౌడ్, టీజేసి నాయకులు నర్మద కిష్టప్ప, టీవీవీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు దేశ్యానాయక్, రమణారెడ్డి పాల్గొన్నారు.