దోమ, నవంబర్ 22: సంప్రదాయ పంటలు సాగు చేసి విసిగిపోయిన రైతులు తక్కువ కాలంలో మంచి ఆదాయం ఇచ్చే పంటలను సాగు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. మండల పరిధిలోని మల్లేపల్లి, దాదాపూర్, గుండాల, బట్లచందారం తదితర గ్రామాల్లోని రైతులు గత ఎనిమిదేం డ్లుగా కీరదోస పంటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఎం/ఎస్ సశ్యామ్ అగ్రిటేక్ సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ ఫీల్డ్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇచ్చి వారి సహకారంతో రైతులకు కీరదోస పంట సాగుకు క్షేత్ర స్థాయిలో సూచనలు, సలహాలు అందించి 48 ఎకరాల్లో పంట సాగును కొనసాగిస్తున్నారు. విత్తనాలు, మందులను సంస్థ అందించి రైతులకు చేయూతనివ్వడంతో పాటుగా మంచి ఆదా యం రావడంతో రైతులు కీరదోస పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఈ విధానంలో సాలు సాలుకు మధ్య దూరం ఐదు ఫీట్లు, మొక్క మొక్కకు మధ్య పది సెంటీమీటర్ల దూరంలో విత్తనం నాటడంతో ఎకరం పొలంలో పదివేల విత్తనాలు వస్తాయి.
కీరదోస పంట సాగు కాలం 75నుంచి 85 రోజుల్లో పూర్తి అవుతుండటం తో రైతులు ఏడాదిలో మూడు దఫాలుగా పంటను సాగు చేస్తున్నారు. రైతులు పండించిన పంటను సంస్థ ప్రతినిధు లు వారి గ్రామాల్లోనే కొనుగోలు చేసి కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న ఎం/ఎస్ సశ్యామ్ అగ్రిటెక్ కంపెనీకి తీసుకెళ్తున్నారు. పండిన పంటను రైతులు నాలుగు గ్రేడులుగా వేరు చేసి కంపెనీకి అందిస్తారు. మొదటి గ్రేడ్ సైజు 14 ఎంఎం ఉండగా దాని ధర కిలో రూ. 36గా నిర్ణయించారు. రెండో గ్రేడు 17 ఎంఎం సై జు కిలో ధర రూ. 24, మూడో గ్రేడు సైజు 25 ఎం ఎం కిలో ధర రూ. 12, నాల్గో గ్రేడు 33 ఎంఎం సైజు కిలోధర రూ.4గా నిర్ణయించి సంస్థ కొనుగోలు చేస్తున్నది. పంట సాగుకు ముందే సంస్థ రైతులతో ఒప్పందం చేసుకొని ఈ పంటను సాగు చేయిస్తున్నది. ప్రస్తుతం కీరదోస పంట ఆయా గ్రామాల్లో 60 రోజుల దశలో ఉండి పంటను హార్వెస్ట్ చేస్తున్నా రు. ఎకరం సాగుకు 22 వేల ఖర్చు కాగా, సుమారుగా రూ.96 వేల ఆదాయం వస్తున్నది. ఖర్చు పో ను రైతుకు నికరంగా రూ.74 వేల ఆదాయం చేతికి అందుతున్నది. తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం రావడంతో రైతులు ఆనం దం వ్యక్తం చేస్తున్నారు. ఫీల్డ్ ఆఫీసర్లు రైతులకు సరియైన సమయంలో పంటకు కావాలసిన సూచనలు, సలహాలు అందించడమే కాకుండా మంచి ఆదాయం రావడంతో కీరదోస పంట సాగువైపు రైతులు మొగ్గు చూపుతున్నారు.
ప్రభుత్వం డ్రిప్ సౌకర్యం కల్పించాలి
నాకు ఐదు ఎకరాల భూమి ఉన్నది. నాలుగు ఎకరాల్లో వరి, వేరుశనగ పంటలు సాగు చేశా. ప్రస్తు తం ఒక ఎకరంలో కీరదోస వేయగా.. పంట ఆశాజనకంగా ఉన్నది. గతంలో కొన్ని సంస్థలు ఈ పంట సాగుకు ముందుకువచ్చి రైతులకు చేయూతనివ్వగా ప్రస్తుతం ఎం/ఎస్ సశ్యామ్ అగ్రిటెక్ సంస్థ కీరదోస సాగును ప్రోత్సహిస్తూ రైతులకు సహకరిస్తున్నది. కీరదోస సాగు చేస్తున్న రైతులను ప్రభు త్వం గుర్తించి డ్రిప్ సౌకర్యం కల్పిస్తే మరింత దిగుబడులు పొంది మంచి ఆదాయాన్ని ఆర్జిస్తాం.
– పి.పెంటయ్య, రైతు, మల్లేపల్లి
మంచి ఆదాయం పొందుతున్నా..
నాది గుండాల గ్రామం. నాకు నాలుగు ఎకరాల పొలం ఉన్నది. ఇంతకు ముందు వరి, మొక్కజొన్న కూరగాయల పంటలను సాగు చేశా. వాటితో ఆదా యం అంతంత మాత్రంగా నే ఉండటంతో కొంత కాలం గా కీరదోస పంటను సాగు చేస్తున్నా. మూడు ఎకరాల్లో ఈ పంటను సాగు చేయగా మంచి ఆదాయం వస్తున్నది. ఇతర పంటల కంటే కీర దోస సాగుతో ఆదాయం దండిగా ఉన్నది. ఒక ఎకరం పొలంలో ఆరు క్వింటాళ్ల దిగుబడి వస్తున్నది.
– ఎం బీరయ్య, రైతు, గుండాల, దోమ మండలం