ఆదిబట్ల, ఫిబ్రవరి 1 : ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్పల్లి మహమ్మాయి దేవి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ కమిటీ అధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఈ ఉత్సవాలు వందల ఏండ్లుగా కొనసాగుతున్నాయి. ప్రతి ఏడాది ఈ ఉత్సవాలను ఆలయ కమిటీ అధ్వర్యంలో నిర్వహిస్తారు. ఇప్పటికే ఈ ఉత్సవాలపై ప్రతి గ్రామంలో ప్రచారం చేశారు. వాల్పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలకు ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల భక్తులతో పాటు ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని గ్రామల నుంచి, హైదరాబాద్ నుంచి అధిక సంఖ్యలో తరలివస్తారు. ప్రతి యేటా 10వేల నుంచి 15 వేల వరకు భక్తులు ఈ ఉత్సవాలకు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
వారం రోజుల పాటు సాగనున్న ఉత్సవాలు..
మహమ్మాయిదేవి ఉత్సవాలను వారం రోజుల పాటు నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 2న అంకురార్పణ, 3న ధ్వజారోహణం, శనివారం కల్యాణోత్సవం, 5న రథోత్సవం, 6న త్రిశూలోత్సవం, 7న చక్రస్నానం (దీపోత్సవం) నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి రోజు స్వామికి మహరుద్రాభిషేకం, శ్రీదేవికి కుంకుమార్చన, పూజలు, సేవలు, అభిషేకాలు, మహానైవేద్యము, అర్చనలు, హారతి ఆరాధన జరుగుతాయని తెలిపారు. ఉత్సవాల్లో వీధి నాటకాలతో భక్తులను ఆలరిస్తారు.