ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 20 : నియోజకవర్గంలో సాగు భూములు కలిగిన రైతులు రెండు పంటలు పండిస్తారు. వానకాలంతో పాటు యాసంగిలో కూడా ఒకే రకమైన పంటను సాగుచేయడం ద్వారా వేసవిలో సరిగా నీరందక దిగుబడి సరిగ్గా రాక రైతులు నష్టపోయే అవకాశముంటుంది. గంపగుత్తగా కాకుండా ప్రత్యామ్నాయం దిశగా ముందుకు వెళుతూ తక్కువ కాలం, తక్కువ నీటి వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయి. వాన కాలంలో ఉన్న నీటి వనరులతో పాటు వర్షాలు మేలు చేయనున్న నేపథ్యంలో వరిసాగు చేసినప్పటికీ పెద్దగా నష్టం ఉండదు.
కానీ, యాసంగిలో మాత్రం వేసవి ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉన్నందున తక్కువ పంట కాలం ఉండటంతో పాటు తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకుంటే మంచిదని వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అందులో భాగంగానే ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలని వారు కోరుతున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అధిక శాతం ఎర్ర నేలలు ఉన్నందున అవి ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి. రైతులు ముందుచూపుతో ఆలోచించి ఆరుతడి పంటలైన కూరగాయలు, పెసర్లు వంటి పంటలను సాగు చేసుకుంటే మేలుంటుందని అధికారులు చెబుతున్నారు. పంట వేసి నష్టపోవడం కంటే నష్టపోకుండా ఉండే పంటలను సాగు చేసుకోవడం ద్వారా లబ్ధి పొందవచ్చునని తెలియజేస్తున్నారు.
ఆరుతడి పంటల పంటకాలం తక్కువగా ఉండటంతో పాటు తక్కువ నీటితో ఎక్కువ భూమి సాగు చేయవచ్చు. దీంతోపాటు ఈ పంటల నుంచి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. వానకాలంలో సాగు చేసిన పంట మారిస్తే మంచి ఫలితం రానున్నది. టమాటలతో పాటు పచ్చిమిర్చి, దోస, వంగ, పుచ్చకాయలు, మినుములు, పెసర్లు, వేరుశెనగ సైతం సాగుచేసుకోవచ్చును. మొక్కజొన్న, జొన్న, నువ్వులు, బొబ్బర్లు, పప్పుదాన్యాలు కూడా సాగుచేయొచ్చు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది.
నియోజకవర్గంలో అధికంగా తేలికపాటి, ఎర్ర నేలలే ఉన్నాయి. 80 శాతం నేలలు ఇవే ఉన్నందున.. నీరు నిల్వ చేసుకునే లక్షణం తక్కువగా ఉంటుంది. సేంద్రియ కర్బనం తక్కువగా ఉండటంతో పాటు ప్రధాన సూక్ష్మ పోషక పదార్థాల లభ్యత కనిష్టంగా ఉండటంతో నియోజకవర్గంలో భూగర్భజలాల లభ్యత రోజురోజుకూ తగ్గిపోతున్నది.
ప్రధానంగా ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారాం మండలాల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ఇక్కడి రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉండటంతోపాటు ఎకరం వరికి ఖర్చయ్యేనీటితో 3 నుంచి 4 ఎకరాల్లో ఆరుతడి పంటలను సాగు చేసుకోవచ్చునని, ప్రతి రైతు ఆరుతడి పంటలను సాగు చేసుకునేందుకు ముందుకు రావాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. రైతులు అవగాహనలేమి కారణంగా వరిపంటను సాగు చేసుకుని నష్టపోవద్దని, ప్రతి రైతు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని వారు తెలుపుతున్నారు.
యాసంగి సీజన్లో వరి కాకుండా ఆరుతడి పంటలే వేసుకోవాలి. వేసవి నేపథ్యంలో నీటి కరువు వచ్చే అవకాశం ఉన్నందున తక్కువ నీటితో ఎక్కువ భూమి సాగయ్యే పంటలనే వేసుకోవాలి. తక్కువ పెట్టుబడితో, అతి తక్కువ నీటితో అధిక లాభాలు పొందే అవకాశమున్నందున రైతు కూరగాయల పంటలను సాగుచేసుకోవాలి.
– వరప్రసాద్రెడ్డి, ఏవో, ఇబ్రహీంపట్నం