ఈసారి అధిక వర్షాలు కురువడంతో వికారాబాద్ జిల్లాలో సాగు పనులు సంబురంగా సాగుతున్నాయి. జిల్లాలో 5,31,501 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా, ఇప్పటికే 4.15లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా 1,99,797 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. ఇతర పంటలు కందులు, మొక్కజొన్న, జొన్న, పెసర, మినుములు, చెరుకు, సోయాబీన్ పంటలను సాగు చేస్తుండగా, పత్తి తర్వాత వరి సాగు పెరిగే అవకాశమున్నది. సాగునీరు పుష్కలంగా ఉండడంతో అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. మరో పక్షం రోజుల్లో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉన్నది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర సర్కార్ ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచింది.
పరిగి, జూలై 25 : వికారాబాద్ జిల్లావ్యాప్తంగా జూలై నెల ప్రారంభం నుంచి కురుస్తున్న వర్షాలతో వానకాలంలో పంటల సాగు విస్తీర్ణం 4లక్షల ఎకరాలు దాటింది. జూన్ నెలతో పోలిస్తే జూలై నెలలోనే అత్యధికంగా వర్షాలు కురిసాయి. దీంతో జిల్లాలో క్రమంగా పంటల సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. వికారాబాద్ జిల్లాలో ఈసారి వానకాలంలో 5,31,501 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని అంచనా వేయగా.. ఇప్పటివరకు 4,15,118 ఎకరాల్లో సాగు చేశారు. వరి పంట సాగు వచ్చే నెలలో పూర్తవనున్నందున ఈ సాగు విస్తీర్ణం అంచనా కంటే మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
జూలైలో వర్షాలతో పెరిగిన సాగు విస్తీర్ణం
జూలై నెల మొదటి నుంచి పుష్కలంగా వర్షాలు కురుస్తుండడంతో వికారాబాద్ జిల్లా పరిధిలో వివిధ పంటల సాగు పెరిగింది. జూన్లో పెద్దగా వర్షాలు కురువనందున పంటల సాగు నెమ్మదించగా జూలైలో ఆశించిన కంటే అధికంగా వర్షాలు కురువడంతో పంటల సాగు పెరిగింది. జూలై నెలలో 25 వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 271.9 మి.మీ.లు ఉండగా ఇప్పటివరకు 400 మి.మీ.ల వర్షపాతం నమోదైంది.
అధిక వర్షాలతో చెరువులు, కుంటల్లోకి పెద్దఎత్తున వరద నీరు చేరగా అనేక చెరువులు అలుగు పారుతున్నాయి. వరుసగా కురిసిన వర్షాలతో జిల్లావ్యాప్తంగా ఈ వానకాలంలో పంటల సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. పంటల సాగు కోసం వానకాలంలో 74,547 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనాలు తయారు చేయడంతోపాటు అందుబాటులో ఉంచారు. యూరియా 31,902 మెట్రిక్ టన్నులు, డీఏపీ 11,884 మె.ట, ఎంవోపీ 5,969 మె.ట, కాంప్లెక్స్ ఎరువులు 17,901 మె.ట, ఎస్ఎస్పీ 6,891 మె.ట ఎరువులు అవసరమని గుర్తించడంతోపాటు ఏ నెలలో ఎంత మేరకు అవసరమో ఆ మేరకు ఎరువులు తెప్పించడంతో ఇబ్బందులు లేకుండా సాఫీగా పంటల సాగు ప్రక్రియ కొనసాగుతున్నది. ఎరువుల కొరత తలెత్తకుండా బఫర్ స్టాకులు ఏర్పాటు చేయించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
వికారాబాద్ జిల్లా పరిధిలో ఈసారి వానకాలంలో ఇప్పటివరకు అత్యధికంగా పత్తి పంట సాగయింది.
పంట అంచనా సాగు(ఎకరాల్లో)
ఇతర పంటలు అన్నీ కలిపి ఇప్పటివరకు 4,15,118 ఎకరాల్లో సాగయ్యాయి. మిగతా పంటలతో పోలిస్తే అత్యధికంగా వరి సాగు విస్తీర్ణం పెరుగనున్నది. ఆగస్టు 15 నుంచి 20 వరకు వరి నాట్లు పూర్తయ్యే అవకాశాలుంటాయి. దీంతో వచ్చే నెల మూడో వారం లోపు పూర్తిస్థాయిలో అన్ని పంటల సాగు విస్తీర్ణం పూర్తవుతుంది.
80 శాతం పంటల సాగు
– గోపాల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
జిల్లా పరిధిలో 5,31,501 ఎకరాల్లో వివిధ పంటలు సాగు జరుగుతుందని అంచనా వేయగా.. ఇప్పటివరకు 80 శాతం పంటల సాగు పూర్తయింది. వరి నాట్లు వేయడం ప్రారంభమైంది. ఆగస్టు నెలలో వంద శాతం పంటల సాగు పూర్తవనున్నది. పంటలకు అవసరమైన మేరకు ఎరువులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచారు. జిల్లాలో ఈ వానకాలంలో వివిధ రకాల ఎరువులు 74,547 మెట్రిక్ టన్నులు అవసరమని గుర్తించి అందుబాటులో ఉంచారు.