కులకచర్ల, డిసెంబర్ 10 : ఉన్న కొద్దిపాటి పొలంలో తక్కువ నీటితో ఎక్కువ లాభాలను ఆర్జించేందుకు రైతులు పూల తోటల సాగువైపు దృష్టి సారించారు. సీజన్లలో చామంతి, బంతి, మల్లె తదితర పూలకు మంచి డిమాండ్ ఉండడంతో దానిపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మండలంలోని ఇప్పాయిపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్యగౌడ్ ఎకరం పొలంలో చామంతి పూల తోటను సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నాడు. ప్రభుత్వం కూడా సంప్రదాయ పంటలను వదిలి ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో గ్రామంలోని చాలామంది రైతులు వివిధ రకాల పూల తోటల సాగుపై మొగ్గు చూపుతున్నారు. శివస్వాములు, హనుమాన్, అయ్యప్ప స్వాముల పూజలకు, పెండ్లిం డ్ల సీజన్లలో పూలకు మంచి డిమాండ్ ఉన్నది.
వేసవిలోనూ పూల సాగు లాభదాయకమమని పలువురు రైతులు పేర్కొంటున్నారు. పెట్టుబడులు పెట్టి నష్టపోయే బదులు తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో పూల తోటల సాగులో మంచి లాభాలు వస్తున్నాయన్నారు. తాము పండించి న పూలను మహబూబ్నగర్, హైదరాబాద్లోని మార్కెట్ల తరలిస్తున్నట్లు .. కిలో పూలు రూ. 300 నుంచి రూ.400 వరకు ధర పలుకుతున్నదని చెబుతున్నారు. అంతేకాకుండా పెండ్లిండ్లు, పేరంటాలకు చుట్టు పక్కల ఉండే గ్రామాల ప్రజలు మా గ్రామానికి వచ్చి పూలను కొంటున్నట్లు పేర్కొన్నారు.
ఎకరం పొలంలో ప్రతి ఏటా చామంతి పూలను సాగు చేస్తూ అధిక లాభాలను పొందుతున్నా. పెండ్లిండ్లు, పూజల సమయంలో మంచి గిరాకీ ఉంటున్నది. చామంతి పూలను కులకచర్ల, మహబూబ్నగర్, హైదరాబాద్లోని మార్కెట్లకు తరలించి విక్రయిస్తున్నా. తక్కువ పెట్టుబడితో పూల సాగులో అధికంగా లాభాలను పొందొచ్చు.
– వెంకటయ్యగౌడ్, ఇప్పాయిపల్లి గ్రామం,కులకచర్ల