రంగారెడ్డి, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడి సాయం అదునుకు అందేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. పెట్టుబడి సాయం వెనుకబడింది. కాలం గడిచిపోతున్నదని ఆందోళన చెందుతున్న అన్నదాతలు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మరో నెల రోజుల్లో యాసంగి సీజన్ ముగియనుండడంతో ఇంకెప్పుడు రైతు బంధు సాయం అందుతుందని ఎదురుచూస్తున్నారు. చేతిల పైసలు లేక.. సాగు సాగక జిల్లా రైతాంగం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
యాసంగి సీజన్కు రైతు బంధు సాయం అందక రైతాంగం ఆందోళన చెందుతున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన దానికంటే ఎకరాకు సంవత్సరానికి రూ.15వేల చొప్పున ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అమలు చేయలేక పోయింది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినట్లుగానే ఎకరాకు రూ.5వేల లెక్కనే సాయం అందిస్తున్నది. గత డిసెంబర్ 13 నుంచి సాయం పంపిణీ ప్రారంభమైనప్పటికీ అరకొర మందికి మాత్రమే సాయం వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో ఈ యాసంగికి 4,04,436 మంది రైతులకు రూ.378.92కోట్ల సాయాన్ని అందించాల్సి ఉన్నది. ఇప్పటి వరకు 2,54,604 మంది రైతులకు రూ.147.33 కోట్లు వారి ఖాతాల్లో జమైనట్లు అధికారులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు మూడు ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే సాయం అందింది. దీంతో మిగతా రైతులకు ఎదురు చూపులే మిగిలాయి. గత కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు ప్రక్రియ సాయం వారం, పది రోజుల్లోనే పూర్తయ్యేది. కానీ.. కొత్త ప్రభుత్వంలో సీజన్ ముగిసిన తర్వాత కూడా సాయం డబ్బులు వస్తాయన్న నమ్మకం లేకుండా పోయిందని రైతాంగం వాపోతున్నది. పెట్టుబడులకు చేతిలో డబ్బులు లేక చాలా మంది రైతులు విధిలేని పరిస్థితుల్లో ఇప్పటికే వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేశారు. మరికొంత మంది రైతులు సైతం అదే బాట పడుతున్నారు. ఎవుసం మళ్లీ ఆగమైతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతు బంధు సాయం అందకపోవడంతో ప్రస్తుత యాసంగి సాగుపై తీవ్ర ప్రభావం పడుతున్నది. జిల్లాలో ప్రస్తుత యాసంగిలో 80వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పటి వరకు వరి, మొక్క జొన్న, వేరు శనగ, ఆముదం, కుసుమలు, శనగలు వంటి పంటలు 41వేల ఎకరాల్లో సాగయ్యాయి. కొంతమంది వరి నార్లు పోసుకున్నారు. ఇంకా నెల రోజుల్లో సీజన్ ముగియనున్నది. ఓ వైపు వర్షాభావ పరిస్థితులు నెలకొని భూగర్భ జలాలు అడుగంటడం.. మరోవైపు పెట్టుబడి లేక సాగు చేసేందుకు రైతాంగం సాహసించడంలేదు.
కేసీఆర్ ప్రభుత్వం సమయానికి పెట్టుబడి సాయం ఇచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కష్టాలు మొదలైనట్లు అనిపిస్తున్నది. అదును దాటవట్టే.. కాని రైతు బంధు రాకపాయే. రైతు బంధు డబ్బులు రేపొస్తయో.. ఎల్లుండొస్తయో.. ఎదురు చేసి విసుగు చెందిన.. ఇక రావని తేల్చుకుని అప్పు చేసి మూడు ఎకరాల్లో క్యాబేజీ, కాలీఫ్లవర్, బీట్రూట్ పంటలు సాగు చేశా. అనుకున్నంత ఫలితం రావడం లేదు. రైతులను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదు. ఇచ్చిన హామీలను నెరవేర్చి మాట నిలబెట్టుకోవాలి.
– సాలె నర్సింహులు, దేవునిఎర్రవల్లి (చేవెళ్ల రూరల్)
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక రైతుబంధు డబ్బులు రాలె. అదును దాటిపోయాక పైసలిస్తే.. తెచ్చిన అప్పులొల్లకు కూడా సరిపోవు.. ఈసారి ఎరువుల కొనేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. మళ్లీ ఎవుసం ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమయానికి పెట్టుబడి సాయమిచ్చేది. దున్నకం, ఎరువులు, విత్తనాలు, కూలీలు అని ఖర్చేమో పెరిగిపాయే.. ఇప్పటికైనా రైతుబంధు డబ్బులు వేయాలె.
– జోగిరెడ్డి, నందివనపర్తి, యాచారం
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఠంచన్గా పెట్టుబడి సాయమందేది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వక గోస పడాల్సి వస్తున్నది. అప్పుల కోసం మళ్లీ సావుకారుల దగ్గరకు పోవాల్సిన రోజులొచ్చినయ్. ఎన్నికల్లో గెలువడానికి ఇది చేస్తాం.. అది చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. రైతులను మోసం చేసింది.
– నేనావత్ రాంచందర్, నుచ్చుగుట్టతండా, ఆమనగల్లు మున్సిపాలిటీ
గత ప్రభుత్వ హయాంలో సమయానికి రైతుబంధు పడేది. ఇప్పుడేమో యాసంగి లాగోడికి రందీ పడాల్సి వస్తున్నది. అప్పులు తెచ్చి సాగు చేస్తున్నాం. పెట్టుబడి లేక సాగు తగ్గించా. ఎన్నికలప్పుడు గెలువగానే కాంగ్రెస్ పార్టీ పెట్టుబడి సాయం ఇస్తమన్నది. కానీ ఇప్పటిదాక రాలె. నా లాంటి సన్న, చిన్న కారు రైతులకు మళ్లీ ఎనుకటి కష్టాలు మొదలైనట్లు అనిపిస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం పెట్టుబడి సాయమందించాలి.
– భిక్షపతి, శంకర్పల్లి