పెద్దేముల్, ఏప్రిల్ 11 : రైతులు ఆరుగాలం పండించిన పంట చేతికి వచ్చే సమయంలో ఏదో ఒక రకంగా ఇబ్బందిపడి రైతులు అనేక రకాలుగా నష్టపోతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంట పొలాలకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అందుకు భిన్నంగా కరెంట్ సరిగ్గా ఉండకపోవడంతోపాటు భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడం, బోర్లలో సరిగా నీరు రాక అన్నదాతలు పంటల సాగు కోసం అష్టకష్టాలు పడుతున్నారు.
పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో సుమారు 3 డీటీఆర్లతో కూడిన ఓ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది. ఆ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో సుమారు 8 బోరు మోటర్లు ఉన్నాయి. అందులో రెగ్యులర్గా సుమారు 6 బోర్ మోటర్లు నడుస్తున్నాయి. ఈ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో రైతులు సుమారు 15 ఎకరాల వరిని పండిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ కాలనీకి అడ్డంగా ఉండడంతో కొద్ది రోజుల క్రితం ట్రాన్స్ఫార్మర్ను విద్యుత్ అధికారులు రోడ్డు వైపునకు షిఫ్ట్ చేశారు. ట్రాన్స్ఫార్మర్ను మార్చే సమయంలో ఎర్తింగ్ సరిగా ఇవ్వలేదు, ఆన్ ఆఫ్ బటన్లను కూడా పెట్టలేదు. దీంతో ఓల్టేజీ తక్కువై తరచుగా బోర్ మోటర్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయి.
రైతులకు బోర్ మోటర్లు, స్టార్టర్ల రిపేర్ తిప్పలు తప్పడంలేదు. ఒకవైపు బోర్లలో భూగర్భజలాలు అడుగంటిపోయి నీళ్లు రాక ఇబ్బందులు పడుతుంటే.. లోఓల్టేజీ సమస్యతో నీళ్లందక వరి పంట గింజ పట్టే సమయంలో పూర్తిగా ఎండిపోయి ఎంతోమంది రైతులు నష్టపోయి అప్పుల్లో కూరుకుపోతున్నారు. ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేయాలని, ఎర్తింగ్తోపాటు, ఆన్ ఆఫ్లను పెట్టాలని సంబంధిత విద్యుత్ లైన్మెన్లు, అధికారులను కోరితే వారు ఎర్తింగ్కు సంబంధించిన పైపులు, ఇతర సామగ్రి మీరే తెచ్చుకోండంటూ సమాధానం చెబుతున్నారని రైతులు వాపోతున్నారు.
మంబాపూర్లోని ఎస్సీ కాలనీలో ఉన్న ట్రాన్స్ఫార్మర్కు సరిగా మరమ్మతులు చేయకపోవడంతోనే మా వరి పంటలు ఎండిపోయాయి. పలుమార్లు ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేయాలని కోరినా వారు పట్టించుకోలేదు. పైగా ఎర్తింగ్ పైపులు ఇతర సామగ్రి మొత్తం మీరే తెచ్చుకోండి అని చెబుతున్నారు. రైతులు పంటలు పండించాలంటే అటు విద్యుత్ సమస్యలు, ఇటు ఆర్థిక ఇబ్బందులు తప్పడంలేదు. ఇప్పటికైనా అధికారులు మా సమస్యను త్వరగా పరిష్కరించాలి.
– రేగొండి శ్రావణ్కుమార్, రైతు, మంబాపూర్
భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో బోరు బావుల్లో నీళ్లు పూర్తిగా అడుగంటిపోయాయి. ఉన్న నీటిని మోటర్ల సాయంతో తోడి పంటలను సాగు చేసుకుందామంటే విద్యుత్ సమస్యలతో అది కూడా కుదరడంలేదు. మా గ్రామంలో ఎస్సీ కాలనీ నుంచి మార్చిన ట్రాన్స్ఫార్మర్కు సరిగా ఎర్తింగ్ ఏర్పాటు చేయకపోవడంతో లోఓల్టేజీ సమస్యతో మా బోరు మోటర్లు, స్టార్టర్లు తరచూ కాలిపోతుండడంతో వాటి రిపేరుకు చాలా డబ్బులు ఖర్చవుతున్నాయి. అధికారులు లోఓల్టేజీ సమస్యను వెంటనే పరిష్కరించి మాలాంటి నిరుపేద రైతులకు న్యాయం చేయాలని వేడుకుంటున్నా.
– ఎంగూరి బాలప్ప, రైతు, మంబాపూర్