మంచాల, మే 27: రైతు ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో నిర్మించిన రైతు వేదికలు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పంటల సాగుపై మండల వ్యవసాయ శాఖ అధికారులు రైతులను ఎప్పటికప్పుడు సాగుకు సన్నద్ధం చేసేందుకు దృష్టి పెడుతున్నారు. కాలానికి అనుగుణంగా ఎలాంటి పంటలు సాగుచేసుకోవాలి ఏ విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. ప్రభుత్వ పథకాలను ఏవిధంగా అందుకోవాలి, నకిలీ విత్తనమోసాలపై వంటి అంశాలపై అధికారులు రైతు వేదికల ద్వారా రైతులకు శిక్షణలనిస్తూ చైతన్య పరుస్తున్నారు. రైతులకు సమగ్ర సమాచారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్లస్టర్కు ఒకటి చొప్పున రైతు వేదికలను నిర్మించారు. మంచాల మండలంలోని ఆరుట్ల, బోడకొండ, మంచాల గ్రామంలో రైతు వేదికలు నిర్మించగా, ఒక్కో వేదికకు రూ.22లక్షలు వెచ్చించింది. క్లస్టర్ పరిధిలోని రైతులు ఎలాంటి పంటలు వేయాలి, ఎలాంటి పంటలు వేస్తే లాభదాయకంగా ఉంటాయని, ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ వివరాలు, రైతుబంధు, రైతుబీమా ఇతర పథకాల పర్యవేక్షణ వేదిక ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో నిర్మించిన వేదికలు నేడు రైతులతో సందడి నెలకొన్నాయి. వానకాలంలో ఎలాంటి పంటలు సాగుచేయాలనే విషయంపై ప్రతి రైతు వేదికల్లో ఆయా క్లస్టర్ పరిధిలోని ఏఈవోలు ఇప్పటికే రైతులతో వారం వారం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
రైతులకు సలహలు, సూచనలు..
రైతు వేదికల్లో పంటల సాగుపై అధికారులు శిక్షణ తరగతులు సలహాలు, సూచనలను ఇవ్వడంతో వేదికలు సందడిగా కనిపిస్తున్నాయి, వానకాలం సీజన్లో రైతులు ఏపంట సాగుచేసుకుంటే అధికలాభాలు వస్తాయని శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. మంచాల వ్యవసాయ శాఖ అధికారి జ్యోతిశ్రీ ఆధ్వర్యంలో పంటల సాగుపై రైతులను చైతన్య పరుస్తున్నారు. పచ్చిరొట్ట ఆవశ్యకత, రైతుబీమా, రైతుబంధు, అదేవిధంగా పత్తి, కంది, జొన్న, సజ్జ మొక్కజొన్న ఇతర విత్తనాల కొనుగోళ్లలో పాటించాల్సిన జాగ్రత్తలు బ్యాక్టీరియా ఉపయోగం, లాభాలు, ఎరువుల సమతుల్య వాడకం తదితర అంశాలపై రైతులకు శిక్షణ ఇచ్చారు. మండల స్థాయి అధికారులతో పాటు జిల్లా స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు కూడా శిక్షణ కార్యక్రమంలో పాల్గొని లాభాల పంటలు సాగుచేసుకోవాలని సూచిస్తున్నారు. లైసెన్సు ఉన్న డీలర్లు వద్దనే విత్తనాలు, పురుగుల మందులు కొనుగోలు చేయాలని వివరించారు. ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయం రైతులకు ఎంతగానో మేలు జరుగుతుంది.
రైతు వేదికల్లో శిక్షణ..
మంచాల క్లస్టర్ పరిధిలో ఉన్న రైతు వేదికల్లో నిరంతరం వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండి పంటల సాగుపై వారు అడిగిన సలహాలు సూచనలతో పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. గతంలో క్షేత్రస్థాయిలో శిక్షణ తరగతులను నిర్వహించుకునేందుకు ఎలాంటి సదుపాయాలు ఉండేవి కాదు. ఇప్పుడు రైతు వేదికలు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. రైతులను అనేక విషయాల్లో చైతన్యం చేసేందుకు వేదికలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. వీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాలు ఆశయాలు కూడా రైతులకు నేరుగా చేరుతున్నాయి. పంటల సాగుపై రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఫోన్ ద్వారా అధికారులను సంప్రదించడమే కాకుండా నేరుగా వెళ్లి రైతువేదికల్లో ఉన్న వ్యవసాయ అధికారులను సంప్రదిస్తున్నారు. ప్రతి రోజు అధికారులు క్లస్టర్ పరిధిలో ఉన్న రైతు వేదికల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు.
– లింగస్వామి, ఏఈవో