ఇబ్రహీంపట్నం రూరల్, జనవరి 8 : వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పద్ధతులను రైతులు అనుసరిస్తున్నారు. సులభ పద్ధతిలో వ్యవసాయం చేసి, తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడులు తీస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేందుకు సూక్ష్మ, తుంపర సేద్యం ఎంతో దోహదపడుతున్నది. మెట్ట ప్రాంతాల్లో తుంపర సేద్యానికి రైతులు మొగ్గు చూపుతుండగా, ప్రభుత్వం సబ్సిడీపై పరికరాలనూ అందిస్తున్నది. ఆరుతడి పంటలు వేరుశనగ, శనగ, మొక్కజొన్న, బొబ్బెర్లు, కందులు, పెసర, పత్తితో పాటు పలు రకాల ఆకుకూరలు, కూరగాయల పంటలు, పండ్ల తోటనూ తుంపర సేద్యంతో పండించవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. డ్రిప్ విధానంలో పంటల్లోని ప్రతి సాలుకు సన్నని పైపు అమర్చి ఒక్కో చుక్కనీరు మొక్క మొదలులో పడేలా చేయడం, పంటలో పెద్దపైపులు వేసి స్ప్రింకర్ల్ హెడ్ ద్వారా నీటిని విరజిమ్మి పంటకు నీరందించడం ఉన్నాయి.
స్ప్రింక్లర్లను తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకోవచ్చు. ఎకరం నుంచి నాలుగు ఎకరాల భూమిలో స్ప్రింక్లర్ల పైపులు వేసేందుకు రూ.5వేల నుంచి రూ.12వేల వరకు ఖర్చవుతున్నది. ఇందుకు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీ, బీసీలకు 90 శాతం, ఇతరులకు 80శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలను ప్రభుత్వం అందిస్తున్నది. ఉద్యానవన అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు. రైతులు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
స్ప్రింక్లర్లలో ఇంపాక్ట్ స్ప్రింక్లర్లు, మైక్రో స్ప్రింక్లర్లు, పార్ట్ సర్కిల్ స్ప్రింక్లర్లు, పర్ ఫోరేటెడ్పైపులు, జెట్ స్ప్రింక్లర్లు, పాపప్ స్ప్రింక్లర్లు, రెగ్యులేటెడ్ స్ప్రింక్లర్లు తదితర రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని భూమిలో పాతిపెట్టడం, కొన్ని పైపులు భూమి లోపల ఉంచి మిగతా పరికరాలను బయట ఉంచడం, ఇక స్ప్రింక్లర్ పైపులన్నీ భూమిపైనే ఉంచి నీరందించడం ఉంటాయి. ఈ విధానంతో పైపులను ఒక్కచోట నుంచి మరో చోటుకు తరలించుకోవచ్చు.
తక్కువ శ్రమ, తక్కువ నీటి వినియోగంతో పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించవచ్చు. డ్రిప్, స్ప్రింక్లర్లతో పంటకు సరిపడా నీటిని అందించవచ్చు. డ్రిప్, స్ప్రింక్లర్లను ఆరుతడి పంటల సాగు కోసం వాడుకోవాలి. తక్కువ నీటితో కరువులోనూ పంటలు వేసి లాభాలు పొందాను.
– మొద్దు అంజిరెడ్డి,
ఉత్తమరైతు, ఇబ్రహీంపట్నం
బిందు, తుంపర సేద్యంతో పంటకు సరిపడా నీరు అంది ఏపుగా పెరుగుతుంది. దిగుబడులు సాధారణం కంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. తక్కువ నీటి వనరులు ఉన్నా మెట్ట ప్రాంతాల్లో డ్రిప్, తుంపర సేద్యానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. తుంపర సేద్యం ఆరుతడి పంటలకు ఎంతో మేలు.
– సునంద, ఉద్యానవన జిల్లా అధికారి