వికారాబాద్, ఆగస్టు 17: గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో గురుకుల పాఠశాలల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల సంక్షేమ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సకల సౌకర్యాలు కల్పించాలన్నారు. మొదటి ప్రాధాన్యతగా తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలన్నారు. అదేవిధంగా విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అనుగుణంగా ఫ్యాన్స్, లైట్లు అమర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
మంజూరు చేసిన నిధులతో విద్యుత్తు , ప్లంబర్ పనులు చేపట్టడమే కాకుండా టాయిలెట్స్, నల్లాలు, గోడల పగుళ్లు, ఫ్లోరింగ్, పై కప్పు నీరు లీకేజీ లాంటి మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా మంచాల ఏర్పాటు, గదుల్లోకి స్వచ్ఛమైన గాలి వచ్చేలా కిటికీలు, వెంటిలేటర్లకు జాలీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రభుత్వం అందించిన నిధులు వృథా కాకుండా అవసరమైన మైనర్ పనులను చేపట్టాలన్నారు.
పాఠశాలల భవనాల పై నీరు నిల్వ ఉండకుండా, పైకప్పుల మరమ్మతులు పనులు చేపట్టాలని తెలిపారు. పనులు చేపట్టకముందు, పనులు పూర్తయిన తర్వాత తీసిన ఫొటోలను సమర్పించాలని అధికారులకు సూచించారు. జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియామకం చేసి పనులు పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. మేజర్ పనులు ఏవైనా ఉంటే ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి మల్లేశం, గిరిజన అభివృద్ధి అధికారి కమలాకర్ రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ బాబు శ్రీనివాస్, గురుకులాల ప్రిన్సిపాళ్లు, అధికారులు పాల్గొన్నారు.