తాండూరు, ఆగస్టు 12 : హైదరాబాద్ ఎస్టీఎఫ్, ఉమ్మడి జిల్లా సీఅండ్డీటీ ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్, వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారులు రెండు టీంలుగా ఏర్పడి మంగళవారం రాత్రి సంయుక్తంగా జరిపిన దాడుల్లో 52.8కిలోల ఎండు గంజాయి పట్టుబడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్రెడ్డి బుధవారం మధ్యాహ్నం తాండూరు ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
భువనేశ్వర్ (ఒరిస్సా) నుంచి ముంబాయికి వెళుతున్న ఎల్టీటీ రైలులో మంగళవారం రాత్రి ఈ ఎండు గంజాయిని ముగ్గురు వ్యక్తులు తీసుకువచ్చినట్లు తెలిపారు. తాండూరు రైల్వేస్టేషన్ ఆవరణలోని టూవీలర్ పార్కింగ్ ఏరియా వద్ద తనిఖీలు చేయగా, ఎండు గంజాయి ట్రాలీ సూట్కేసులు కలిగిన ముగ్గురు నిందితులను పట్టుకుని వారి వద్ద ఉన్న ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని చాకచక్యంగా పట్టుకున్నట్లు తెలిపారు.
నిందితులు మధుప్రదాన్ (34) కల్లికటె, గంజాం జిల్లా ఒడిస్సా, శిభా నాహక్ (25) నూతం బెహ్రాన్పూర్, గంజాం జిల్లా , ఒడిస్సా, నీలు మండల్ (22)పాసి, గంజాం జిల్లా, ఒడిస్సా వీరి నుంచి నాలుగు లగేజీ ట్రాలీ సూట్కేసులలో తరలిస్తున్న 52.8కిలోల గంజాయి లభించినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
పట్టుబడిన గంజాయి విలువ రూ.13 లక్షల 20వేలు ఉంటుందన్నారు. పట్టుబడిన నిందితులు డ్రగ్ ఫెడలర్స్ నుంచి గంజాయి సూట్కేసులు తీసుకుని వారు నిర్ణయించిన వారికి అప్పగించేందుకు నిందితులు ఒక్కొక్కరూ రూ.10వేలు తీసుకుంటున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఇలాంటి గంజాయి, ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్నా, విక్రయించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు. మత్తుపదార్థాల అక్రమ రవాణా సమాచారం తెలిసిన వారు 8712658754 నంబర్కు సమాచారం అందించాలని కోరారు.
సమాచారం అందించిన వారి పేరుల గోప్యంగా ఉంచుతామని తెలిపారు. పట్టుబడిన ముగ్గురు నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు పంపనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో తాండూరు ఎక్సైజ్ ప్రొహిబిషన్ సీఐ ఎన్.రాణి, ఎస్టీఎఫ్ ఎస్ఐలు వెంకటేశ్, మంజుల, డీటీఎఫ్ సీఐ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఒడిస్సా నుంచి తాండూరుకు తీసుకు వచ్చిన గంజాయిని ఎవరికి చేరవేస్తున్నారు. స్థానికంగా ఉన్న గంజాయి విక్రేతలు ఎవరు, మరెక్కడికి గంజాయిని రవాణా చేస్తున్నారు అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్రెడ్డి వివరించారు.