కొడంగల్, ఫిబ్రవరి 1:నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు అవసరమైన స్థలం గుర్తింపునకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గురువారం టిమ్స్ డైరెక్టర్ విమల థామస్, వైద్యావిద్య డైరెక్టర్ శివరాం, అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డితో కలిసి నియోజకవర్గంలోని పలు స్థలాలను పరిశీలించారు. కొడంగల్ మండల పరిధిలోని ఉడిమేశ్వర్ గ్రామ ప్రాంతంలో నిర్మిస్తున్న
బీసీ గురుకుల పాఠశాల భవనంతో పాటు అప్పాయిపల్లి, బొంరాస్పేట, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో అధికారులు స్థల సేకరణకు గాను క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు.
పరిశీలించిన భూములకు సంబంధించిన వివరాలు, విస్తీర్ణం, చిత్రపటాలతో సహా వివరాల నివేదికలు, ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని సీహెచ్సీ 50 పడకల దవాఖానను 100 పడకలుగా విస్తరించేందుకు గాను అధికారులు ఆ ఆసుపత్రిని పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్కుమార్, డీసీహెచ్ఎస్ ప్రదీప్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. చంద్రప్రియ, డిప్యూటీ డీఎం అండ్ హెచ్వో రవీంద్రయాదవ్, డాక్టర్ వీణ, డాక్టర్ సాకేత్లతో పాటు బీసీ గురుకుల పాఠశాల రీజినల్ కోఆర్డినేటర్ యాదయ్యగౌడ్, ప్రిన్సిపల్ శంకర్ పాల్గొన్నారు.