వికారాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారిన గనుల తవ్వకాల అనుమతులు ఇకపై మరింత కఠినతరం కానున్నది. ఇప్పటి వరకు పెద్దతరహా గనులకు మాత్రమే పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని ఉన్న నిబంధనను చిన్నతరహా ఖనిజాలకూ సంబంధిత నిబంధనను వర్తింపజేస్తూ నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు చిన్నతరహా ఖనిజాలకూ పర్యావరణ అనుమతులు తప్పక తీసుకునేలా అమలు చేసేందుకు జిల్లా మైనింగ్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
జిల్లాలో దాదాపు అధిక మొత్తంలో చిన్నతరహా ఖనిజాలను తవ్వుతున్న మైనింగ్ యాజమాన్యాలు తప్పనిసరిగా పర్యావరణ అనుమతులు తీసుకోవాలని ఇప్పటికే సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తొలుత ఇసుకకే పరిమితమైన పర్యావరణ అనుమతులు, మైనింగ్ తవ్వకాలతో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా పలువురు ఎన్జీవోలు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మేరకు సుప్రీం తొలుత పెద్దతరహా ఖనిజాలకు (సున్నపురాయి), తదనంతరం చిన్నతరహా ఖనిజాలకూ పర్యావరణ అనుమతులు ఉండాలని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
జిల్లాలో 200 చిన్నతరహా ఖనిజాలకు సంబంధించి మైనింగ్ లీజులు కొనసాగుతుండగా, ఒక్క సంస్థకూ పర్యావరణ అనుమతులు లేకపోవడం గమనార్హం. ఇప్పటికే లీజు తీసుకున్న మైనింగ్ సంస్థలకు పర్యావరణ అనుమతుల దరఖాస్తుకు ప్రభుత్వం మార్చి 31 వరకు గడువునిచ్చింది. గడువులోపు ఏదేని మైనింగ్ సంస్థ పర్యావరణ అనుమతి తీసుకోలేనట్లయితే మైనింగ్ శాఖ అధికారులతోపాటు రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి, అటవీ శాఖ అధికారుల బృందం పరిశీలించి పనులను నిలిపివేయనున్నారు.
చిన్నతరహా ఖనిజాల తవ్వకాలకు సంబంధించి పర్యావరణ అనుమతులు పొందేందుకుగాను మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. ప్రస్తుతం లీజు కొనసాగుతున్న చిన్నతరహా ఖనిజ తవ్వకాల యాజమాన్యాలు తప్పనిసరిగా అనుమతి పొందాల్సిన అవసరం ఉన్నది. కొత్తగా లీజు పొందే వారితోపాటు ఇప్పటికే కొనసాగుతున్న లీజు సంస్థలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని అనుమతులు పొందాల్సి ఉంటుంది. జిల్లాలో చిన్నతరహా ఖనిజాల్లో భాగంగా ఎర్రమట్టి, సుద్ద గనులు, నాపరాయి, పలుగురాయి, సెల్డ్స్పార్, కంకర, గ్రానైట్ తవ్వకాలు జరిపే వారంతా తప్పనిసరిగా పర్యావరణ అనుమతులు పొందాల్సిన అవసరముంది.
అదేవిధంగా జిల్లాలోని పెద్దేముల్, మర్పల్లి, వికారాబాద్, పరిగి మండలాల్లో 610 హెక్టార్ల విస్తీర్ణంలో 40 ఎర్రమట్టి గనులు ఉన్నాయి. తాండూరు మండలంలో 100 హెక్టార్ల విస్తీర్ణంలో 160 నాపరాయి గనులు ఉన్నాయి. పెద్దేముల్, మర్పల్లి, ధారూరు మండలాల్లో 41 హెక్టార్ల విస్తీర్ణంలో 65 సుద్ద గనులు, వికారాబాద్, దోమ మండలాల్లో 86 హెక్టార్లలో 34 కంకర గనులు ఉన్నాయి. తాండూరు మండలంలో 12 హెక్టార్లలో 6 గ్రానైట్ గనులుండడంతోపాటు దోమ మండలంలో 76 హెక్టార్లలో 6 పలుగురాళ్ల గనులు ఉన్నాయి.
తాండూరు పరిసరాల్లో వందల సంఖ్యలో ఉన్న నాపరాళ్ల పాలిషింగ్ యూనిట్లతో తాండూరు పట్టణంలో కాలుష్యం పెరిగిపోతున్నది. తాండూరు పట్టణ పరిసరాల్లో దాదాపు 800 పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. ప్రతి రోజూ ఈ పాలిషింగ్ యూనిట్లలో కనీసం 400 లారీల (6 వేల టన్నుల ) నాపరాళ్లను పాలిష్ చేస్తున్నారు. వీటిని పాలిషింగ్ చేసే ముందుగా గనుల నుంచి తీసుకొచ్చిన నాపరాళ్ల పలుకలను తగిన సైజుల్లో కోత యంత్రాల సాయంతో కోస్తారు. దీంతో పెద్ద ఎత్తున వ్యర్థాలు మిగులుతాయి. ప్రతి పాలిషింగ్ యూనిట్లో కనీసం రోజుకు 5 టన్నుల నుంచి 10 టన్నుల వరకు వ్యర్థాలు వెలువడుతున్నాయి.
దీంతో పట్టణ పరిధిలో ప్రతి రోజూ కనీసం 8 వేల నుంచి 10 వేల టన్నుల వరకు వ్యర్థాలను పారవేయడం ఆనవాయితీగా మారింది. వ్యర్థాలను ప్రధాన రోడ్ల ప్రక్కన పారబోస్తున్నారు. ట్రాక్టర్లలో నింపి రోడ్ల ప్రక్కన డంపింగ్ చేయడంతో రోడ్ల ప్రక్కన వ్యర్థాలు కుప్పలుగా పేరుకుంటున్నాయి. పాలిష్ చేసే సమయంలో ఇసుక పౌడర్గా మారి సుద్ద రూపంలో బయటకు వస్తున్నది. ఇలాంటి వ్యర్థాలనూ పాలిషింగ్ యూనిట్ల వారు రోడ్ల ప్రక్కన వేస్తున్నారు.
దీంతో రోడ్లపై వాహనాలు వెళ్లిన సమయంలో కాలుష్యం వెదజల్లుతున్నది. తాండూరు పట్టణంలో, పరిసరాల్లో నాపరాళ్ల వ్యర్థాలతో కాలుష్యం పెరుగకుండా చేయాలంటే ప్రత్యామ్నాయంగా చర్యలు తీసుకోవాల్సి ఉన్నది. తాండూరు పట్టణ పరిసరాల్లో 15 నుంచి 20 కిలో మీటర్ల పరిధిలో వందల సంఖ్యలో పాలిషింగ్ యూనిట్లు, నాపరాళ్ల క్వారీలు, సుద్ద గనులు, ల్యాటరైట్ గనులు ఉండడంతో పట్టణం మీదుగా ప్రతి రోజూ 5 వేలకుపైగా లారీలు వస్తూ పోతుంటాయి. సిమెంట్ కర్మాగారాలకు ప్రతిరోజూ బొగ్గు, రాళ్లు, ల్యాటరైట్ను(ఎర్రమట్టిని) చేరవేసే లారీలు వందల సంఖ్యలో తిరుగుతుండడంతో పట్టణంలో కాలుష్యం మరింతగా పెరుగుతున్నది.
చిన్నతరహా ఖనిజ తవ్వకాలకు లీజు పొందిన వారంతా పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పర్యావరణ అనుమతులు లేని లీజు సంస్థల పనులు నిలిపివేస్తాం.
– జాకబ్, జిల్లా మైనింగ్ శాఖ ఏడీ