మొయినాబాద్, జనవరి 11 : పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆంగ్లంలో నాణ్యమైన విద్యను పొందాలి అంటే లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ మధ్య తరగతి, పేదరిక కుటుంబాలకు చెందిన విద్యార్థులు లక్షల్లో ఫీజులు చెల్లించని పరిస్థితి ఉంటుంది. తోటి పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసిస్తున్నారు అంటే తమ పిల్లలను కూడా చదివించాలని కాయా కష్టం చేసి, అప్పో సప్పో చేసి ఫీజులు అతి కష్టం మీద చెల్లిస్తుంటారు. ఫీజులు కట్టలేని పరిస్థితి ఉండే విద్యార్థులను పరీక్షలు రాయనివ్వకపోవడం స్కూల్ బయట తోటి విద్యార్థుల ముందు నిలబెట్టి అవమానించడం వంటి పరిస్థితి ఉంటుంది.
ఇలాంటి పరిస్థితులు మధ్య, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇబ్బంది పడకూడదని, వారికి సైతం నాణ్యమైన విద్యను ఆంగ్ల మాధ్యమంలో అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం మాడల్ పాఠశాలలను ప్రవేశపెట్టి నాణ్యమైన విద్యను ఆంగ్ల మాధ్యమంలో ఉచితంగా విద్యా బోధన అందిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదవాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మాడల్ స్కూల్ ఒక వరంగా మారింది. విద్య కోసం రూ. లక్షల్లో ఖర్చు పెట్టి దూర ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలల్లో చదవాల్సి లేకుండా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోనే ఆదర్శ పాఠశాలలను నెలకొల్పడంతో నాణ్యమైన విద్య అందుతున్నది.
బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరానికి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 12 నుంచి ఫిబ్రవరి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. 6వ తరగతిలో చేరేందుకు ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 7న ఆయా పాఠశాలల్లో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుందని పాఠశాల విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. 7,8,9,10 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రూ.125, ఇతరులు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు http://telanganams.cgg.gov.in వెబ్ సైట్లో చూడవచ్చు.
చేవెళ్ల నియోజకవర్గంలో 5 మండలాలు ఉండగా అందులో మొయినాబాద్ మినహాయించి చేవెళ్ల, షాబాద్, శంకర్పల్లి, నవాబ్పేట మండలాల్లో ఆదర్శ (మాడల్ స్కూల్) పాఠశాలలు ఉన్నాయి. ఆదర్శ పాఠశాలలు ఆయా మండలాల్లో విజయవంతంగా కొనసాగుతున్నాయి. మాడల్ పాఠశాలల్లో సీట్లు పొందడానికి తీవ్ర పోటీ నెలకొన్నది. ఎందుకంటే ఉచితంగా ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యా బోధన అందుతుంది కాబట్టి పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలను అందులో చేర్పించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. 6వ తరగతిలో 100 సీట్లు పొందే అవకాశం ప్రభుత్వం కల్పించింది. 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి విద్యా శాఖ ప్రణాళికలను రూపొందించింది.
మాడల్ స్కూల్లో 6, 7, 8, 9, 10 తరగతుల్లో ప్రవేశాలు పొందడానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఏప్రిల్ 1 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి. పరీక్షా ఫలితాల ప్రకటన తరువాత సంబంధిత పాఠశాల ప్రిన్సిపాల్స్కు మెరిట్ జాబితా అందుతుంది. మాడల్ స్కూల్లో విద్యార్థుల ఎంపిక ఖరారు చేస్తారు. దానికి అడిషనల్ కలెక్టర్లు ఆమోదం తెలుపుతారు. మే 25 నుంచి 31వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టి ప్రవేశాలు కల్పిస్తారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.
6వ తరగతి ప్రవేశ పరీక్షల్లో 100 ప్రశ్నలతో ప్రశ్నా పత్రం తయారు చేసి 100 మార్కులు కేటాయించారు. ప్రశ్నా పత్రం తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. 6వ తరగతిలో తెలుగు, గణితం, ఎన్విరాన్మెంటల్, సైన్స్, ఆంగ్ల పాఠ్యాంశాల్లో ఒక్కో దాని నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. 7 నుంచి 10 వరకు గణిత, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, ఇంగ్లిష్ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో దాని నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. 2 గంటల పాటు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
బాలికలకు హాస్టల్లో వసతి, సౌకర్యం ఉంటుంది. 9, 10, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న 100 మందికి మాత్రమే అవకాశం కల్పించడం జరుగుతుంది. పాఠశాల, హాస్టల్కు 3 కిలో మీటర్ల దూరంలో ఉండే విద్యార్థులకు మాత్రమే హాస్టల్ వసతి కల్పించడం జరుగుతుంది.
విద్యార్థులు మాడల్ పాఠశాలల్లో వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మాడల్ పాఠశాలల్లో ఉచితంగా ఆంగ్లంలో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుంది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఈ పాఠశాలల్లో విద్యా బోధన ఉంటుంది. మాడల్ విద్యార్థులు ఐఐటీలో సీట్లు కూడా పొందుతున్నారు. విద్యార్థినులకు ఉచితంగా హాస్టల్ వసతి సౌకర్యం కూడా ఉంది. కావున విద్యార్థులు, విద్యార్థినులు మాడల్ పాఠశాలల ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
– కె వెంకటయ్య, ఎంఈవో