రంగారెడ్డి, మే 18 (నమస్తే తెలంగాణ) : తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసబ్చెరువుకు ఆక్రమణలతో దాని ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఓ వైపు కబ్జారాయుళ్లు చెరువును ఎక్కడికక్కడ చెరపడుతుండగా…మరోవైపు ఓ నిర్మాణ సంస్థ చెరువు కట్టను తోడేస్తుండటంతో.. దాని వెడ ల్పు పూర్తిగా తగ్గిపోయి వర్షాకాలంలో ఆ కట్ట కుం గిపోయే ప్రమాదం ఉన్నది.
మాసబ్చెరువుకట్ట కిందిభాగంలో ఓ నిర్మాణ సంస్థ 5.20 ఎకరాల ప్రభుత్వ భూమిని జీవోనంబర్ 58, 59 కింద నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్ధీకరించుకున్నది. ఈ భూమిలో భారీ ఎత్తున అపార్ట్మెంట్లతోపాటు భారీ షాపింగ్ కాంప్లెక్స్లను నిర్మిస్తున్నది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణం సాగర్ రహదారి వరకు వచ్చే అవకాశమున్నది. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్లను నిర్మిస్తున్నారని.. వెంటనే ఆ పనులను నిలిపేయాలని అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని మండిపడుతున్నారు.
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసబ్చెరువు సుమారు 370 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ చెరువులోకి వానకాలంలో నాదర్గుల్, గుర్రంగూడ, తుర్కయాంజాల్, కమ్మగూడ, రాగన్నగూడ, కుర్మల్గూడ తదితర గ్రామాల నుంచి వచ్చే వరదనీరు చేరి నిండుకుండలా మారుతుంది. కానీ, ఇటీవల కొందరు రియాల్టర్లు చెరువును కబ్జాచేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో చెరువు నీటి సామర్థ్యం తగ్గిపోతున్నది. చెరువులోకి వచ్చే వరదనీరు తూము నుంచి బయటికి వెళ్తున్నది. వరదనీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో వర్షాకాలంలో చెరువుకట్టకు ప్రమాదం పొంచి ఉందని గతంలోనే రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు.
తుర్కయాంజాల్ మాసబ్చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఇండ్ల నిర్మాణాలపై ఇప్పటికే హైడ్రా అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో పలుమార్లు వారు చెరువు ఎఫ్టీఎల్ లోపల నిర్మించిన నిర్మాణాలపై విచారణ జరిపి నోటీసులు కూడా జారీచేశారు. కానీ, అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో అవి వెలుస్తూనే ఉన్నాయి. మరోవైపు ఓ నిర్మాణ సంస్థ ఏకంగా చెరువుకట్టనే తోడేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నది. అయినప్పటికీ హైడ్రా అధికారులు ఈ నిర్మాణాలపై దృష్టి సారించటంలేదు. ఈ ప్రాంతంలోని భూముల ధరలు అధికంగా ఉండడంతో 370 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మాసబ్చెరువుపై అక్రమార్కుల కన్ను పడింది. చెరువుతోపాటు దాని కట్టను కూడా కబ్జాచేస్తున్నారు. అధికారులు వెంటనే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.