షాద్నగర్, మే 1 : రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. శ్రమిస్తేగాని అందవు పుట్టెడు మెతుకులు. రెక్కల కష్టం చేద్దామన్నా దొరకని పనులు. ఉపాధిని వెతుక్కుంటూ వివిధ రాష్ర్టాలకు వలసలు. ఇవన్నీ సమైక్య రాష్ట్రంలో కనిపించి. కదిలించిన దృశ్యాలు. తెలంగాణ సర్కార్ వచ్చాక ఆ దృశ్యాలు అదృశ్యామయ్యాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో పరిశ్రమలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. స్థానికంగా ఉపాధి కోరే వారికే కాదు, ఇతర రాష్ర్టాల వారికి కూడా ఉపాధినిచ్చి అన్నం పెడుతున్నాయి. ఒకప్పుడు వలసల ప్రాంతాలుగా పేరుపొందిన ఈ ప్రాంతం ఇప్పుడు ఇతర రాష్ర్టాల నుంచి వలసలు వస్తున్నారు. పారిశ్రామిక ప్రగతితో షాద్నగర్ నియోజకవర్గ రూపురేఖలే మార్చేసిన సర్కారు పనితీరును చూసి వలస కార్మికులు సంబురపడుతున్నారు. సర్కారు చేపట్టిన టీఎస్ ఐపాస్ పథకం ద్వారా రంగారెడ్డి జిల్లాలో వందల సంఖ్యలో పరిశ్రమలు పురుడు పోసుకున్నాయి. ఫలితంగా కార్మికులకు కల్పతరువుగా మారాయి.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో ఎంత నష్టపోయిందో పాలమూరు ప్రాంతం అంతకంటే రెండు రేట్లు నష్టపోయిందనేది ఈ ప్రాంత ప్రజల అభిప్రాయం. మొదటి నుంచి ఉపాధికోసం ఎదిరిచూసే ఇక్కడి ప్రజలకోసం అప్పటి పాలకులు షాద్నగర్ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించాలని చర్యలు తీసుకున్నా.. సీమాంధ్రుల పాలనలో ఆశించిన స్థాయిలో ప్రగతి కనిపించలేదు. పైగా ఉపాధికోసం వలసలు వెళ్లే పరిస్థి నెలకొంది. 1976లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కొత్తూరు మండల కేంద్రాన్ని పారిశ్రామిక ప్రాంతంగా ప్రభుత్వం గుర్తిస్తూ ఇక్కడ పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. దీనికితోడు కాలానుగునంగా షాద్నగర్, కొందుర్గు, కేశంపేట మండలాలతోపాటు స్థానికంగా భారీ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలు వెలిశాయి. నేడు కొత్తూరు, షాద్నగర్ పారిశ్రామిక వాడలో సుమారు 200లకు పైగా పరిశ్రమలు కొనసాగుతున్నాయి. వీటికి ధీటుగా కొందుర్గు, కేశంపేట, నందిగామ మండలాల్లో కూడా పారిశ్రామికరంగం రోజురోజుకూ అభివృద్ధి చెందుతుంది. ఈ పరిశ్రమల్లో ముఖ్యంగా ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన ఫార్మా, వస్ర్తాలు, కాస్మోటిక్స్, ముడి ఇనుము, చమురు, లేథర్, ఫైబర్, తినుబండారాల తయారీ వంటి పరిశ్రమలు ఉన్నాయి. కానీ, ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా పారిశ్రామిక రంగం కుంటుపడిపోయింది. క్రమేపి తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి షాద్నగర్ ప్రాంతంలో 50 శాతం మేర పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ నేడు సీఎం కేసీఆర్ పాలనలో ఉపాధి వసతులు పరుగులు పెడుతున్నాయి. గతం కంటే నేడు అదనంగా మరో 30వేల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయని కార్మిక సంఘాల నేతలు, కార్మిక శాఖ అధికారులు చెబుతున్నారు.
షాద్నగర్ ప్రాంతం భారీ పరిశ్రమల ఏర్పాటుకు, ఉపాధి మార్గాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతుంది. వలసలను నివారించడమే కాకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలను ఘననీయంగా పెంచాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కారు భారీ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులను ఇస్తూ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నది. గడిచిన ఏడు యేండ్ల కాలంలో పీ అండ్ జీ అనే అంతర్జాతీయ కాస్మోటిక్స్ ఉత్పత్తుల పరిశ్రమ, ఎంఎస్ఎన్ ఫార్మా, అమెజాన్ సంస్థ, జాన్సన్ అండ్ జాన్సన్, ఫోకర్ణ క్వార్జ్ టైయిల్స్ వంటి భారీ పరిశ్రమలు, విజయ పాలిమార్స్, టోటల్ ఆయిల్ వంటి పరిశ్రమలతో పాటు 100కు పైగా అదనంగా షాద్నగర్ ప్రాంతంలో వెలిశాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ ద్వారా కొత్తూరు పారిశ్రామిక వాడతో పాటు ఫరూక్నగర్ మండలం చింతగూడ, బూర్గుల, ఎలికట్ట, మొగిలిగిద్ద, ఫరూక్నగర్, చిల్కమర్రి, రాయికల్, రామేశ్వరం, అన్నారం, నందిగామ మండలం మేకగూడ, సంఘీగూడ, వీర్లపల్లి, అప్పారెడ్డిగూడ, రంగాపూర్, చేగూరు, కొత్తూరు మండల కేంద్రంతో పాటు తిమ్మాపూర్, ఫాతిమాపూర్, ఇన్మూల్నర్వ, సిద్దాపూర్, పెంజర్ల, కొందుర్గు మండల కేంద్రంతో పాటు శ్రీరంగాపూర్, రాంచంద్రపూర్, చౌదరిగూడ మండల కేంద్రంతోత పాటు లాల్పహడ్ గ్రామాల్లో పరిశ్రమలు వెలిశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంలో కంసాన్పల్లి గ్రామంలో మేలుజాతి పశువీర్యోత్పత్తి కేంద్రం అందుబాటులోకి రానున్నది. ఇలా పరిశ్రమలకు నెలవుగా మారండంతో ఈ ప్రాంతం ఉపాధికి కల్పతరువుగా మారింది. వేల మందికి ఉపాధిని చూపుతుంది.
షాద్నగర్ ప్రాంతం పారిశ్రామిక రంగంలో రాష్ట్ర రాజధానికి దీటుగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడి పారిశ్రామిక ప్రాంతంలో వందలకు పైగా చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలున్నాయి. కాస్మోటిక్స్, బ్యాటరీలు, ఫార్మా, ఇస్పత్ ఇనుము, ముడిఇనుము, వంటనూనెలు, చాక్లెట్, బిస్కెట్, టెక్స్టైల్, రసాయనాల ఉత్పత్తి, వ్యవపాయ రంగ పరిశ్రమలు ఈ ప్రాంతంలో వెలిశాయి. స్థానిక కార్మికులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి కార్మికులు స్థానిక పరిశ్రమల్లో విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు, బీహార్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, ఒరిస్సా, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్కాండ్, రాజస్థాన్, వంటి రాష్ర్టాల నుంచి వేలాది మంది కార్మికులు ఈ ప్రాంతంలో ఉపాధి పొందుతున్నారు. అదే విధంగా నేపాల్ దేశానికి చెందిన పలువురు కార్మికులు కూడా స్థానికంగానే ఉంటూ జీవనోపాధి పొందుతున్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సుమారుగా 180కి పైగా పరిశ్రమలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అన్ని పరిశ్రమల్లో సుమారుగా 60 వేల మంది నిత్యం ఉపాధి పొందుతున్నారు. గతంలో 20 నుంచి 25 వేల మంది కార్మికులు విధులు నిర్వహిస్తుండే వారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం అధనంగా 30 వేలకు పైగా కార్మికులు వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు.
మా ప్రాంతంలో యువతకు అంతగా ఉపాధి లేదు. గత నాలుగు యేండ్లుగా షాద్నగర్ ప్రాంతంలోనే ఉపాధి పొందుతున్న. మిషన్ ఆపరేటర్గా పనిచేస్తున్న నాతో పాటు మా రాష్ర్టానికి చెందిన వారు వందల మంది ఈ ప్రాంతంలో పనిచేస్తున్నారు. ఎంతమందికైనా ఇప్పుడు పనిదొరుకుతుంది. పరిశ్రమలు చాలా వచ్చాయి.
– శివలాల్, కార్మికుడు, బీహార్ రాష్ట్రం
జీవనోపాధికోసం బీహార్ రాష్ట్రం నుంచి కొత్తూరుకు వలస వచ్చాను. స్థానికంగా ఉన్న హైదరాబాద్ సిల్క్మిల్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్న నాతో పాటు మా కుటుంబ సభ్యులు సైతం ఇక్కడే స్థిరపడ్డాం. తెలంగాణ వచ్చినంక ఉపాధి మరింత పెరిగింది. ఇతర రాష్ర్టాల నుంచి చాలామంది కార్మికులు ఇక్కడి పని కోసం వస్తున్నారు. ఇక్కడ ఉపాధికి డోక లేదు.
– నవల్కిషోర్ సింగ్, బీహార్ రాష్ట్రం
షాద్నగర్ ప్రాంతంలో మరిన్ని ఉపాధి వనరులను సృష్టించేందుకు కృషిచేయంతో పాటు కార్మికుల సంక్షేమానికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న పరిశ్రమలతో పాటు వేలాది మందికి ఉపాధిని కల్పించే పరిశ్రమలు మన ప్రాంతంలో ఇంకా వెలుస్తాయి. ఎట్టిపరిస్థితిలో కాలుష్య పరిశ్రమలు మన ప్రాంతానికి వచ్చే అవకాశం లేదు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్వయంగా పరిశ్రమలను సందర్శించి ప్రారంభించారు. రానున్న రోజుల్లో మరింత ఉపాధి పెరుగనున్నది. ప్రతి ఒక్కరికీ మన ప్రాంతంలో పనిదొరుకుతుంది. త్వరలో ఉపాధి కల్పన శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– వై. అంజయ్యయాదవ్, ఎమ్మెల్యే, షాద్నగర్