సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : శీతాకాలంలోనే విద్యుత్ మరమ్మతుల పేరిట అధికారికంగా రోజూ 2 గంటలు విధిస్తున్న కరెంటు కోతలపై నగర వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వేసవిలో నిరంతరం నాణ్యమైన కరెంటు సరఫరా కోసం అంటూ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ అలీ ఫరూఖీ విడుదల చేసిన మరమ్మతుల ప్రణాళికపై మండిపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో విద్యుత్ మరమ్మతులు చేపట్టినా ఇలాంటి పరిస్థితి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరెంటు కోతలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
రెండు రోజుల కిత్రం జనవరి 17నుంచి ఫిబ్రవరి 10 వరకు గ్రేటర్లోని 9 సర్కిళ్ల పరిధిలో 2 గంటలు కరెంటు కోతలు ఉంటాయనడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశం అయింది. బుధవారం కరెంటు కోతలపై సోషల్ మీడియాలో పలువురు వినియోగదారులు పోస్టు చేస్తూ సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారప్ అలీ ఫరూఖీకి ట్యాగ్ చేస్తూ పోస్టులు చేస్తూనే ఉన్నారు. మరమ్మతుల షెడ్యూలు ప్రకటించిన ప్రాంతాలే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ విద్యుత్ సరఫరా అంతరాయం ఉన్నట్లు వినియోగదారులు పేర్కొంటున్నారు.
గురువారం మొత్తం 125 ఫీడర్ల పరిధిలో మరమ్మతులు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇందులో బంజారాహిల్స్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్, సికింద్రాబాద్, మేడ్చల్, హబ్సీగూడ, సైబర్ సిటీ, రాజేంద్రనగర్, సరూర్నగర్ సర్కిళ్లలో 11 కేవీ ఫీడర్లు మొత్తం 2352 ఉన్నాయి. అందులో 125 ఫీడర్ల పరిధిలోనే విద్యుత్ లైన్ల మరమ్మతుల వల్ల కనిష్ఠంగా 30 నిమిషాల నుంచి గరిష్ఠంగా 2 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తామని అధికారులు తెలిపారు.