పెద్దఅంబర్పేట, జూలై 12 : ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్తు తీగలు తెగిపడ్డాయా..? భారీ వానలకు విద్యుత్తు స్తంభాలు వంగి ప్రమాదకరంగా మారాయా? కరెంటు తీగలు చేతికందే ఎత్తులో ప్రమాదం జరిగేలా కిందకు వేలాడుతున్నా.. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడంలేదా? అయితే ఇది మీ కోసమే. విద్యుత్తు సమస్యలు ఏవైనా సరే ఒక్క కాల్ చేస్తే పరిష్కరిస్తామని విద్యుత్ శాఖ అధికారులు భరోసా ఇస్తున్నారు. ఎలక్ట్రికల్ కంట్రోల్ రూం (ఈసీఆర్) 1912 నంబర్కు ఫోన్ చేసి సమస్య చెప్పాలని సూచిస్తున్నారు. ఆ వెంటనే కంట్రోల్ రూం నుంచి క్షేత్రస్థాయిలోని అధికారులకు ఆ సమస్యను చేరవేస్తారని.. సమస్య పరిష్కారమయ్యే వరకు దాన్ని అనుసరిస్తారని పేర్కొంటున్నారు.
ఒక్కసారి ఈసీఆర్కు ఫోన్ చేసి సమస్య చెప్తే చాలు. అక్కడినుంచి ఫిర్యాదుదారు చేసిన సమస్యతోపాటు అతడి ఫోన్ నంబర్ను క్షేత్రస్థాయిలోని ఏఈకి తెలియజేస్తారు. ఏఈ సంబంధిత ఫిర్యాదుదారు ఫోన్ నంబర్కు కాల్ చేసి వివరాలు సేకరిస్తారు. ఆపై సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతారు. తర్వాత పరిష్కారానికి సంబంధించిన వివరణను సైతం ఉన్నతాధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఉన్నతస్థాయి నుంచి పర్యవేక్షణ ఉండటంతో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చెట్ల కొమ్మలు విరిగిపడి తీగలు తెగిపోయినప్పుడు, స్తంభాలు కూలేదశకు చేరి ప్రమాదకరంగా మారినప్పుడు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద మంటలు ఎగసిపడుతున్నప్పుడు వెంటనే సమాచారమివ్వాలని అధికారులు సూచిస్తున్నారు. కరెంటుకు సంబంధించి ప్రజలకు ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా తెలియజేయాలని కోరుతున్నారు. వెంటనే స్పందించడంతో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
సమస్యలపై కింది నంబర్లకు ఫోన్ చేయండి
* ఎలక్ట్రికల్ కంట్రోల్ రూం (ఈసీఆర్): 1912
* విద్యుత్ శాఖ కంట్రోల్ రూం నంబర్లు: 73820 72104, 73820 72106, 73820 71574
* ఎఫ్వోసీ ఆటోనగర్: 94931 93148
* ఎఫ్వోసీ హయత్నగర్ : 94901 53577
* ఎఫ్వోసీ శాంతినగర్: 94901 53588
కరెంటు ప్రమాదాలతో పైలం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వేళ కరెంటు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఏమరపాటు పనికిరాదని చెప్తున్నారు. కరెంటుతో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటున్నారు.
* వర్షాలు కురుస్తున్నప్పుడు ఇనుప స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలోకి వెళ్లకూడదు.
* విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు విరిగిపడితే వాటిని తొలగించే సాహసం చేయొద్దు.
* ఉరుములు, మెరుపుల సమయంలో ట్రాన్స్ఫార్మర్ల వద్ద కొన్నిసార్లు పేలుళ్లు జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు వాటి సమీపంలోకి కూడా వెళ్లొద్దు.
* తడిసిన చేతులు, వస్ర్తాలతో కరెంటు సరఫరా మీటర్లు, స్విచ్ల వద్ద మరమ్మతులు చేయడంకానీ, వాటిని ముట్టుకోవడంగానీ చేయొద్దు.
* ఇండ్లకు అతి సమీపం నుంచి వెళ్లే కరెంటు తీగలతో జాగ్రత్తగా ఉండాలి. వర్షాలు పడినప్పుడు వాటి దరిదాపుల్లోకి కూడా చూడొద్దు.
* కరెంటు వైర్లు తెగినప్పుడు వాటిని సరిచేసే ధైర్యం చేయొద్దు.
* ఇండ్లలో వాటర్ హీటర్ల వద్ద జాగ్రత్తగా ఉండాలి. చుట్టూ తడిగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* ప్రధానంగా ఇండ్లలో పిల్లలకు అందే ఎత్తులో స్విచ్బోర్డులు లేకుండా చూసుకోవాలి.
* ఇక రైతులు పొలాల వద్ద మీటర్లు సరిచేసే సమయంలో, విద్యుత్తు తీగలతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.
ఫిర్యాదు చేస్తే పరిష్కరిస్తాం
కరెంటుకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించేలా చర్యలు తీసుకుంటున్నాం. సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయంపై ఏఈలతో చర్చిస్తున్నాం. ప్రజలు కూడా మాకు సహకరించాలి. ఎక్కడ సమస్య తలెత్తినా మాకు సమాచారం ఇవ్వండి. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా నిరంతర సరఫరా కోసం అన్ని చర్యలు చేపడుతున్నాం.
– బండబావి యుగేందర్, అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీర్ ఆపరేషన్, హయత్నగర్