ఇబ్రహీంపట్నం, మే 17 : ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్చైర్మన్ ఎన్నికకు ము హూర్తం ఖరారైంది. ఈ నెల 24వ తేదీన ఆ పదవిని భర్తీ చేసేందుకు చర్యలు తీసు కోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల అధికారిగా ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈనెల 24న ఉదయం 11గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఉంటుందని కౌన్సిల ర్లకు మున్సిపల్ కమిషనర్ శుక్రవారం నోటీసులు జారీ చేశారు. గతంలో మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న కప్పరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టించడంలో వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి ప్రధాన కారకుడని భావించిన ఆమె(కప్పరి స్రవంతి) కాంగ్రెస్లో చేరి మెజార్టీ కౌన్సిలర్ల మద్దతుతో యాదగిరిపై అవిశ్వాస తీర్మానాన్ని ఏప్రిల్ 4న పెట్టారు. అయితే ఆ మీటింగ్కు రెండురోజుల ముందే ఆయన తన పదవికి రాజీనామా చేశా రు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైస్చైర్మన్ ఎన్నికకు ముహూర్తం లభించలేదు. కాగా ఆ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఖాళీగా ఉన్న వైస్చైర్మన్ పదవిని భర్తీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు.
బరిలో బర్ల మంగ..
ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్చైర్మన్ ఎన్నికకు కలెక్టర్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 24న ఎన్నిక జరుగనున్నది. అయితే ఆ పదవిని చేజిక్కించుకునేందుకు 22వ వార్డు కౌన్సిలర్గా ఉన్న బర్ల మంగ పోటీ పడుతున్నారు. వైస్చైర్మన్పై అవిశ్వాసం పెట్టిన సమయంలో క్యాంపు ఖర్చులు మొత్తం ఆమెనే భరించినట్లు సమాచారం. దీంతో బర్ల మంగను వైస్చైర్మన్గా ఎన్నుకునేందుకు చైర్మన్తోసహా మెజార్టీ కౌన్సిలర్లు మద్దతు ఇస్తున్నారు. ఆమె ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బర్ల మంగ బీఆర్ఎస్లో కీలక నేత. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్లో చేరారు.