వికారాబాద్, ఆగస్టు 22, (నమస్తే తెలంగాణ): రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసేందుకు కొత్త ఓటర్ల నమోదుతోపాటు ఓటరు కార్డులో మార్పులు, చేర్పుల కోసం సెప్టెంబర్ 19 వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 18 ఏండ్లు నిండిన వారు ఆన్లైన్లోగాని, మీసేవ ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే ఓటరు ముసాయిదాను విడుదల చేసిన ఎన్నికల సంఘం.. ఈ నెల 26, 27 తేదీలతోపాటు సెప్టెంబర్ 2, 3 తేదీల్లో పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. ఓటరు తుది జాబితాను అక్టోబర్ 4న ఎన్నికల సంఘం విడుదల చేయనున్నది. ఓటరు ముసాయిదా ప్రకారం వికారాబాద్ జిల్లాలో 8,99,395 మంది ఓటర్లు ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 31,98,229 మంది ఓటర్లు ఉన్నారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసేందుకుగాను కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆఖరు ఛాన్స్ కల్పించింది. కొత్త ఓటర్లుగా నమోదుకు సెప్టెంబర్ 19 వరకు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం చివరి అవకాశమిచ్చింది. 18 ఏండ్లు నిండిన వారు ఆన్లైన్లోగాని, మీసేవా ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ceotelangana.in వెబ్సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా పేరు, అడ్రస్ తదితర తప్పులేమైనా ఉంటే ఆన్లైన్తోపాటు సంబంధిత పోలింగ్ కేంద్రానికి వెళ్లి తప్పులను సరిచేయించుకోవచ్చు. ఇంకా ఓటరుగా నమోదు చేసుకోని యువతీ, యువకులను ఓటరుగా నమోదు చేయించేందుకు ఈ నెల 26, 27 తేదీలతోపాటు సెప్టెంబర్ 2, 3 తేదీల్లో పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించి కొత్త ఓటర్ల నమోదుతోపాటు ఓటరు కార్డులో మార్పులు, చేర్పుల దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఓటరు ముసాయిదాపై వచ్చే నెల 19 వరకు అభ్యంతరాలను ఎన్నికల సిబ్బంది స్వీకరించనున్నారు. మరోవైపు అక్టోబర్ 4న ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనున్నది.
జిల్లాలో 8,99,395 మంది ఓటర్లు..
ఓటరు ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఓటరు ముసాయిదా ప్రకారం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 8,99,395 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు-4,49,871 మంది ఓటర్లు, మహిళలు-4,48,970 మంది ఓటర్లు, ఇతరులు-36 మంది, సర్వీసు ఓటరు-518 మంది ఓటర్లున్నారు. జిల్లాలో అత్యధికంగా పరిగి నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,40,086 మంది ఓటర్లుండగా, పురుషులు-1,22,282 మంది ఓటర్లు, మహిళలు-1,17,567 మంది ఓటర్లు, ఇతరులు-8 మంది, సర్వీసు ఓటర్లు-229 మంది ఓటర్లున్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,17,551 మంది ఉండగా, పురుషులు-1,09,714 ఓటర్లు, మహిళలు-1,07,757 మంది, ఇతరులు-నలుగురు, సర్వీసు ఓటర్లు-76 మంది ఓటర్లున్నారు. తాండూరు నియోజకవర్గంలో మొత్తం 2,22,177 మంది ఓటర్లుండగా వీరిలో పురుషులు-1,08,712 మంది, మహిళలు-1,13,407 మంది, ఇతరులు-9 మంది, సర్వీసు ఓటర్లు-49 మంది ఓటర్లున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం 2,19,581 మంది ఓటర్లుండగా వీరిలో పురుషులు-1,09,163 మంది, మహిళలు-1,10,239 మంది, ఇతరులు-15 మంది, సర్వీసు ఓటర్లు-164 మంది ఉన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోండి
జిల్లాలో 18 ఏండ్లు నిండి ఓటరుగా నమోదు చేసుకోని అర్హులైన వారంతా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఈనెల 26, 27, వచ్చేనెల 2, 3 తేదీల్లో జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించే ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొని కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, మార్పులు, చేర్పులు కూడా చేసుకోవచ్చు. కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఇదే చివరి అవకాశం.
– సి.నారాయణరెడ్డి, కలెక్టర్