పోలింగ్ కేంద్రాలకు రాలేని పరిస్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నారు. ఇది పోలింగ్ శాతంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటును కల్పించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏండ్ల వారికి అవకాశం కల్పించిన ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల్లోనూ వయో పరిమితిని 85 ఏండ్లకు పెంచింది. 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులు సైతం ఇంటి నుంచే ఓటు వేయవచ్చు. పోస్టల్ బ్యాలెట్ తరహాలోనే హోం ఓటింగ్కు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలి. బీఎల్వోల ద్వారా ఈ ప్రక్రియ జిల్లాలో ఇప్పటికే మొదలవ్వగా.. ఏప్రిల్ 22 నాటికి దరఖాస్తులు అందజేసిన వారికే అధికారులు ఓటు హక్కును కల్పించనున్నారు.
రంగారెడ్డి, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : ప్రతి ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపడుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో పోలింగ్ నమోదు కావడం లేదు. ఇందుకు చాలా మంది వృద్ధులు, దివ్యాంగులు ఓటింగ్కు దూరంగా ఉండడం ఓ కారణం. వీరికి పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు వీల్ చైర్తోపాటు ఇతర సదుపాయాలను కల్పిస్తున్నప్పటికీ వృద్ధులు, దివ్యాంగులను పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకురావడం పెద్ద సమస్యగా మారుతున్నది. వీరిని మోసుకుంటూ కేంద్రాలకు తీసుకురాలేక కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో చాలామంది ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఎన్నికల సంఘం హోం ఓటింగ్కు అవకాశం కల్పించింది. ఈ మేరకు అధికారులు ఓటరు జాబితాను అనుసరించి జిల్లాలో 85 ఏండ్లకు పైబడిన వారిని, దివ్యాంగులను గుర్తించారు. అధికారులు గుర్తించిన ప్రకారం.. జిల్లాలో 85-150 ఏండ్ల మధ్య వయస్కులు మొత్తం 19,350 మంది ఉన్నట్లు తేలింది. ఇందులో పురుషులు 8,729 మంది ఉండగా.. స్త్రీలు 10,619 మంది, థర్డ్ జెండర్స్ ఇద్దరు ఉన్నారు. అలాగే.. 40 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులు జిల్లావ్యాప్తంగా 45,567 మంది ఉన్నట్లు గుర్తించారు. ఇందులో పురుషులు 24,861మంది, స్త్రీలు 20,701మంది, థర్డ్ జెండర్స్ ఐదుగురు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈసీ కల్పించిన ఈ అవకాశంతో వృద్ధులు, దివ్యాంగులకు ఉపశమనం కలుగుతున్నది.
వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన ప్రక్రియ జిల్లాలో మొదలైంది. ఈసీ మార్గదర్శకాల ప్రకారం బీఎల్వోలు వారిచేత దరఖాస్తు చేయిస్తున్నారు. ఫారం-12డీ ఫారాలను అర్హులైన వారికి అందజేస్తున్నారు. పూర్తించిన దరఖాస్తులను ఏప్రిల్ 22 నాటికి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి(ఈఆర్వో)కి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారికే ఇంటి నుంచి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించనున్నారు.
ఏ రోజు ఓటు వేయాలో ముందుగానే నిర్ణయించిన తేదీన వృద్ధులు, దివ్యాంగుల ఇండ్ల వద్దకు వెళ్లి ఓటింగ్ ప్రక్రియను చేపడుతారు. బ్యాలెట్ పేపర్పై రహస్యంగా ఓటు వేసేలా ఏర్పాట్లు చేసి ఆ ఓటును సీల్ చేసిన తర్వాత స్థానిక తహసీల్దార్ కార్యాలయం ద్వారా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి పంపిస్తారు. ఈ ప్రక్రియ అంతా వీడియో తీస్తారు. కలెక్టర్ శశాంక ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి హోం ఓటింగ్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది.