కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, కాలువలు ఉధృతంగా ప్రహిస్తున్నాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ తరుణంలో ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా పలు విభాగాల కిందిస్థాయి సిబ్బంది నుంచి కలెక్టర్ల వరకు అధికారులందరూ 24 గంటలూ విధుల్లో ఉంటూ సహాయక చర్యలు చేపడుతున్నారు. జలాశయాలు, చెరువులు, కుంటల వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లల్లోని నివాసితులు, ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగులు దాటకుండా బారి కేడ్లు, ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు.
వికారాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం రోజంతా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని పెద్ద ప్రాజెక్టులైన కోట్పల్లి, లఖ్నాపూర్, సర్పన్పల్లి ప్రాజెక్టులతోపాటు 864 చెరువులు నిండి అలుగు లు పారుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు, చెరువుల నుంచి వచ్చే వరద నీరు రోడ్లపై నుంచి పారుతుండటంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
అధికార యంత్రాంగం అప్రమత్తం
జిల్లాలో శుక్రవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యా రు. వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీ చర్య లు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్ని శాఖల అధికారులను ఆదేశిం చారు. దీంతో అప్రమత్తమైన అధికారులు జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, వాగుల వద్ద రెవెన్యూ, పోలీసు అధికారులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కోట్పల్లి, లఖ్నాపూర్, జుంటుపల్లి తదితర ప్రాజెక్టులు, చెరువుల అలుగులు, వాగులు, ప్రవాహాల వద్దకు పర్యాటకులను అనుమతించడం లేదు. ధారూ రు మండలంలోని కోట్పల్లి ప్రాజెక్టు నిండి అలుగు పారుతుండడంతో అలు గు నీటి ప్రవాహంతో ధారూరు-నాగసముందర్ మధ్య రోడ్డుపై, ధారూరు-దోర్నాల మధ్య రోడ్డుపై, నాగారం-మైలారం మధ్య రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. బొంరాస్పేట మం డలంలోని మహాంతిపూర్ గ్రామానికి సమీపంలో కాకరవాణి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామానికి మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. శిథిలావస్థకు చేరిన ఇండ్లను గుర్తించి వాటిలో నివాసం ఉం టున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బడులు, ఇతర చోట్ల వారికి తాత్కాలికంగా బసను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
కంట్రోల్ రూం ఏర్పాటు
భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఏ ప్రాంతంలోనైనా ప్రజలకు ఇబ్బంది ఏర్పడినా, సహాయం అవసరమైనా కంట్రోల్ రూం నంబరు 7995061192కు ఫోన్ చేసి సంప్రదించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజ లు అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురువారం హైదరాబాద్ మల్టీజోన్-2 ఐజీ షానవాజ్ఖాసీం, ఎస్పీ కోటిరెడ్డి ధారూరు మండలంలోని నాగసముందర్ వాగును పరిశీలించారు. అదేవిధంగా వికారాబాద్ మండలంలోని గొట్టిముక్కల చెరువుతోపాటు రాజీవ్గృహకల్ప కాలనీలో వరద నీటిని కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. గొట్టిముక్కల(గోధుమగూడ)గ్రామంలో ఇల్లు కూలిన బాధితురాలిని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ పరామర్శించారు.
జిల్లాలో వరదలు ముంచెత్తుతున్నాయి. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుం డా ప్రభుత్వం అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులతో సమీక్షలు నిర్వహించి వరద ఉధృతి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఎంపీ రంజిత్రెడ్డి ఢిల్లీ నుంచే ఇక్కడి పరిస్థితులపై వాకబు చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సైతం అధికారులతో సమీక్షిస్తున్నారు. అధికారులూ వరద ప్రాంతాల్లో పర్యటించి వరద ఉధృతిని పరిశీలిస్తున్నారు. గురువారం శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డితోపాటు పలువురు ఏసీపీలు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకుని కిందిస్థాయి సిబ్బందికి సూచనలు, సలహాలిచ్చారు. అత్యవసర సమయాల్లో సహాయక చర్య లు చేపట్టేందుకు మేమున్నామంటూ ప్రజలకు భరోసా కల్పించారు. మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అధికారులు అలర్ట్గా ఉన్నారు.
మేమున్నామని..
ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు అధికారులు వర్షాలను ఎదుర్కొనేందుకు 24 గంటలపాటు కృషి చేస్తున్నారు. అధికారులంతా హెడ్ క్వార్టర్స్ను విడిచి వెళ్లొద్దని ఇప్పటికే కలెక్టర్ హరీశ్ ఆదేశా లు జారీ చేయడంతో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులంతా అప్రమత్తంగా ఉన్నారు. ఆర్డీవో, తహసీల్దార్, ఎంపీడీవో, మున్సిపల్ కమిషన ర్లు, పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఫరూఖ్నగర్ మం డలంలోని అయ్యవారిపల్లి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు ను గురువారం శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ రంగస్వామితో కలిసి పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల ని, అత్యవసర సేవలు అవసరమైతే సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా డీసీపీ స్థానికులకు సూచించారు. పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ, కళానగర్ పరిధిలోని ముంపు ప్రాంతాల్లో ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ము న్సిపల్ ఉద్యోగులకు సెలవులను రద్దు చేయడంతో వారు క్షేత్రస్థాయిలోనే ఉండి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ఏకధాటిగా…
జిల్లాలో పది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించింది. చెరువులు, కుంటలు జలకళ ను సంతరించుకున్నాయి. మూసీ, ఈసీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడం తో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. కేశంపేట మండలంలోని పాటిగడ్డ వా గును దాటకుండా పోలీసులు అడ్డుగా ముళ్లకంచెను ఉంచారు. అయ్యవారిపల్లి వాగు వద్ద కూడా అడ్డుగా బారికేడ్లకు ఏర్పాటు చేశారు. చేవెళ్ల మండలంలోని తంగడిపల్లికి చెందిన ఎరుకలి అంజమ్మకు చెందిన ఇల్లు పాక్షికంగా కూలిపోయింది. కేశంపేట మండలంలోని కొత్తకోట గ్రామానికి చెందిన భిక్షపతికి చెందిన పాడి గేదె విద్యుదాఘాతంతో మృతి చెందింది.