అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి కంటివెలుగు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సూచించారు. వికారాబాద్ కలెక్టరేట్లో రెండో విడుత ‘కంటివెలుగు’పై ఆదివారం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రతిరోజూ 300 మందికి.. మున్సిపల్ పరిధిలో 400 మందికి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 42 వైద్య బృందాలతో 566 గ్రామాలు, 97 మున్సిపల్ వార్డుల్లో 100 రోజులపాటు కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
వికారాబాద్, జనవరి 8 : ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమంపై జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్రెడ్డి, సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు మహేశ్రెడ్డి, నరేందర్రెడ్డి, యాదయ్య, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లాలో ఈ నెల 18 నుంచి 100 రోజుల పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు.
వృద్ధులు, పేద, మధ్య తరగతి ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి మందులు, కంటి అద్దాలను అందజేయడం, అవసరాన్ని బట్టి శస్త్రచికిత్సలు చేపడుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ, డీఆర్డీవో, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, ఐకేపీ సంఘాలు పని చేయాలని మంత్రి కోరారు. గ్రామాల్లో నిర్వహించే శిబిరాలపై సర్పంచ్లు ప్రత్యేక దృష్టి సారించి తాగునీరు, మరుగుదొడ్లు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించి సహకారం అందించాలని కోరారు. గ్రామపంచాయతీ కార్యాలయాలు, చౌకధర దుకాణాల వద్ద కంటి వెలుగు శిబిరాలు నిర్వహించే సమాచారాన్ని ముందస్తుగా తెలిసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రజల్లో ఎటువంటి అపోహలు లేకుండా ప్రజాప్రతినిధులు నివృత్తి చేస్తూ కంటి పరీక్షలకు ప్రోత్సహించాలని సూచించారు.
మున్సిపల్ పరిధిలో నిర్వహించే కంటి వెలుగు శిబిరాల నిర్వహణపై ఈ నెల 12లోపు మండలస్థాయి, గ్రామపంచాయతీ, మున్సిపల్ పరిధుల్లో సమన్వయ సమావేశాలను ఏర్పాటు చేసుకొని ఆ కార్యక్రమాలను రూపొందించుకోవాలని వివరించారు. మున్సిపల్ పరిధిలో రోజుకు 400, గ్రామాల్లో 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాకు ఇప్పటికే 40 వేల కంటి అద్దాలు వచ్చాయని తెలిపారు. జిల్లాలో 42 వైద్య బృందాలతో 566 గ్రామాలు, 97 మున్సిపల్ వార్డుల్లో 100 రోజుల పాటు పని దినాల్లో కంటి వెలుగు శిబిరాలను నిర్వహించి విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులను కోరారు. కార్యక్రమంలో ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా వైద్యాధికారి పాల్వన్కుమార్, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్కుమార్, డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీడీవోలు, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
భాషా పండితులకు సంబంధించిన పోస్టులు వారికే కేటాయించడం జరుగుతుందని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ల పరిషత్ నాయకులు కలిసి ఆమెకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో సీఎం కేసీఆర్ ప్రపంచ తెలుగు మహా సభల్లో ఇచ్చిన హామీ మేరకు కట్టుబడి ఉంటారన్నారు. ఈ సందర్భంగా సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ఇజాజ్, రఘునాథ్ పాల్గొన్నారు.
శంకర్పల్లి : ప్రతిఒకరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని మంత్రి సబితారెడ్డి అన్నారు. ఆదివారం శంకరపల్లి మండలం మహాలింగాపురం గ్రామంలో పోచమ్మ జాతర, జనవాడ గ్రామంలో అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమాల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దైవ చింతనతోనే మనసుకు ప్రశాంతత లభిస్తుందన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, జన్వాడ సర్పంచ్ లలిత, మహాలింగాపురం సర్పంచ్ మాణిక్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్, మాణిక్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రాఘవేందర్రెడ్డి పాల్గొన్నారు.