వికారాబాద్, డిసెంబర్ 8 : మన ఊరు మన బడి పనులను వేగంగా పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం మన ఊరు మన బడి కార్యక్రమం పనుల పురోగతిపై మంత్రి సబితారెడ్డి, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకటి కరుణ, పాఠశాల విద్య సంచాలకులు శ్రీదేవసేనలతో కలిసి జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొదటి దశలో చేపట్టిన 9,123 పాఠశాలల్లో రూ.30 లక్షల కంటే అధిక వ్యయం ఉన్న పాఠశాలలో కేవలం 15శాతం మాత్రమే గ్రౌండ్ అయ్యాయన్నారు.
స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ నామినేషన్ పద్ధతిలో పాఠశాలల పనులు చేపట్టాలని మంత్రి సూచించారు. ప్రతి మండలంలో 2 మోడల్ పాఠశాలలను ఎంపిక చేసుకున్నామని.. డిసెంబర్ నెలాఖరు వరకు పాఠశాలలను ప్రారంభించేందుకు సన్నద్ధం చేయాలని కలెక్టర్లకు సూచించారు. మోడల్ పాఠశాలలకు 10 శాతం గ్రీన్ బడ్జెట్ వినియోగిస్తూ పచ్చదనం పెంపొందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. చేపట్టిన పనులకు ఎఫ్టీవోలు జనరెట్ చేసిన వెంటనే నిధుల విడుదల జరుగుతుందన్నారు. గడిచిన వారం రోజుల్లో 100 కోట్ల నిధులు విడుదల చేశామని.. సెంట్రల్ పూలింగ్ విధానం ద్వారా ఇకపై చెల్లింపులు జరుగుతాయని సూచించారు. పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.130కోట్లు విడుదల చేసిందని, వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల పెయింటింగ్ అంశంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నిబంధనల ప్రకారం పకడ్బందీగా పెయింటింగ్ జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉండాలన్నారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కోరారు.
సమావేశం అనంతరం విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ.. తొలిమెట్టు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు అలసత్వం వహించకుండా పిల్లలకు మంచి విద్యను అందించాలన్నారు. చదువులో వెనుకబడి ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి రాయడంతోపాటు వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, జిల్లా విద్యాధికారి రేణుకాదేవి, విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గడువులోగా పనులు పూర్తి చేస్తాం : జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్
రంగారెడ్డి, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : నిర్ణీత గడువులోగా ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం కింద చేపడుతున్న పనులను పూర్తి చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా ప్రతీక్జైన్ మాట్లాడుతూ.. మొదటి విడుతలో భాగంగా జిల్లాకు మంజూరైన 464 పాఠశాలల్లో గడువులోపు పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రతి మండలానికి రెండు చొప్పున 27 మండలాల్లో 54 మోడల్ స్కూల్స్ ఉన్నాయని.. వాటిలో 18 పాఠశాలల్లో అన్ని రకాల పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగతా పాఠశాలల్లో డిసెంబర్ చివరి నాటికి పెయింటింగ్ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. కాన్ఫరెన్స్లో జిల్లా విద్యా శాఖ అధికారి సుశీందర్రావు, ఈఈ పీఆర్ సురేశ్ చంద్రారెడ్డి, డీఈలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.