తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదేండ్ల ప్రగతిని నలుదిశలా చాటేలా ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. అమరుల త్యాగాలను స్మరిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నేటి నుంచి 21 రోజులపాటు రోజుకో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వేడుకలకు ప్రభుత్వ కార్యాలయాలు, ఆలయాలు, చర్చిలు, దర్గాలను ముస్తాబు చేశారు. వ్యవసాయం, విద్యుత్తు, తాగు, సాగునీరు, పల్లె, పట్టణాల అభివృద్ధి, విద్య, వైద్యం ఇలా ప్రతిరంగం విజయాలు తెలిపేలా ఉత్సవాలు ఉండనున్నాయి. అందుకోసం గ్రామ పంచాయతీలు మొదలుకొని జిల్లాస్థాయి వరకు కేటాయించిన నిధులు, అమలవుతున్న సంక్షేమ పథకాలు, ప్రయోజనం పొందిన లబ్ధిదారుల వివరాలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయనున్నారు. నేడు జెండావిష్కరణతో వేడుకలు ఆరంభం అవుతుండగా.. 22వ తేదీన అమరుల సంస్మరణతో ముగియనున్నాయి. రంగారెడ్డి కలెక్టరేట్లో జరిగే కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి హాజరై ఉత్సవాలను ప్రారంభించనుండగా, వికారాబాద్ కలెక్టరేట్లో జరిగే జెండావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్శర్మ హాజరుకానున్నారు. అలాగే ఆయా నియోజకవర్గాల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొననున్నారు.
-షాబాద్, జూన్ 1
వికారాబాద్, జూన్ 1, (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 9 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అదిరిపోయేలా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుంచి ఈనెల 22 వరకు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ వేడుకల్లో భాగంగా కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయంతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ముస్తాబు చేశారు. నేడు కలెక్టరేట్ ప్రాంగణంలో పతాక వందనంతో ప్రారంభమయ్యే దశాబ్ది ఉత్సవాలు, ఈనెల 22న అమరవీరుల సంస్మరణ దినోత్సవంతో ముగియనున్నాయి. నేడు కలెక్టరేట్లో ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్శర్మ పాల్గొననున్నారు. ఉత్సవాల్లో ప్రధానంగా ప్రభుత్వం 9 ఏండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. గ్రామ పంచాయతీలు మొదలుకొని జిల్లాస్థాయి వరకు జిల్లాకు కేటాయించిన నిధులు, ఆయా సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధిదారుల వివరాలతో కూడిన ఆయా శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీల నుంచి జిల్లా కేంద్రం ప్రజలకు వివరించేలా ప్రదర్శనలకు అంతా సిద్ధం చేశారు.
ఈనెల 22 వరకు సంబురాలు..
నేడు జాతీయ పతాక ఆవిష్కరణతోపాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అమరులైన వారిని స్మరించుకోనున్నారు. రైతు దినోత్సవంలో భాగంగా జిల్లాలోని 97 రైతు వేదికల్లో వెయ్యి మంది రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, సంక్షేమ పథకాలకు సంబంధించి రైతులకు తెలియజేయనున్నారు. గ్రామాల నుంచి ఎడ్ల బండ్లతో ఊరేగింపుగా రైతు వేదికల వద్దకు ర్యాలీగా చేరుకోనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని ఏదో ఒక రైతు వేదిక వద్ద రైతులతో కలిసి ఎమ్మెల్యేలు సహపంక్తి భోజనాలు చేయనున్నారు. సురక్షా దినోత్సవంలో భాగంగా పోలీస్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంస్కరణలకు సంబంధించి కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేయనున్నారు. జిల్లా కేంద్రంతోపాటు ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్, ఫైర్ వాహనాలతో ర్యాలీ చేపట్టి సభ నిర్వహించనున్నారు. గతంలో కరెంట్ కోతలు-నేడు వెలుగుల జిలుగులకు సంబంధించి, వ్యవసాయం, పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సంబంధించి ప్రజలకు తెలియజేయనున్నారు. పారిశ్రామికాభివృద్ధిలో సాధించిన ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయనున్నారు.
టీఎస్ఐఐసీ ద్వారా వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనున్నారు. మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పునరుద్ధరణ పనులపై వివరించనున్నారు. పాలన సంస్కరణలో భాగంగా జిల్లా ఏర్పాటు, కొత్త మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటుతో ప్రజలకు కలిగిన మేలును ప్రజల్లో ప్రస్తావించనున్నారు. అదేవిధంగా మహిళా సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు, ప్రయోజనం పొందిన లబ్ధిదారులతో సమావేశాలు, వైద్యారోగ్య శాఖలో వచ్చిన మార్పును ప్రభుత్వ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, పల్లె, బస్తీ దవాఖానలు, కంటి వెలుగు, న్యూట్రీషన్ కిట్స్ తదితర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. పల్లెప్రగతి కార్యక్రమం, పల్లెప్రగతి కింద ఆయా గ్రామాలకు విడుదలైన నిధులపై ప్రజలకు తెలిసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో నాటిన మొక్కలు, విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి అమలు చేస్తున్న మన ఊరు-మన బడితోపాటు గురుకులాలు, పాలిటెక్నిక్, ఐటీఐ తదితర ప్రభుత్వ విద్యాసంస్థలకు సంబంధించిన వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహం ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించనున్నారు.
9 ఏండ్లలో ప్రగతి…
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో తొమ్మిదేండ్లలో వికారాబాద్ జిల్లాలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరిగింది. జిల్లా ఏర్పాటు చేయాలనే వికారాబాద్ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సీఎం కేసీఆర్, పూర్తిగా గ్రామీణ ప్రాంతంతో కూడిన వెనుకబడిన జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకుగాను వివిధ అభివృద్ధి పనులకుగాను ప్రభుత్వం రూ.5వేల కోట్ల వరకు నిధులను విడుదల చేసింది. ప్రధానంగా జిల్లాలోని మోమిన్పేట్ మండలంలో ఏర్పాటు చేస్తున్న ఎలక్ట్రానిక్ వాహనాల విడిభాగాల తయారీ యూనిట్ అయిన మొబిలిటీ వ్యాలీ జిల్లాకు మణిహారంగా మారనున్నది.
రూ.50 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా మొబిలిటీ వ్యాలీని ప్రభుత్వం టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తుంది. మరోవైపు పేద ప్రజలకు సత్వర వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో జిల్లాకు ప్రభుత్వ వైద్య కాలేజీని మంజూరు చేయడంతోపాటు ఆయుష్ దవాఖాన, క్యాన్సర్ బాధితులకు చికిత్స అందించేందుకుగాను పాలియేటివ్ కేర్ కేంద్రాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. నర్సింగ్ కాలేజీతోపాటు మాతాశిశు సంరక్షణ దవాఖానతో పాటు మున్సిపాలిటీల్లో బస్తీ దవాఖానలు, గ్రామ పంచాయతీల్లో పల్లె దవాఖానలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. జిల్లాలోని రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరయ్యాయి. తాండూర్లో కాలుష్యాన్ని తగ్గించేందుకుగాను బైపాస్ రోడ్డును మంజూరు చేయడంతోపాటు మెజార్టీ గ్రామ పంచాయతీలకు రోడ్లులేని పరిస్థితి నుంచి ప్రతీ గ్రామానికి రోడ్లను నిర్మించడంతోపాటు గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి లింక్ రోడ్ల ఏర్పాటు వరకు జిల్లాలో అభివృద్ధి వేగవంతమైంది. అదేవిధంగా జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కూడా వేగంగా జరుగుతుంది. మరోవైపు జిల్లాలోని జిన్గుర్తి, అర్కతలలో ఫుడ్ ఇండస్ట్రీయల్ పార్కులను ప్రభుత్వం మంజూరు చేశారు. సంబండ వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలకు బీసీ భవన్, గిరిజన భవన్లను మంజూరు చేసింది.