దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సంక్షేమ సంబురాలు నింగినంటాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు ఊరూరా సభలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను వివరించారు. పలు గ్రామాల్లో రెండో విడుత గొర్రెల పంపిణీ చేయడంతోపాటు కొత్తగా ప్రకటించిన రూ.లక్ష ఆర్థికసాయం పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. తుక్కుగూడ మున్సిపాలిటీలోని మాంఖాల్ గ్రామంలో జరిగిన సంబురాల్లో మంత్రి సబితారెడ్డి పాల్గొని గొల్లకురుమలకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. వికారాబాద్లో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొని రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాల్గొని ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
బడంగ్పేట, జూన్ 9: సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విజన్తో ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం, తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం మంత్రి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆరోవార్డులోని ఇమామ్గూడలో రూ.10 లక్షలతో.. ప్రజయ్లో రూ.15లక్షలతో సీసీ రోడ్లు, రూ. 51 లక్షలతో ఏర్పాటు చేసిన వీధిలైట్లను ప్రారంభించారు. అనంతరం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మాంఖాల్ గ్రామంలో గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని కొనియాడారు. కుల, మత, పార్టీలకతీతంగా సంక్షే మ పథకాలు అందుతున్నాయని.. రాష్ట్రంలో సం క్షేమ పథకంతో లబ్ధి పొందని ఇల్లంటూ లేదని స్పష్టం చేశారు.
అంతేకాకుండా సీఎం కులవృత్తుల పునరుజ్జీవానికి కృషి చేస్తున్నారని.. కుల వృత్తుల వారికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులు, గంగపుత్రులకు సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి.. రజకులు, నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తూ ఆదుకుంటున్నారన్నారు. రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందనడానికి ఈ పథకాలే నిదర్శనమన్నారు. గడిచిన తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరోసారి గుర్తు చేసుకునేందుకే దశాబ్ది ఉత్సవాలను ఊరూరా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో చైర్మన్ మధుమోహన్, వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు తేజస్వీశ్రీకాంత్గౌడ్, విలాస్, రవీనాయ క్, లావణ్యారాజు, యాదగిరిరెడ్డి, సుధాకర్, రావిర్యాల మాజీ సర్పంచ్ లక్ష్మయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్, ఏఈ భార్గవ్రెడ్డి పాల్గొన్నారు.