రంగారెడ్డి, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి పరీక్షల సందర్భంగా చోటు చేసుకుంటున్న అవకతవకలను నివారించేందుకు జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా జిల్లాలోని రాజేంద్రనగర్ మండలం, బుద్వేల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాన్ని రంగారెడ్డి కలెక్టర్ హరీశ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా గదుల్లో తిరుగుతూ, పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా గమనించారు. విద్యార్థుల హాజరు గురించి కలెక్టర్ ఈ సందర్భంగా ఆరా తీశారు. సీసీ కెమెరాలో నిఘాలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని, ఎవరు కూడా సెల్ఫోన్ పరీక్షా కేంద్రానికి తీసుకురాకుండా చర్యలు చేపట్టాలని చీఫ్ సూపరింటెండెంట్కు సూచించారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసిన మీదట విద్యార్థులను లోనికి అనుమతించాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద మహిళా పోలీసు సిబ్బంది విధుల్లో ఉండేలా చూసుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, తప్పకుండా నిబంధనలు అమలయ్యేలా పర్యవేక్షణ జరపాలన్నారు. అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట రాజేంద్రనగర్ తహసీల్దార్ చంద్రశేఖర్ ఉన్నారు.
సెల్ఫోన్తో లోనికి రాకుండా చూడాలి
వికారాబాద్ : జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, అనంతగిరిపల్లిలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలుర ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాలు, తాగునీటి వసతి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో సెల్ఫోన్తో లోనికి ఎవరిని కూడా అనుమతించవద్దని, పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్కు సూచించారు. ఈ సందర్భంగా పరీక్షకు హాజరు కాని విద్యార్థుల వివరాలు తెలుసుకొని వారికి సంబంధించిన ప్రశ్నపత్రాల కౌంట్ను పరిశీలించారు. కలెక్టర్ వెంట వికారాబాద్ తహసీల్దార్ వహీదాఖాతూన్, ఎంఈవో బాబూసింగ్ ఉన్నారు.