కొత్తూరు, నవంబర్ 29 : వ్యవసాయంలో రోజురోజుకూ పెట్టుబడులు పెరిగి రైతుకు లాభాలు తగ్గిపోతున్నాయి. అంతేకాకుండా కూలీల కొరత కూడా విపరీతంగా వేదిస్తోంది. ఎకరా పొలంలో వరి పండించాలంటే రైతుకు వచ్చే లాభం కన్నా పెట్టుబడే అధికంగా ఉంటుందని రైతులు వాపోతున్నారు. దీంతో రైతు వరి పండించాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టింది. రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాజెక్టులు కట్టి నీటి పారుదలను పెంచారు. భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో చాలా మంది రైతులు వరి వేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే కూలీల కొరతను ఎదుర్కోవడం, పెట్టుబడి తగ్గించడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే డ్రమ్ సీడర్ విధానంతో వరి విత్తు పద్ధతిని రంగారెడ్డి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంది.
జోరుగా అవగాహన కార్యక్రమాలు..
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొత్తూరు మండంలోని 12 గ్రామ పంచాయతీల్లో డ్రమ్ సీడర్విధానంతో వరి విత్తు పద్ధతిపై అవగాహన కల్పిస్తున్నారు. మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామ పంచాయతీలకు వెళ్లి రైతులను కలిసి డ్రమ్ సీడర్ పద్ధతి గురించి వివరిస్తున్నారు. డ్రమ్ సీడర్ విధానాన్ని ప్రోత్సహించాలని సర్పంచ్లకు వినతిపత్రాలు అందజేస్తున్నారు. ఈ యాసంగి సీజన్లో కనీసం 100 ఎకరాల్లో డ్రమ్ సీడర్ విధానం ద్వారా వరి విత్తుకునేలా ప్రోత్సహిస్తామని చెబుతున్నారు. మండలంలోని గ్రామం పంచాయతీలో డ్రమ్ సీడర్ పరికరాన్ని ఉంచి రైతులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. నామ మాత్రపు రుసుములో రైతులందరికీ డ్రమ్ సీడర్ పరికరం అందుబాటులో ఉండే విధంగా తగు చర్యలు తీసుంటామని చెబుతున్నారు.
లాభాలను వివరిస్తూ ముందుకు..
డ్రమ్ సీడర్తో వరి విత్తుకుంటే పెట్టుబడులు తగ్గి లాభాలు పెరుగుతాయని చెబుతున్నారు వ్యవసాయ అధికారులు. పంటకాలాన్ని కూడా ఐదు నుంచి ఏడు రోజుల వరకు తగ్గించవచ్చని పేర్కొంటున్నారు. ఈ పద్ధతి వల్ల నీటి వాడకాన్ని కూడా తగ్గించవచ్చంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయ కూలీల కొరతను అధిగమించవచ్చని సూచిస్తున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల నార్లు పోయడం, వరినాటడం ఆలస్యమైతే దిగుబడులు తగ్గుతాయి. నారును నెల రోజుల పాటు పెంచి నారు పీకి నాటడానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది. ఈ విధానం వల్ల నీటి వినియోగం కూడా ఎక్కువగా ఉంటున్నది. అలాంటి సమయంలో డ్రమ్ సీడర్తో ఆ సమస్యను అధిగమించవచ్చు. డ్రమ్ సీడర్తో వరిని నేరుగా పొలంలో విత్తుకుంటే పెట్టుబడిని తగ్గించి దిగుబడులు పెంచుకోవడానికి వీలుంటుంది.
15కిలోల విత్తనం సరిపోతుంది
ఎకరాకు డ్రమ్ సీడర్ విధానం ద్వారా విత్తితే 15 కిలోల విత్తనాలు సరిపోతాయి. మామూలు పద్ధతిలో అయితే 30 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఈ పద్ధతి ద్వారా సమయం కూడా ఆదా అవుతుంది. అంతే కాకుండా గింజ గింజ మధ్య దూరం పెరగడం వల్ల దోమపోటు కూడా రాదు. రైతులను ప్రోత్సహించి డ్రమ్ సీడర్ ద్వారానే విత్తుకునేలా వారికి అవగాహన కల్పిస్తున్నాం.
– గోపాల్, మండల వ్యవసాయ అధికారి, కొత్తూరు
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం
డ్రమ్ సీడర్ పద్ధతిలో వరి విత్తడం గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మండలంలోని గ్రామ పంచాయతీలకు వెళ్లి సర్పంచ్ల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మామూలు పద్ధతికి డ్రమ్ సీడర్కు మధ్య గల తేడాలను రైతులకు తెలియజేస్తున్నాం. కూలీల కొరత, విత్తు విధానం తదితర వివరాలను నేరుగా రైతులకు వివరిస్తున్నాం. సర్పంచ్లతో మాట్లాడి డ్రమ్ సీడర్ విధానాన్ని ప్రోత్సహించాలని సూచిస్తున్నాం.
– అనిత, ఏఈవో, కొత్తూరు