పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా వచ్చే ఏడాదిలో 40.48 లక్షల మొక్కలను నాటాలని వికారాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ హరితహారం ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు శాఖల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించింది. జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లోని నర్సరీలతోపాటు అటవీ శాఖ ఆధ్వర్యంలోని 14 నర్సరీల్లోనూ మొక్కలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
మొక్కలను నాటేందుకు గుంతలు తీసే ప్రక్రియ నుంచి మొక్కలు నాటే వరకూ ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ చేయనున్నారు. ప్రధానంగా రోడ్లకు ఇరువైపులా.. అటవీ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటేందుకు ప్లాన్ చేస్తున్నారు. టేకు, శ్రీగంధం, ఉసిరి, నల్లమద్ది, పూలు, పండ్లు తదితర మొక్కలను నాటనున్నారు. కాగా గతేడాది జిల్లాలో 40.49 లక్షల మొక్కలను నాటాలని టార్గెట్గా పెట్టుకొని 39.69 లక్షల మొక్కలను నాటారు.
వికారాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా వచ్చే ఏడాదికి నాటాల్సిన మొక్కలకు సంబంధించి జిల్లా యంత్రాంగం ప్రణాళికలను సిద్ధం చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటేందుకుగాను నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని 566 గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీలతోపాటు అటవీ శాఖ ఆధ్వర్యంలోని 14 నర్సరీల్లో హరితహారంలో నాటే మొక్కలను సిద్ధం చేస్తున్నారు.
ఈ ఏడాది మాదిరిగానే వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా హరితహారం కార్యక్రమంలో అన్ని శాఖలను భాగస్వాములను చేసేలా ఆయా శాఖలకు నాటాల్సిన మొక్కల లక్ష్యాలను అటవీ శాఖ అధికారులు సిద్ధం చేశారు. మొక్కలను నాటిన అనంతరం విస్మరించకుండా ప్రతి మొక్కనూ బతికించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టనున్నది. హరితహారంలో భాగంగా మొక్కలను నాటేందుకు గుంతలను తీసే ప్రక్రియ నుంచి మొక్కలు నాటే ప్రక్రియ వరకూ ప్రతి మొక్కకు జియోట్యాగింగ్ చేయనున్నారు.
ప్రధానంగా టేకు, శ్రీగంధం, ఉసిరి, నల్లమద్ది, తెల్లమద్దితోపాటు పూలు, పండ్ల మొక్కలను నాటేందుకు ప్రాధాన్యతనివ్వనున్నారు. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఖాళీలను గుర్తించి మొక్కలను నాటేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్క సంరక్షణకు కూడా చర్యలు చేపట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 40.49 లక్షల మొక్కలను నాటాలని టార్గెట్గా నిర్ణయించగా, 39.69 లక్షల మొక్కలను నాటారు.
తెలంగాణకు హరితహారంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి 40.48 లక్షల మొక్కలను నాటాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్ణయించింది. శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యానికి సంబంధించి విద్యా శాఖ ఆధ్వర్యంలో -11 వేలు, పశుసంవర్థక శాఖ-5 వేలు, ఉద్యానవన శాఖ 2 లక్షలు, పరిశ్రమల శాఖ-10 వేలు, అటవీ శాఖ-5 లక్షలు, డీపీవో-డీఆర్డీవో-25 లక్షలు, గనుల శాఖ-50 వేలు, పౌరసరఫరాల శాఖ-2 వేలు, ఎక్సైజ్ శాఖ-43,500., వ్యవసాయ శాఖ-5 లక్షలు, మార్కెటింగ్ శాఖ-500, పోలీస్ శాఖ-10 వేలు, రోడ్లు, భవనాల శాఖ-500, జిల్లా సంక్షేమాధికారి-500, తాండూరు మున్సిపాలిటీలో 70 వేలు, వికారాబాద్ మున్సిపాలిటీ-80 వేలు, కొడంగల్ మున్సిపాలిటీ-35 వేలు, పరిగి మున్సిపాలిటీలో 30 వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లాలోని ఏయే మండలంలో ఎన్ని మొక్కలను నాటాలనే దానిపై సంబంధిత అధికారులు ప్రణాళికను రూపొందిస్తున్నారు.
ఈ దఫా హరితహారంలో ప్రధానంగా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. హరితహారంలో భాగంగా నాటే మొక్కల్లో ముఖ్యంగా టేకు, ఉసిరి, జామ, నిమ్మ, సీతాఫల్, దానిమ్మ, పప్పాయ, మునగ, కానుగ, నెమలినార, శ్రీగంధం తదితర మొక్కలను నాటనున్నారు. ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు.
ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలను నాటేలా ప్లాన్ను సిద్ధం చేస్తున్నారు. గ్రామాల్లో జామ, కరివేపాకు, దానిమ్మ, పప్పాయ, పూల మొక్కలైన గులాబీ, మందారం, మల్లె మొక్కలతోపాటు గ్రామం పరిధిలో వివిధ మొక్కలను నాటనున్నారు. ఈ ఏడాది జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో అనంతగిరి అటవీ ప్రాంతంతోపాటు మిగతా అన్ని అటవీ ప్రాంతాల్లోని ఖాళీలను గుర్తించి సంబంధిత ఖాళీల్లో ఔషధ మొక్కలను నాటనున్నారు. అటవీ శాఖ 14 నర్సరీల్లో 6,74,964 మొక్కలను సిద్ధం చేస్తున్నది.