ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 20 : సమయానుకూలంగా మార్కెట్లో డిమాండ్కు తగ్గట్టు పంటలు సాగు చేస్తూ అధిక లాభాలు పొందేలా రైతులు అడుగులు వేయాలి. దీర్ఘ కాలంలో పంట చేతికి వచ్చి ఆర్థికంగా ఆసరాగా నిలిచే పంటల్లో డ్రాగన్ ఫ్రూట్కు ప్రాధాన్యముంది. ఈ పంటను సాగు చేసే రైతులు నేరుగా మార్కెట్లో అమ్మితే మంచి లాభాలు సాధించే అవకాశముంటుంది. రైతులు అధికంగా పత్తి, వరి, జొన్న, మొక్కజొన్న తదితర కూరగాయల పంటలనే క్రమంగా సాగు చేస్తున్నారు. అందరూ ఒకేరకమైన పంటలు సాగుచేయడంతో మార్కెట్లో డిమాండ్ తగ్గుతున్నది.
ఒక్కోసారి పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పులపాలవుతున్నారు. ఈ క్రమంలో రైతులు మూస పద్ధతిని వీడి సరికొత్త విధానాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటివరకు విదేశాల్లోనే సాగుచేసే ఈ డ్రాగన్ ఫ్రూట్ను తెలంగాణ రాష్ట్రంలో రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా డ్రాగన్ప్రూట్ పంటలను సాగు చేస్తూ రైతులు లాభాలను గడిస్తున్నారు. ఒక్క ఎకరాతో సాగు ప్రారంభించి రైతులు క్రమంగా విస్తరిస్తున్నారు. ఎకరాకు రూ.4లక్షలు పెట్టుబడి పెడితే రెండో ఏడాది నుంచే పండ్లు కాసినా.. అనుకున్నంత దిగుబడి రాదు.
మూడో ఏడాది నుంచి పంట పూర్తిస్థాయిలో చేతికొస్తుంది. ఏడాదికేడాది దిగుబడి పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. ఈ పంటకు తెగుళ్ల బెడద అంతగా ఉండదు. పురుగుల మందులు అవసరంలేదు. ఎకరాకు రూ.20లక్షల వరకు రాబడి వస్తుందని సాగుచేసిన రైతులు వివరిస్తున్నారు.
25 ఏండ్ల వరకు దిగుబడి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల మండలం ఆరుట్లలో రైతు శ్రీనివాస్రెడ్డి మూడెకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగుచేశాడు. ఎకరాకు రూ.4 నుంచి రూ.5లక్షల పెట్టుబడి పెట్టాడు. సీఎం పింక్, డీ వెరైటీ రకాల మొక్కలను నాటాడు. 8 నెలల తర్వాత పంట దిగుబడి మొదలైంది. రెండో ఏడాది నుంచి కాస్త ఎక్కువ దిగుబడి వచ్చింది.
ఒక్కసారి డ్రాగన్ ఫ్రూట్ మొక్క నాటితే 20 నుంచి 25 ఏండ్ల వరకు దిగుబడి వస్తుంది. సేంద్రియ ఎరువులు వాడితే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశముంది. మూడో ఏడాది నుంచి తల్లి మొక్కల ద్వారా విత్తనాలు తయారుచేసే అవకాశం ఉండడంతో అదనపు ఆదాయం సమకూరుతుంది. ఒక్కో మొక్క రూ.50 నుంచి రూ.70వరకు అమ్ముకోవచ్చని చెబుతున్నారు.
వ్యవసాయంలో నిలదొక్కుకోవాలంటే రైతులు సాగు పోకడలు ఎలా మార్పు చెందుతున్నాయో ముందు తెలుసుకోవాలి. ఇటీవల రైతుల ఆలోచనల మధ్య ఎంతో వైవిధ్యం ఉంది. కొందరు కర్షకులు సేద్యాన్ని జీవనాధారంగా చూస్తుంటే.. మరికొందరు వ్యాపారంగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం డ్రాగన్ఫ్రూట్ సాగు వైపు వారు అడుగులు వేస్తున్నారు.
మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో ఈ పంట సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక్కసారి పంట వేస్తే 25 ఏండ్ల వరకు దిగుబడి రావడంతో పాటు లాభాలు ఆర్జించవచ్చని ఆశ పడుతున్నారు. ప్రారంభంలో పెట్టుబడి ఎక్కువైనా, మొదటి రెండేండ్లు దిగుబడి అంతగా రాకపోయినా.. మూడో ఏడాది నుంచి దీర్ఘకాలికంగా ఆదాయం వస్తుందనే యోచనలో ఉన్నారు.
పంట సాగు విధానం..
డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసేందుకు ఎకరాకు 500 స్తంభాలు అవసరమవుతాయి. పోల్, పోల్కు మధ్య దూరం 8 ఫీట్ల పొడవు, 10 ఫీట్ల వెడల్పు ఉండాలి. ఒక్కో స్తంభం చుట్టూ నాలుగు నుంచి ఐదు మొక్కలు నాటాలి. ఎకరాకు 2వేల నుంచి 2,500 మొక్కలు అవసరమవుతాయి. ఏడాదిలో రెండుసార్లు సేంద్రియ ఎరువులను వేయాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. డ్రిప్ ద్వారా నీటిని అందించాల్సి ఉంటుంది.
నాటిన మూడో ఏడాది నుంచి దిగుబడులు అధికంగా వస్తాయి. ఎకరాకు సుమారు 10-13 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశముంది. ప్రస్తుతం మార్కెట్లో వ్యాపారులు కిలోకు రూ.150 నుంచి రూ.180 వరకు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ లేకపోతే కిలోకు రూ.50లకు విక్రయించినా సుమారు రూ.5లక్షల వరకు ఆదాయం వస్తుంది. బహిరంగ మార్కెట్లో కిలో రూ.200 నుంచి రూ.300వరకు పలుకుతున్నది.
ఆరోగ్యానికి ఎంతో మేలు
డ్రాగన్ ఫ్రూట్లో మనిషికి కావాల్సిన ఎన్నో పోషకాలున్నాయి. ఈ పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒమేగా-3 ప్యాటీయాసిడ్స్, చాలా విటమిన్లు ఉన్నాయి. ఈ పండులో క్యాలరీఫ్రూట్, విటమిన్-ఏ ఉండడంతో కంటి చూపుకు మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉండడంతో జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది. విటమిన్-సీ ఉండడంతో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. షుగర్ నియంత్రణలో సహాయ పడుతుంది.
– దినేష్, ప్రముఖ వైద్యనిపుణులు