వికారాబాద్ జిల్లాలోని పేదల కలల సౌధం డబుల్ బెడ్ రూం ఇండ్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న సదుద్దేశంతో డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాకు 3,800 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేసింది. ఇందులో 2,257 ఇండ్ల నిర్మాణాల పనులు ఆయా దశల్లో కొనసాగుతుండగా, చిన్నచిన్న పనులు మినహా 580 ‘డబుల్’ ఇండ్ల నిర్మాణాలు పూర్తై త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలోని ధారూరు, మర్పల్లి, మోమిన్పేట, యాలాల మండలంలోని కోకట్లలో 550 ఇండ్ల నిర్మాణాల పనులు తుది దశకు చేరుకోగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనుల కోసం రూ.4.03 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పనులను వచ్చే నెలాఖరులోగా పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు కులకచర్ల మండలంలోని అడవి వెంకటాపూర్లో 30 ఇండ్ల నిర్మాణాలతో పాటు మౌలిక వసతుల పనులు కూడా పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
వికారాబాద్, ఫిబ్రవరి 14, (నమస్తే తెలంగాణ): గూడులేని నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే యాలాల మండలంలోని కోకట్, కులకచర్ల మండలంలోని అడవి వెంకటాపూర్, ధారూరు, మర్పల్లి, మోమిన్పేట్లలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మార్చి నెలాఖరులోగా ఎట్టిపరిస్థితుల్లోనూ తుది దశకు చేరిన ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని జిల్లా పాలనాధికారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ప్రధాన పనులు పూర్తి కావడంతో తుది దశ పనులు జరుగుతున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
కొనసాగుతున్న పనులు
తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలం కోకట్లో నిర్మిస్తున్న 420 డబుల్ బెడ్రూం ఇండ్లలో 180, ధారూరులో 120, మర్పల్లిలో 120, మోమిన్పేట్లో 130 ఇండ్ల నిర్మాణం పూర్తికాగా, సంబంధిత డబుల్ బెడ్రూం ఇండ్లల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు చేయాల్సి ఉంది. 550 ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం రూ.4.03 కోట్ల నిధులను కూడా విడుదల చేసింది. ఇండ్లల్లో మౌలిక వసతులు కల్పించే పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తికాగా, వీలైనంత త్వరితగతిన పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు కులకచర్ల మండలంలోని అడవి వెంకటాపూర్లో నిర్మిస్తున్న 30 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులతోపాటు మౌలిక వసతుల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. జిల్లావ్యాప్తంగా 3800 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా.. మంజూరైన ఇండ్లన్నింటికీ పరిపాలన అనుమతులురాగా, 2257 ఇండ్ల నిర్మాణాలు ఆయా దశల్లో కొనసాగుతున్నాయి.
శరవేగంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు
జిల్లాలో తాజాగా వికారాబాద్లోని 160 ఇండ్లకు ఇప్పటికే టెండర్లు పూర్తికాగా పనులు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా వికారాబాద్తోపాటు కులకచర్ల మండలంలోని ఇప్పాయిపల్లిలో 10 ఇండ్లకు, మోమిన్పేట్ మండలంలోని టేకులపల్లి గ్రామంలో మరో 10 ఇండ్లకు టెండర్ల ప్రక్రియ పూర్తవడంతో త్వరలోనే పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. తొలి విడుతలో ఒక్కో నియోజకవర్గానికి 400 చొప్పున డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేయగా.. అనంతరం అదనంగా డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేసింది. తాండూరు నియోజకవర్గానికి 1500లకుపైగా డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరుకాగా.. ఇప్పటివరకు 1001 ఇండ్ల నిర్మాణం ఆయా దశల్లో కొనసాగుతున్నది.
వికారాబాద్ నియోజకవర్గంలో 526, పరిగి నియోజకవర్గంలో 430, కొడంగల్ నియోజకవర్గంలో 300 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ఆయా దశల్లో కొనసాగుతున్నది. చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట మండలానికి సంబంధించి డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు ఇంకా షురూ కాలేదు. ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్ ఖర్చు రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. యూనిట్ కాస్ట్తోపాటు మౌలిక వసతుల నిమిత్తం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.25 లక్షలు, అర్బన్ ప్రాంతంలో రూ.75వేలను డ్రైనేజీ, నీటి వసతి తదితర మౌలిక వసతులకుగాను ప్రభుత్వం అందజేస్తున్నది. డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి 500 చదరపు గజాల్లో రెండు పడకల గదులు, హాల్, వంటగది ఉండేలా సంబంధిత అధికారులు ప్లాన్ చేశారు.