సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): మీకు సులువుగా పనిపూర్తి కావాలంటే ఎనీడెస్క్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.. అంటూ ముక్కు ముఖం తెలియని వ్యక్తులు చెబితే .. అది పక్కాగా మోసమని గుర్తించాలి. విశ్రాంత ఉద్యోగులు, ఇంటర్నెట్పై అవగాహన లేని వారిపైనే సైబర్ నేరగాళ్లు ఫోకస్ చేసి.. రిమోట్ యాప్లతో ఆయా బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇటీవల విద్యుత్ బిల్లుల కట్టలేదని ఫోన్లు చేసి, వెంటనే బిల్లు కట్టాలంటే ఎనీడెస్క్ యాప్ను డౌన్లోడ్ చేసుకోమని చెప్పడం.. కస్టమర్ కేర్కు ఫోన్ చేస్తే.. మీరు రిమోట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచనలు చేయడం.. కేవైసీ అప్డేట్.. ఇలా పలు రకరకాల పేర్లతో ఇంటర్నెట్పై ఆధారపడే వారిని లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు.. అమాయకలతో రిమోట్ యాప్లను డౌన్లోడ్ చేయిస్తూ బ్యాంక్ ఖాతాల్లోకి చొరబడుతున్నారు. అందినంత దోచుకుంటున్నారు.
గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్చేసి మీ ఫోన్లో ఫలాన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.. అని చెబితే అది మోసమని గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులకు వివరాలు ఇవ్వరాదు. రిమోట్ యాప్లను ఉపయోగించి మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తారు. ఒకవేళ మోసం జరిగితే వెంటనే బ్యాంకుకు ఫోన్చేసి ఖాతాను స్తంభింప చేయాలి. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలి. రిమోట్ యాప్ను డౌన్లోడ్ చేయిస్తున్నారంటే వాళ్లు దొంగలని అనుమానించాలి. కోడ్ చెప్పారంటే దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్టే.
– కేవీఎం ప్రసాద్, ఏసీపీ సైబర్క్రైమ్స్