కులకచర్ల, జనవరి 22 : అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేసిన కోడి గుడ్లను మార్కెట్లో విక్రయిస్తే చర్యలు తప్పవని వికారాబాద్ జిల్లా సంక్షేమ అధికారిణి(డీడబ్ల్యూవో) లలితకుమారి అన్నారు. ‘అంగట్లో అంగన్వాడీ గుడ్లు’ అనే శీర్షికతో సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. అంగన్వాడీ కేంద్రాలకు చెందిన కోడి గుడ్లపై ప్రభుత్వానికి చెందిన ముద్ర ఉంటుందని, వాటిని ఎక్కడ విక్రయించినా పట్టుకోవచ్చన్నారు.
అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లు సరఫరా చేసే వ్యాపారులపై ఇప్పటికే నిఘా ఉంచామని.. వాటిని బయట అమ్మేందుకు వీలులేదన్నారు. చౌడాపూర్ మండల కేంద్రంలో కోడి గుడ్లను విక్రయించిన మందిపల్ గ్రామానికి చెందిన పెంటయ్యపై తమ సూపర్వైజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఈ విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తీసు కెళ్లారన్నారు. ఆ గుడ్లు వికారాబాద్ జిల్లాకు చెందినవి కాదని.. మహబూబ్నగర్కు చెందిన వ్యక్తి వాటిని తీసుకొచ్చినట్లు విచారణలో తేలిందన్నారు.
అంగన్వాడీ కేంద్రాలకు చెందిన గుడ్లను చౌడాపూర్లో విక్రయిస్తూ పట్టుబడిన పెంటయ్యపై కేసు నమోదు చేయించినట్లు చౌడాపూర్ తహసీల్దార్ ప్రభులు తెలిపారు. ప్రభుత్వం ద్వారా సరఫరా చేస్తున్న గుడ్లను విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. అదేవిధంగా చౌడాపూర్లో 2011 నుంచి ఆధార్కార్డులు పంచకుండా చెత్త ట్రాక్టర్లో పడేసిన పోస్టుమ్యాన్పైనా చర్యలు తీసుకుని క్రిమినల్ కేసు పెట్టించడం జరిగిందని తహసీల్దార్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను సంబంధిత డిపార్ట్మెంట్కు పంపించినట్లు చెప్పారు.