తాండూరు, ఫిబ్రవరి 2 : ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని వికారాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం తాండూరు పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులు రోడ్డు నియమాలను పాటించాలని గులాబీ పువ్వులు అందజేస్తూ విస్తృత ప్రచారం చేశారు. చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు, ఆర్టీసీ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ప్రజలు, నేతలు పోలీస్ సిబ్బందితో కలిసి ఇందిరాచౌక్లో మానవహారం నిర్మించారు. బాధ్యతతో రోడ్డు నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు సేఫ్టీ గురించి తెలుసుకోవాలన్నారు.
దేశంలో ప్రతి నిమిషానికీ ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుండగా, ప్రతి మూడు నిమిషాలకు ఒకరు మృత్యువాత పడుతున్నారని తెలిపారు. ఎక్కువ శాతం అధిక వేగంతోనే ప్రమాదాలు చోటుచేసుకొని ప్రాణ నష్టం జరుగుతున్నదన్నారు. వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, మద్యం సేవించి, హెల్మెట్, సీట్బెల్ట్ పెట్టుకోకుండా వాహనాలు నడుపొద్దని సూచించారు. 18 ఏండ్లలోపు పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదని సూచించారు. తాండూరులో ట్రాఫిక్ పోలీసులను నియమించనున్నట్లు వెల్లడించారు.
అక్రమ ఇసుకరవాణా, గంజాయి అడ్డుకట్టకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎక్కడైనా అన్యాయం, అక్రమాలు జరిగితే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. తాండూరు డీఎస్పీ శేఖర్గౌడ్ మాట్లాడుతూ ప్రజలు తూచా తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. రోడ్డు నియమాలు పాటించని వారు ఎంతటివారైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లావణ్య, తాండూరు పట్టణ సీఐ సంతోష్కుమార్, రూరల్ సీఐ అశోక్, తాండూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సమతారెడ్డి, పోలీస్ సిబ్బంది, కౌన్సిలర్లు, నేతలు, విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజలు పాల్గొన్నారు.