వికారాబాద్, డిసెంబర్ 1 : గతంలో రెండు హత్యలు చేసి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని పోలీస్స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించి, హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ 2019 సంవత్సరంలో రెండు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యం కాగా, ఆనాటి నుంచి రెండు హత్యలు చేసి తప్పించుకొని తిరుగుతున్న నిందితుడికి సంబంధించిన ఆధారాలు, ఆచూకీ లభించలేదు.
గురువారం వికారాబాద్ టౌన్ ఎస్ఐ సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి వికారాబాద్ పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పట్టణంలోని రైల్వేస్టేషన్ వద్ద గంజాయి అమ్ముతూ అనుమానాస్పదంగా తిరుగుతున్న సల్మాన్ అనే యువకుడిని పట్టుకొని విచారించగా ఆ రెండు హత్యలు తానే చేశానని ఒప్పుకున్నట్లు వెల్లడించారు. కేసులను ఛేదించిన ఎస్ఐ సత్యనారాయణ, కానిస్టేబుల్ బాలకృష్ణకు రివార్డులు అందించి ఎస్పీ అభినందించారు.