ఇబ్రహీంపట్నం, మే 17 : ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రంగారెడ్డి అదనపు కలెక్టర్ తిరుపతిరావు అన్నారు. మంగళవారం రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి కాలుష్య నియంత్రణ మండలి టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడటం ద్వారా కలిగే నష్టాలను ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి ప్లాస్టిక్ తయారుచేసే పరిశ్రమలను తనిఖీ చేసి తయారీని పూర్తిగా నిషేధించాలన్నారు.
మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. మాల్స్, వీధి వ్యాపారులు, పండ్లు విక్రయించేవారు కూడా నిబంధనల ప్రకారం ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించేందుకు విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. రంగారెడ్డిజిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడం కోసం అధికారులు కృషిచేయాలన్నారు. ప్లాస్టిక్ నివారణకు జిల్లాస్థాయి టాస్క్ఫోర్స్ కమిటీని నియమించామని, ఈ కమిటీలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, వైద్యారోగ్యశాఖ అధికారి, కాలుష్య నియంత్రణ మండలి అధికారితో పాటు మున్సిపల్ కమిషనర్లు మెంబర్లుగా ఉంటారన్నారు. సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారి వెంకన్న, జిలాల పరిశ్రమలశాఖ అధికారి రాజేశ్వర్రెడ్డి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి, ఆయా మున్సిపాలిటీ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.