ఇబ్రహీంపట్నం, మార్చి 22 : రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిన విషయం తెలిసిందే. అయినా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఏప్రిల్ 21న జిల్లాస్థాయి మహిళా సదస్సులు, 25వరకు నియోజకవర్గాల వారీగా జెండా పండుగలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నారు. 29, 31తేదీల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, ప్రతి నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగనున్నారు. ఇక జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు వీడటంలేదు. ఎవరికి వారే టికెట్లను ఆశిస్తూ జోడో యాత్రలు చేస్తున్నారు. బీజేపీ పరిస్థితి అగమ్యగోచరమే. టికెట్ల కోసం వర్గపోరు భగ్గుమంటుండడం విశేషం.
రంగారెడ్డిజిల్లాలో బీఆర్ఎస్ పార్టీని మరింత పటిష్టపర్చటం కోసం ఆ పార్టీ అధినాయకత్వం దృష్టి సారించింది. ఇప్పటికే జిల్లాలో బలమైన శక్తిగా ఉన్న బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయటం కోసం వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగానే నెలరోజులపాటు జిల్లావ్యాప్తంగా పది గ్రామాలకు ఒక్కటి చొప్పున ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి, జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డి, జిల్లా సమన్వయకర్త ఎల్.రమణ, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సమాయత్తమవుతున్నారు.
ఏప్రిల్ 21న జిల్లాస్థాయి మహిళా సదస్సులు ఏప్రిల్ 22 నుంచి 25 వరకు నియోజకవర్గాలవారీగా జెండా పండుగలు ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ కార్యక్రమాలుఏప్రిల్ 29, 31 తేదీల్లో ఆత్మీయ సమ్మేళనాలుఈ కార్యక్రమాల ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయటంతో పాటు కార్యకర్తలు, నాయకులను ఏకతాటిపై తీసుకువచ్చేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించి, వారిని బీఆర్ఎస్వైపు దృష్టి మళ్లించే కార్యక్రమాలపై ఫోకస్ పెడుతున్నారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, షాద్నగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ నెలరోజులపాటు ప్రజల్లో ఉంటూ పార్టీ పటిష్టత కార్యక్రమాలపై దృష్టి సారించనున్నారు.
కాంగ్రెస్ పార్టీని వీడని అంతర్గత కలహాలు
జిల్లాలోని కాంగ్రెస్ పార్టీని అంతర్గత కలహాలు వీడటంలేదు. పార్టీ పటిష్టతకోసం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఓవైపు కృషిచేస్తుండగా, కిందిస్థాయి నాయకులు కలిసిరావటంలేదు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి నాలుగు స్థంబాలాటగా మారింది. ఇబ్రహీంపట్నం టికెట్ కోసం మల్రెడ్డి రంగారెడ్డి, మర్రి నిరంజన్రెడ్డి, కోదండరెడ్డి, దండెం రాంరెడ్డి, ఈసీ శేఖర్గౌడ్ ఎవరికి వారే టికెట్ ఆశిస్తూ జోడోయాత్రలు చేస్తున్నారు. జిల్లాలోని చేవెళ్ల, మహేశ్వరం, షాద్నగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీకి పెద్దదిక్కు లేకుండా పోయింది. ఉన్నవారిలో కూడా టికెట్ల ఆశావాహుల సంఖ్య కూడా పెరిగింది. దీంతో ఎవరికి వారే వర్గాలను పోషిస్తున్నారు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా మారింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ అంతర్గత కలహాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నది.
బీజేపీలోనూ పెరిగిపోతున్న ఆశావహులు
రంగారెడ్డిజిల్లాలో బీజేపీ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. ఆ పార్టీ టికెట్ల కోసం పోటీ తీవ్రమైంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీజేపీ టికెట్కోసం సుమారు 10 మంది వరకు పోటీపడుతున్నారు. కొత్తగా టికెట్ ఆశిస్తూ మరికొంతమంది బయట నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మహేశ్వరం నియోజకవర్గంలోనూ గతంలో పోటీచేసిన అందెల శ్రీరాములు, తూళ్ల వీరేందర్గౌడ్ పోటీపడుతుండగా.. టికెట్ హామీ ఇస్తే మరికొంతమంది పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఆ పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. దీంతో జిల్లాలో బీజేపీ కార్నర్ మీటింగ్లు, కార్యకర్తల మీటింగ్లు పెడుతున్నప్పటికీ అంతగా స్పందన రావటంలేదు.
బీఆర్ఎస్లో భారీగా చేరికలు
జిల్లాలో మరోవైపు బీఆర్ఎస్పార్టీలో చేరికల పరంపర కొనసాగుతున్నది. అన్ని నియోజకవర్గాల్లో వివిధ పార్టీలకు చెందిన కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గంలో జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో నియోజకవర్గాలు అభివృద్ధిలో ఉరకలు వేస్తున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు వివరించి మరింత బలోపేతం చేయటం కోసం పెద్దఎత్తున కిందిస్థాయి కార్యకర్తలు, నాయకులు కంకణబద్దులై పనిచేస్తున్నారు. కిందిస్థాయి క్యాడర్ కష్టపడి పనిచేయటం ద్వారా బీఆర్ఎస్లో జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున చేరికల పరంపర కొనసాగుతున్నది.
పార్టీ పటిష్టత కోసం నెలరోజుల పాటు ఆత్మీయ సమ్మేళనాలు : మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం పార్టీ పటిష్టత కోసం జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి పార్టీని మరింత బలోపేతం చేయటం కోసం కార్యకర్తలను సమాయత్తం చేసే కార్యక్రమాలను చేపట్టనున్నాం. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించి పార్టీ రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి బలీయమైన శక్తిగా మార్చేందుకు కృషిచేయనున్నాం. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం ఏ పార్టీ కూడా పోటీరాదు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు.