వికారాబాద్, ఫిబ్రవరి 15 : సంప్రదాయ చేతి వృత్తులవారిని, హస్త కళాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ.. వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వినయ్కుమార్ సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పీ.ఎం విశ్వకర్మ పథకంపై ఎంఎస్ఎంఈ (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్), జిల్లా పరిశ్రమల కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతానికి చెందిన అర్హులైన ప్రతిఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ పథకం ఉద్దేశాలు, ప్రయోజనాలను అయన వివరిస్తూ.. అర్హులైన విశ్వకర్మలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు మీ సేవ కేంద్రాలు లేదా గ్రామపంచాయతీ కార్యాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, బ్యాంకు వివరాలతో పాటు రేషన్ కార్డు వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
కమ్మరులు, స్వర్ణకారులు, వడ్రంగులు, శిల్పులు, స్వర్ణకారులు, చెప్పులు కుట్టేవారు, బుట్టలు, చాపలు, చీపుర్లు తయారు చేసేవారు, దర్జీలు, చేపల వలలు తయారు చేసేవారు, పూలదండలు తయారు చేసేవారు, చర్మకారులు, రజకులు, ఆయుధాలు తయారు చేసేవారు, చేతి వృత్తులు, హస్త కళాకారులు వంటి 18 కేటగిరీలలో పని చేస్తున్న వారు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా స్వయం ఉపాధి ఏర్పర్చుకోవాలనుకునే చేతి వృత్తిదారులు, హస్త కళాకారులకు ఈ పథకం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు. చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న ఏ కులానికి సంబంధించిన వారైనా సరే ఈ పథకానికి అర్హులని స్పష్టం చేశారు. పీ.ఎం విశ్వకర్మ యోజన కింద దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులైన వారిని ఎంపిక చేసి నైపుణ్యం మెరుగుదల కోసం 7 రోజుల నుంచి 15 రోజుల వరకు శిక్షణ అందిస్తారని, శిక్షణా కాలంలో రోజుకు రూ.500 చొప్పున స్టైఫండ్ చెల్లిస్తారని వివరించారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ధ్రువీకరణ పత్రం, గుర్తింపు కార్డు జారీ చేస్తారన్నారు.
లబ్ధిదారులకు రుణ సహాయం కింద రెండు విడుతలుగా మొత్తం మూడు లక్షల రూపాయలు అందిస్తారని తెలిపారు. లబ్ధిదారులు రాయితీ వడ్డీ రేటు కేవలం ఐదు శాతంపై రుణ సదుపాయం పొందవచ్చని అయన సూచించారు. విశ్వకర్మలు తయారుచేసే వస్తువులకు సరైన మార్కెటింగ్ వసతి లభించేలా ఎం.ఎస్.ఎం.ఈ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఇలా అనేక ప్రయోజనాలతో కూడుకుని ఉన్న పీ.ఎం విశ్వకర్మ పథకం గురించి గ్రామగ్రామాన విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, అర్హులైన ప్రతిఒక్కరూ ప్రయోజనం పొందేలా చొరవ చూపాలని సి.ఎస్.సి కేంద్రాల ఆపరేటర్లు, గ్రామపంచాయతీల కార్యదర్శులను కోరారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ తేదీ నాటికి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలన్నారు.
గత ఐదేండ్లలో స్వయం ఉపాధి/వ్యాపార అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రుణాలు పొందినవారు ఈ పథకానికి అర్హులు కాదన్నారు. ముద్ర, స్వనిధి పథకాల లబ్ధిదారులు తమ రుణాలను చెల్లించినట్లైతే ఈ విశ్వకర్మ పథకానికి అర్హులని తెలిపారు. ఈ పథకం కుటుంబంలోని ఒకరికి మాత్రమే వర్తిస్తుందని, ప్రభుత్వ సర్వీసులో ఉన్న వ్యక్తికి/కుటుంబసభ్యులకు ఈ పథకం వర్తించదన్నారు. సదస్సులో ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ సుధీర్కుమార్, ఎస్బీఐ రీజినల్ ఆఫీస్ చీఫ్ మేనేజర్ (క్రెడిట్) వికాస్ సాహూ, ఎల్డీఎం రాంబాబు, మెప్మా పీడీ రవికుమార్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ సహాయ అధికారి భీమ్రాజు, సీఎస్సీ ఆపరేటర్లు, ఔత్సాహిక విశ్వకర్మలు, సంబంధిత అధికారులున్నారు.