వికారాబాద్, జనవరి 27 : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి ఎన్. శంకర్నాయక్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం వికారాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కార్యాలయంలో ఆయా జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా జనరల్లో 35, ఒకేషనల్లో 13 ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జనరల్ ద్వితీయ సంవత్సరంలో 4,177 మంది సైన్స్ విద్యార్థులు, ఒకేషనల్ కోర్సుల్లో మొదటి సంవత్సరం లో 1,352 మంది, ద్వితీయ సంవత్సరంలో 1,259 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్ పరీ క్షలు జరుగుతాయన్నారు. ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్లు, ప్రింటర్లతోపాటు అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు.
ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు బ్యాచ్లు, సబ్జెక్టుల వారీగా రెండు సెషన్లలో నిర్వహిస్తారన్నారు. విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లు, ప్రాక్టికల్ టైమ్ టేబుల్ను వారు చదువుతున్న కళాశాలల ప్రిన్సిపాళ్ల దగ్గర నుంచి పొందొచ్చన్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు విద్యార్థులు కనీసం గంట ముందు కేంద్రాలకు చేరుకునేలా తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు.